Adani : సెకి కొనుగోలు చేసే విద్యుత్‌లో రెండొంతులు అదానీ సంస్థదే

author img

By

Published : Apr 21, 2022, 9:24 AM IST

SECI

SECI : అదానీ సంస్థకు లబ్ది చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున సౌరవిద్యుత్ కొనుగోలు చేయనుంది. రాష్ట్ర అవసరాల కోసం కొనే 7వేల మెగావాట్లలో మూడింట రెండు వంతులు అదానీ నుంచే తీసుకోనుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మరో మార్గంలో కొనుగోళ్లు చేయనుంది.

Adani : ఏపీ ప్రభుత్వం సెకి ద్వారా సౌర విద్యుత్‌ కొనేది అదానీ సంస్థ నుంచే. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) నుంచి 7 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఇప్పటివరకూ చెబుతోంది. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కి సెకి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్న వివరాలతో అదానీ నుంచి విద్యుత్‌ తీసుకోడానికే ఈ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుందని స్పష్టమైంది. 2020 జూన్‌లో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈఎల్‌) పిలిచిన టెండర్లలో అదానీ 3వేల మెగావాట్లు, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ 2,200 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్‌లు దక్కించుకున్నాయి. కొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు పెట్టారని టాటా ఎనర్జీ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియను నిలిపేస్తూ 2021 జూన్‌ 17న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

SECI : కొద్దిరోజులకే.. సెప్టెంబరు 15న సెకి నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. మర్నాడే మంత్రిమండలి సమావేశంలో ఆ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ఒప్పందాల ద్వారా ఇంకో మార్గంలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు అవకాశాన్ని అదానీకే ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం తీసుకునే 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌లో మూడింట రెండొంతులు (4,667 మెగావాట్లు) అదానీ నుంచే తీసుకుంటోంది. సెకి నుంచి యూనిట్‌ రూ.2.49 వంతున తీసుకునే విద్యుత్‌ ధర ఎక్కువని విమర్శలు వస్తున్నా.. 2021 డిసెంబరు 1న ప్రభుత్వం సెకితో ఒప్పందం కుదుర్చుకుంది.

SECI - Adani Partnership : దీనికి ముందు 2020 జులై 16న ట్రాంచ్‌-3 ప్రాజెక్టుల్లో భాగంగా సెకి టెండర్లు పిలిచింది. రివర్స్‌ టెండరింగ్‌ తర్వాత యూనిట్‌ రూ.2 వంతున కొనేందుకు అల్‌ జొమాయ్‌ ఎనర్జీ అండ్‌ వాటర్‌ కంపెనీ, గ్రీన్‌ ఇన్‌ఫ్రా విండ్‌ ఎనర్జీ లిమిడెడ్‌లతోనూ.. యూనిట్‌ రూ.2.01 వంతున కొనేందుకు ఎన్‌టీపీసీతో ఒప్పందాలు చేసుకుంది. దీని ప్రకారం మనకు యూనిట్‌కు సుమారు 50 పైసలు అదనంగా భారం పడినట్లే. పీపీఏ 25 ఏళ్ల వ్యవధిలో సెకి నుంచి తీసుకునే విద్యుత్తు వల్ల సుమారు రూ.21,250 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీజీఈఎల్‌ పిలిచిన టెండర్లలో యూనిట్‌కు కనిష్ఠంగా రూ.2.48 నుంచి గరిష్ఠంగా రూ.2.58 వంతున ఇదే అదానీ సంస్థ కోట్‌ చేసింది. ఇదే ధర వచ్చేలా సెకి యూనిట్‌ రూ.2.49 వంతునప్రతిపాదించింది.

రెండున్నరేళ్ల కిందటి టెండర్లు: సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనేందుకు 2019 జూన్‌ 26న సెకి ప్రకటన జారీచేసింది. నవంబరు 14న సాంకేతిక బిడ్‌లు, నవంబరు 21న ఫైనాన్షియల్‌ బిడ్‌లను తెరిచింది. అదానీకి 8వేల మెగావాట్లు, అజూర్‌కు 4వేల మెగావాట్లకు అనుమతించింది. వాటినుంచి వచ్చే విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.92 వంతున టారిఫ్‌ నిర్దేశించింది.

ధర ఎక్కువని ఎవరూ ముందుకు రాలేదా?: ప్యాకేజి -1 కింద 3వేల మెగావాట్లలో ఒడిశా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు 500 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్‌ 300, తమిళనాడు వెయ్యి మెగావాట్లను తీసుకునేలా సెకితో పీపీఏ కుదుర్చుకున్నాయి. మరో 100 మెగావాట్లను జమ్మూకశ్మీర్‌ ఇటీవల తీసుకుంది. ఈ ప్యాకేజీలో ప్రతిపాదించిన 3వేల మెగావాట్లలో ఇంకా 1,100 మెగావాట్లకు ఇంకా పీపీఏలు కుదరాల్సి ఉంది.

