Yadadri model forest: మండలానికి ఐదు ‘యాదాద్రి వనాలు’.. రాష్ట్రవ్యాప్తంగా చిట్టడవులు

author img

By

Published : Sep 24, 2021, 7:12 AM IST

పల్లెజీవనం.. పచ్చదనం

తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లేలా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పల్లె వనాలతో గ్రామాలను ఆహ్లాదకరంగా మార్చిన ప్రభుత్వం.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. యాదాద్రి ఫారెస్ట్ మోడల్​గా రాష్ట్రంలో ప్రతి మండలంలో ఐదు చిట్టడవుల్ని సృష్టించేందుకు సన్నద్ధమవుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో చిట్టడవుల్ని సృష్టించనున్నారు. ప్రభుత్వం ‘యాదాద్రి ఫారెస్ట్‌’ మోడల్‌గా ప్రతి మండలంలో ఐదు బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఒకదాన్ని 10 ఎకరాల్లో చేపడతారు. మిగిలిన నాలిగింటిని స్థలం అందుబాటును బట్టి ఐదు, ఆరు, ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. ఎకరానికి మూడు వేల చొప్పున ఒక్కో వనంలో 15-30 వేల వరకు మొక్కలు నాటనున్నారు. తక్కువ ప్రదేశంలో వేెల మొక్కల్ని నాటించడం వల్ల స్పల్ప వ్యవధిలో అది చిన్నపాటి అటవీ ప్రాంతంలా మారుతుంది. ప్రతి మండలంలో ఒకటి పదెకరాల విస్తీర్ణంతో బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం నిర్ణయించింది. అదనంగా ప్రతి మండలంలో మరో నాలుగు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తాజాగా ఆదేశించారు.

ఏమిటీ యాదాద్రి నమూనా ?

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం లక్కారంలోని తంగేడువనంలో మూడేళ్లక్రితం ఎకరంలో నాలుగువేల మొక్కలు నాటారు. తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు, తక్కువ ఖర్చుతో దట్టమైన పచ్చదనం పెరిగింది. సీతాకోకచిలుకలు, పక్షులతో జీవవైవిధ్యం నెలకొంది. ‘యాదాద్రి మోడల్‌ ఫారెస్ట్‌’గా నామకరణం చేసి రాష్ట్రంలో ఇతరచోట్ల అనుకరిస్తున్నారు. జపాన్‌లో ‘మియావాకీ’ అనే వృక్ష శాస్త్రవేత్త తక్కువ స్థలంలో భారీగా మొక్కలు పెంచడంతో ఆయన పేరుతో వచ్చిన విధానాన్ని తంగేడువనంలో అమలుచేశారు.

మధ్యలో పిల్లలకు ఆటస్థలం

నీడనిచ్చేవి, పూలు, పండ్ల రకాలతో పాటు ఔషధ మొక్కల్ని బృహత్‌ పల్లె ప్రకృతి వనాల్లో నాటనున్నారు. మధ్యలో వృత్తాకారంలో ముప్పావు ఎకరా విస్తీర్ణంలో పిల్లలకు ఆటస్థలం ఏర్పాటుచేస్తారు. దీని చుట్టూ నాలుగు వైపులా చతురస్రాకారప్రాంతాలుగా విభజించి మొక్కలు వేస్తారు. మధ్యలో, చుట్టూ నడకదారుల ఏర్పాటుతో పాటు ఫెన్సింగ్‌ చేసి వనానికి ప్రవేశమార్గం ఏర్పాటుచేస్తారు. ఇందుకు సాంకేతిక సహకారమిచ్చేది అటవీశాఖ కాగా ఏర్పాటు చేసేది పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ.

ఒకేచోట రకాల మొక్కలు

ఒక్కో వనంలో కనీసం 20 రకాల మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. గతంలో గ్రామాల్లో అన్నిరకాల చెట్లుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దసరా వస్తే జమ్మి కోసం ఎక్కడెక్కడో తిరగాలి. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలతో పలురకాల చెట్లు ఊర్లో ఒకేచోట పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, గంధపు మొక్క, రేగు, కుంకుడు, పనస, నెమలినార, తంగేడు, సీతాఫల్‌, దానిమ్మ, నిమ్మ, వెదురు, పారిజాతం, తిప్పతీగ వంటి మొక్కల్ని నాటాలని గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. మొక్కల్ని గ్రామనర్సరీలోనే పెంచాలని..కొరత ఉంటే పొరుగు గ్రామం నుంచి తీసుకోవాలని సూచించింది. పచ్చదన ప్రాధాన్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహ్లాదం కోసం ప్రభుత్వం ఈ బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తోంది. చెట్ల సంరక్షణ పట్ల గ్రామస్థుల్లో బాధ్యత పెరుగుతుందని భావిస్తోంది. రంగారెడ్డి జిల్లా చేగూరు సహా 98 చోట్ల ఇప్పటికే మొక్కలు నాటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.