ఇబ్రహీంపట్నం ఘటనపై డీహెచ్ స్పందన, సర్జరీ చేసిన డాక్టర్ సస్పెండ్‌

author img

By

Published : Aug 30, 2022, 1:52 PM IST

Updated : Aug 30, 2022, 2:03 PM IST

DH Srinivas on Ibrahimpatnam Incident

DH Srinivas on Ibrahimpatnam Incident కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినా నలుగురు మహిళలు మరణించడం దురదృష్టకరమని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కుని ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెందిన ఘటనపై డీహెచ్ స్పందించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఇబ్రహీంపట్నం ఘటనపై డీహెచ్ స్పందన

DH Srinivas on Ibrahimpatnam Incident : ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఘటనలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందిచనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

"ఇబ్రహీంపట్నంలో నిపుణులైన వైద్యులతోనే మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాం. నలుగురు మహిళలు తమకు గ్యాస్ట్రో లక్షణాలున్నట్లు చెప్పారు. తగిన చికిత్స అందించినా నలుగురు చనిపోవడం దురదృష్టకరం. మహిళల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించాం. కు.ని. ఆపరేషన్ చేయించుకున్న 30 మందికీ చికిత్స అందిస్తున్నాం. అందులో ఏడుగురికి పలు ఆరోగ్య సమస్యలు గుర్తించి వారిని అపోలో ఆస్పత్రికి పంపించాం. మిగతా అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఘటనపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నాం. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశాం. కు.ని. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేశాం. రోజుకు 30 ఆపరేషన్లు చేయాలి కానీ ఆరోజు 34 చేశారు." - శ్రీనివాస్ రావు, ప్రజారోగ్య సంచాలకులు

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం పరిధిలో 34 మందికి డబుల్ పంచర్ లాప్రోస్కోపి నిర్వహించామని డీహెచ్ తెలిపారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా డీబీఎల్ అనేది అడ్వాన్స్ మెథడ్ అని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. 34 మందికి ఈ ఆపరేషన్ చేస్తే దురదృష్టవశాత్తు అందులో నలుగురు మరణించారని వెల్లడించారు. మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వారి మరణానికి గల కారణం తెలుస్తుందని డీహెచ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఇకపై శస్త్రచికిత్స సమయంలో కచ్చితమైన నిబంధనలు అమలు చేసేలా జాగ్రత్తపడతామని చెప్పారు.

Last Updated :Aug 30, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.