* ప్యాకేజి-2 ప్రాజెక్టుల ద్వారా వచ్చే 3వేల మెగావాట్లలో.. అదానీ నుంచి 2వేలు, అజూర్‌ నుంచి వెయ్యి మెగావాట్లను ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబరు నుంచి ప్రభుత్వం తీసుకోనుంది. ప్యాకేజీ-3లో కూడా రెండు సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌ను 2025 సెప్టెంబరు నుంచి.. ప్యాకేజీ-4లో వచ్చే వెయ్యి మెగావాట్లలో అదానీ నుంచి 667, అజూర్‌ నుంచి 333 మెగావాట్లను 2026 సెప్టెంబరు నుంచి ప్రభుత్వానికి ఇచ్చేలా సెకి ప్రతిపాదించింది. అంటే సెకి నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో 66.67 శాతం (4,667 మెగావాట్లు) అదానీ ప్రాజెక్టుల నుంచే రాష్ట్రానికి అందుతుంది. అజూర్‌ నుంచి 33.33 శాతం (2,333 మెగావాట్లు) వస్తుంది. అదానీ, అజూర్‌ సంస్థలు బిడ్డింగ్‌లో కోట్‌ చేసిన యూనిట్‌ ధర రూ.2.92 ఎక్కువగా ఉందని.. దాన్ని రూ.2.42కు తగ్గించాలన్న సెకి ప్రతిపాదనను 2021 నవంబరు 3న రెండు సంస్థలూ ఆమోదించాయి.

ప్లాంట్లు రాజస్థాన్‌లో.. ప్యానళ్ల తయారీ ప్లాంట్లు గుజరాత్‌లో: సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను అదానీ, అజూర్‌ సంస్థలు ఎక్కడో రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రాష్ట్రానికి ఇస్తాయి. రాష్ట్రానికి విద్యుత్‌ను ఎక్కడ అనుసంధానం (పాయింట్‌ ఆఫ్‌ కనెక్షన్‌) చేయాలనే విషయాన్ని ఇంకా గుర్తించలేదు. సౌర ఫలకాల తయారీ ప్లాంట్లను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నాయి. సెకితో కుదుర్చుకున్న పీపీఏ ప్రకారం 25 ఏళ్లలో విద్యుత్‌ కొనుగోలుకు రూ.1,05,825 కోట్లను వెచ్చించే రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి నెలా బ్యాంకు గ్యారంటీ ఇచ్చి (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌-ఎల్‌సీ) బిల్లులు చెల్లించటం మాత్రం తప్పదు. రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి (కెసాసిటీ యుటిలైజేషన్‌ ఫ్యాక్టర్‌- సీయూఎఫ్‌) 28% ఉంటుందని పేర్కొంది. దీనివల్ల రాష్ట్రంలో ఏర్పాటుచేసే ప్రాజెక్టుల ద్వారా ఏడాదికి మెగావాట్‌కు సుమారు 2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వస్తే.. అదనపు సీయూఎఫ్‌ వల్ల మెగావాట్‌కు 2.4 ఎంయూల విద్యుత్‌ వస్తుందని అంచనా. ఆ మేరకు విద్యుత్‌ ఛార్జీలనూ తగ్గించలేదు.

సెకి టారిఫ్‌కు సీఈఆర్‌సీ ఆమోదం: యూనిట్‌ రూ.2.49 చెల్లించేలా ప్రభుత్వం, రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ సంస్థ సెకితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్యాకేజి-2, 3, 4 కింద 7 వేల మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని.. అందులో అదానీ సంస్థ 4,667 మెగావాట్లు, అజూర్‌ సంస్థ ఏర్పాటుచేసే 2,333 మెగావాట్ల ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.42 వంతున ఏపీ డిస్కంలకు ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో (సీఈఆర్‌సీ) సెకి పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రేడ్‌ మార్జిన్‌ కింద యూనిట్‌కు 7 పైసల వంతున డిస్కంలు చెల్లిస్తాయంది. దీనిపై వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత టారిఫ్‌ను ఆమోదిస్తూ సీఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది. సెకితో ఒప్పందంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారని.. హైకోర్టు తీర్పును అనుసరించి ఆదేశాలు అమల్లోకి వస్తాయని సీఈఆర్‌సీ పేర్కొంది.

ఆర్‌పీవో ఆబ్లిగేషన్‌ లేకుండా ఎందుకు తీసుకున్నట్లు?: రెన్యూవబుల్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పీవో) అవసరం లేకుండా సంప్రదింపుల ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సెకి నుంచి డిస్కంలు తీసుకుంటున్నాయి. ఆర్‌పీవో ఆబ్లిగేషన్‌ లేకుండా ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పేర్కొంది. రాష్ట్రంలోని విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్‌ 17% వరకు ఆర్‌పీవో ఆబ్లిగేషన్‌ కింద ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్‌పీవో పరిమితికి మించి పునరుత్పాదక విద్యుత్‌ (సుమారు 25%) ఉంది. ఈ పరిస్థితుల్లో సంప్రదింపుల ద్వారా డిస్కంలు ఎందుకు విద్యుత్‌ తీసుకుంటున్నాయి? సెకి ట్రేడ్‌మార్జిన్‌ కింద యూనిట్‌కు 7 పైసల వంతున వసూలుచేసే మొత్తాన్ని సంప్రదింపుల ద్వారా 2 పైసలు తగ్గించే అవకాశం ఉన్నా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.