తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా అమిత్ షా

author img

By

Published : Sep 16, 2022, 7:03 AM IST

telangana liberation day celebrations

telangana liberation day celebrations : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి సర్వంసిద్ధమైంది. రేపటి వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్‌ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పతాకం ఆవిష్కరించగా.... ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భాజపా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.

telangana liberation day celebrations : భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన అమృతోత్సవాలను విజయవంతం చేసేందుకు... కేంద్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇవాళ రాత్రి 9 గంటల 50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజేంద్ర నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

telangana liberation day celebrations 2022 : ఏడు కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 13 వందల మంది కళాకారుల ప్రదర్శనను తిలకించనున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోయన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించడానికి కారణాలు, కేసీఆర్‌ వైఖరిపై అమిత్‌షా ప్రసంగిస్తారని సమాచారం. విమోచన అమృతోత్సవాలకు రావాలని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే ఆహ్వానించారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది.

TS liberation day celebrations in secunderabad : విమోచన వేడుకల్లో భాగంగా 12 ట్రూపులకు చెందిన 1300 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొననున్నారు. ఇందులో 8 ట్రూపులు తెలంగాణ, 2 ట్రూపులు మహారాష్ట్ర, మరో 2 ట్రూపులు కర్ణాటక నుంచి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రాంతానికి చెందిన కళలు, సంస్కృతి తెలిపేలా ప్రదర్శన ఇవ్వనున్నారు. రెండు రోజులుగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సాధన చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అసువులుబాసిన అమరవీరుల స్మృతి కేంద్రాల వద్ద భాజపా నేతలు ఇవాళ నివాళి అర్పించనున్నారు. అమరుల కుటుంబాలను గుర్తించి వారికి సన్మానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు పోలీసులు సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.