అంకబాబు అరెస్ట్​ను ఖండించిన తెదేపా నేతలు.. విడుదల చేయాలని డిమాండ్​

author img

By

Published : Sep 23, 2022, 2:00 PM IST

తెదేపా

ఏపీ సీనియర్​ జర్నలిస్టు అంకబాబు అరెస్టును తెలుగుదేశం పార్టీ నేతలు ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే అరెస్ట్​ చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం జగన్​ ఆఖరికి జర్నలిస్టులను కూడా వదలడం లేదని మండిపడ్డారు. అంకబాబును వెంటనే విడుదల చేయాలని సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్​లో పోస్ట్​లు షేర్ చేశారని సీనియర్ పాత్రికేయులు అంకబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంకబాబుని నేడు కోర్టులో హాజరు పర్చే అవకాశమున్నట్లు సమాచారం. అంకబాబుని నిన్న రాత్రి నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే ఉంచినట్లు సమాచారం. అంకబాబుపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

అంకబాబును అరెస్ట్ చేయటం జర్నలిస్టుల స్వేచ్ఛను కాలరాయడమేనని న్యాయవాది హరిబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంకబాబుకు జీజీహెచ్​లో వైద్య పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత: సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతోపాటు వాక్‌ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీకి గురువారం రాత్రి లేఖ రాశారు. అంకబాబుకు ఏమైనా జరిగితే పోలీసుశాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వెంటనే అంకబాబును విడుదల చేయాలని ఆ లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

  • విజయవాడ లో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాను. వాట్స్యాప్ లో ఒక వార్తను ఫార్వార్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చేస్తారా? 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుంది. వెంటనే అంకబాబు గారిని విడుదల చెయ్యాలి. pic.twitter.com/MEFiVAZ5MY

    — N Chandrababu Naidu (@ncbn) September 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన సీనియర్​ పాత్రికేయులు అంకబాబు అరెస్ట్​ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అంకబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్స్యాప్ లో పోస్ట్ పెట్టారంటూ సీనియర్ పాత్రికేయులు అంకబాబు గారిని సిఐడి అరెస్ట్ చెయ్యడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛని సైతం హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/JCjtpk3A0O

    — Lokesh Nara (@naralokesh) September 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీనియర్ జర్నలిస్ట్‌ అంకబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా మాజీమంత్రి దేవినేని ఉమా సీఐడీ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. వాట్సాప్ లో చిన్న పోస్టు పెట్టినంత మాత్రాన 73 ఏళ్ల వయసులో అంకబాబును అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ చివరకు జర్నలిస్టుల్ని కూడా వదల్లేదని ఆరోపించారు. అతనికి గుండె సమస్య ఉందని చెప్పినా సీఐడీ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. తక్షణమే అంకబాబును విడుదల చేయాలని ఉమా మహేశ్వరరావు, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

సీనియర్​ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్​ను తెదేపా నేత నక్కా ఆనంద్​బాబు ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని అంకబాబును అరెస్ట్ చేయటం దారుణమని మండిపడ్డారు. 73ఏళ్లు ఉన్న వ్యక్తిని సీఐడీ ద్వారా ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. అంకబాబును కలిసేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన నక్కా ఆనంద్‌బాబును.. పోలీసులు సీఐడీ కార్యాలయానికి దూరంలోనే ఆపేశారు.

అంకబాబుపై పెట్టిన సెక్షన్లు దారుణమని తెదేపా నేత ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా అని నిలదీశారు. అంకబాబు అరెస్ట్​ను తెదేపా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. 70 ఏళ్లు దాటిన వ్యక్తిని రాత్రిపూట అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే : సామాజిక మాధ్యమాల్లో పోస్టు ఫార్వర్డ్‌ చేశారంటూ 73 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ప్రకాశం రోడ్డులోని అంకబాబు నివాసానికి గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న 8 మంది సీఐడీ అధికారులు వెళ్లారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. తాము సీఐడీ అధికారులమని, తమ వెంట రావాలని కోరారు.

అంకబాబు సతీమణి ఎక్కడికి తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించిగా.. తాము సీఐడీ అధికారులమని, గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉన్నట్లు అంకబాబు వాట్సాప్‌లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని, వాటిపై ప్రశ్నించేందుకు తీసుకెళ్తున్నామని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఓ అరగంట పాటు ప్రశ్నించి పంపించేస్తామంటూ అంకబాబును బలవంతంగా తీసుకెళ్లారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి అక్కడే ఉంచారు. అయితే గురువారం రాత్రి 11.30 గంటల వరకూ అంకబాబును అదుపులోకి తీసుకున్నట్లుగానీ, అరెస్ట్​ చేసినట్లుగానీ సీఐడీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు రావిపాటి సాయికృష్ణ, తెదేపా కార్యకర్తలు సీఐడీ కార్యాలయంవద్ద నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు.

ఇవీ చదవండి: బతుకమ్మ చీరలను కాలబెడితే కఠిన చర్యలు తప్పవు: ఎర్రబెల్లి

'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా.. ఎన్నికలకు గాంధీ కుటుంబం దూరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.