Telangana Teachers Protest: 'మల్టీ జోన్లలో ఖాళీలున్నా.. మమ్మల్ని గోస పెడుతున్నారు'

author img

By

Published : Jan 11, 2022, 7:13 AM IST

Telangana Teachers Protest

Telangana Teachers Protest: భారీ సంఖ్యలో మల్టీ జోన్లలో ఖాళీలున్నా.. కుటుంబాలను గోస పెట్టేలా అధ్యాపకులను అటుఇటు మార్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను తప్పించాలంటూ ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విద్యామంత్రి సబిత ఇంటి ఆవరణలో అధ్యాపకులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని, అధ్యాపకుల మల్టీ జోనల్‌ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని నినదించారు.

Telangana Teachers Protest : ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జిల్లాలు, మల్టీ జోన్లు కేటాయించినా వారి ఆందోళనలు, ధర్నాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకులు సోమవారం ఏకంగా విద్యాశాఖ మంత్రి సబిత ఇంటి ఆవరణలో ధర్నాకు దిగగా.. భార్యాభర్తల విభాగం ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేనను కలిసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. బహుళ జోన్‌లోకి మళ్లిన వారిని మళ్లీ కోరుకున్న జోన్‌కు మార్చాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళతానని సంచాలకురాలు హామీ ఇచ్చారు. మరోవైపు సీనియారిటీ, తప్పుల సవరణ, భార్యాభర్తల విభాగంపై ఇంకా వందల అర్జీలు వస్తుండటంతో వాటినీ పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల నుంచే 40 వరకు అప్పీళ్లు అందాయి.

విద్యాశాఖ కార్యదర్శిని తప్పించాలంటూ..

Teachers Protest in Telangana : భారీసంఖ్యలో మల్టీ జోన్లలో ఖాళీలున్నా.. కుటుంబాలను గోస పెట్టేలా అధ్యాపకులను అటుఇటు మార్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను తప్పించాలంటూ ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విద్యామంత్రి సబిత ఇంటి ఆవరణలో అధ్యాపకులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని, అధ్యాపకుల మల్టీ జోనల్‌ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని నినదించారు. సంఘం ఛైర్మన్‌ డా.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ వితంతువులని కూడా చూడకుండా సుదూర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారని విమర్శించారు. విద్యాశాఖ కార్యదర్శి ఘనకార్యాలు అన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అధ్యాపకుల వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో అధ్యాపకులు కమిషనర్‌ జలీల్‌ను కూడా ఘెరావ్‌ చేశారు.

Telangana Teachers Dharna : ఉపాధ్యాయులను కొత్త జిల్లాల వారీగా కేటాయించడం, పోస్టింగులకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించడమే తప్ప పరిష్కరించడం లేదని, వెంటనే వాటిపై నిర్ణయం తీసుకోవాలని పీఆర్‌టీయూ నేతలు ఎం.చెన్నయ్య, ఎం.అంజిరెడ్డి సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన వద్ద ఆందోళన వ్యక్తంచేశారు. విద్యాశాఖ కార్యదర్శితో చర్చించి వెంటనే జాబితాను డీఈవోలకు పంపిస్తామని సంచాలకురాలు చెప్పినట్లు నేతలు పేర్కొన్నారు.


మంత్రి ఇంటి ఆవరణలో ప్లకార్డులతో ధర్నా చేస్తున్న ప్రభుత్వ జూనియర్‌ అధ్యాపకులు

13 జిల్లాల్లో ఖాళీలే లేవా?

ఉద్యోగులైన భార్యాభర్తలను ఒకే జిల్లాలో సర్దుబాటు చేస్తామన్న ప్రభుత్వం పలు జిల్లాల్లో ప్రక్రియ చేపట్టకుండా నిలిపివేసిందని ఉపాధ్యాయులు ఆరోపించారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వారంతా లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. 19 జిల్లాల్లోని దంపతులకు అక్కడే అవకాశం కల్పించిన అధికారులు.. కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మెదక్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, మంచిర్యాల తదితర 13 జిల్లాల్లో మాత్రం విస్మరించారని విమర్శించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని లాక్‌ చేశారని వాపోయారు. భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే జిల్లాలో ఉండేలా అవకాశమిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. దాదాపు 2500 మంది దంపతులు 100-250 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.