దిల్లీ చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు

author img

By

Published : Aug 1, 2022, 3:13 PM IST

politics in delhi

తెలంగాణ రాజకీయం హస్తిన చుట్టూ తిరుగుతోంది. వారం పాటు దిల్లీలో మఖాం వేసిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకున్న వెంటనే.. కాంగ్రెస్‌, భాజపాలు హస్తిన బాట పట్టాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్న నేతలు.. దిల్లీ వేదికగా జాతీయ నేతలతో దిశానిర్దేశంతో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అధిష్ఠానాల పిలుపు మేరకు హస్తినకు చేరుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌, భాజపా నేతలు.. పార్టీ బలోపేతం, నేతల చేరికలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది.

జాతీయ స్థాయి రాజకీయాలు, ప్రత్యర్థులను చిత్తు చేసేలా అధికార తెరాస వ్యూహాలు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చేరికలు, ప్రజాకర్షక నినాదాలతో బలోపేతమయ్యే లక్ష్యంతో భాజపా.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలం, నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటూ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్.. ఇలా.. రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా వ్యూహాలకు పదును పెడుతూ.. జనంలో బలం పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నాయి.

కేంద్ర సర్కార్‌పై విమర్శల జోరు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... వారం రోజుల పాటు హస్తినలో మఖాం వేశారు. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలు, ఇతర ప్రతినిధులతో వరుస భేటీలు జరిపారు. రైతు సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించిన సీఎం.. తెలంగాణలో అమలవుతోన్న పథకాల గురించి వివరించారు. దేశవ్యాప్తంగా పంటలకు మద్దతు ధర, ఇతర అంశాలపై సమగ్ర విధానంతో కూడిన జాతీయ స్థాయి రైతు ఎజెండా రూపకల్పనపై.. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించారు. వివిధ జాతీయ ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో జరిగిన కేసీఆర్‌ భేటీలో... పలు అంశాలపై చర్చించారు.

దిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానున్న హస్తం నేతలు.. పార్టీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి దిల్లీలోనే ఉండగా... కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం దిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం నుంచి సమాచారం వచ్చింది. ఇప్పటికే భట్టి దిల్లీకి పయనం కాగా... తాను అక్కడి వరకు రాలేనని... అవసరమైతే ఫోన్‌లో అందుబాటులో ఉంటానని జానారెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెరాసను దెబ్బకొట్టే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌కు... ఇటీవల పరిణామాలు ప్రతిబంధకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో కీలక నేతలు పార్టీని వీడకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు పార్టీల చేరికలు, ఉపఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో దూకుడు మీదున్న భాజపా... తెరాసను గద్దె దించటం, కాంగ్రెస్‌ను ఖాళీ చేయించే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేసిన ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో... భాజపాలో చేరే వారి జాబితాను సైతం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే... కమలం నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌, వివేక్‌ కీలక నివేదికలతో దిల్లీకి చేరుకున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్​ సంతోష్‌తో భేటీకానున్న రాష్ట్ర నేతలు... పార్టీలో చేరికలు, ఇతరాత్ర విషయాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే అంశంపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశముంది. అలాగే, మరో 15 మంది ఇతర నేతల ప్రొఫెల్‌ను సేకరించిన రాష్ట్ర నాయకత్వం... దీనిని అధిష్ఠానానికి అందించనుంది. ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వర్చువల్‌గా హాజరుకానున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.