కలెక్టరేట్లపై రేవంత్.. అర్జీలతో రావాల్సిన ప్రజలు పెట్రోల్ సీసాలతో వస్తున్నారంటూ..

author img

By

Published : Sep 20, 2022, 12:56 PM IST

Updated : Sep 20, 2022, 1:01 PM IST

revanthreddy

Revanth reddy Tweet on New Collectorates : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెరాస పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనదైన శైలిలో ట్విటర్‌లో కేసీఆర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. బాధితుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం దుర్మార్గులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. ఫలితంగా కలెక్టరేట్లకు అర్జీలతో రావాల్సిన ప్రజలు పెట్రోల్ సీసాలతో వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Revanth reddy Tweet on New Collectorates : తెరాస పాలనపై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలను ఆదుకుంటూ.. బాధితుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం దుర్మార్గులకు కొమ్ముకాస్తోందని ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.

Revanth reddy Tweet
అర్జీలతో రావాల్సిన ప్రజలు పెట్రోల్ సీసాలతో వస్తున్నారంటూ రేవంత్‌ ట్వీట్

"తెరాస పాలనలో అందమైన కలెక్టరేట్లు కట్టారు.. కానీ అక్కడ పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయని ఆరోపించారు. దాని ఫలితంగా న్యాయం కోసం కలెక్టరేట్ల చుట్టూ తిరిగి విసిగి వేసారిన పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలకు, కలెక్టరేట్లకు అర్జీలతో రావాల్సిన బాధితులు పెట్రోల్ సీసాలతో వస్తున్నారని" రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్న వివిధ కలెక్టరేట్ల వద్ద ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో రెండు వేర్వేరు కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు కలకలం సృష్టించాయి. జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో ఓ రైతు తన సమస్యను అధికారులు పరిష్కరించడం లేదనే మనస్తాపంతో కలెక్టర్‌ కార్యాలయం ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన లోకేశ్​కు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. దానిని పక్క పొలం వాళ్లు అక్రమించుకున్నారు. దీనిపై పలుమార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.ఆ విషయంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన లోకేశ్ పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు గమనించి అతడిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.

భూమికి పట్టా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. యువతి సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబంతో సహా ప్రజావాణికి తరలివచ్చిన యువతి పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలంటూ నినదించారు. దీంతో అక్కడ ఉన్న కలెక్టరేట్‌ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సమస్య పరిష్కారానికి అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు చొరవచూపారు. వెంటనే ఆయన గరిడేపల్లి తహసీల్దార్​​తో ఫోన్​లో మాట్లాడి వివరాలు సేకరించారు.

కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సమస్య పరిష్కరిస్తామన్న హామీతో యువతి ఆందోళన విరమించింది. గరిడేపల్లి మండలం కల్మచెర్వు గ్రామంలో తమకు 34 గుంటల భూమి ఉందని బాధితురాలు తెలిపింది. ఈ భూమి విషయంలో గ్రామానికి చెందిన మీసాల సైదులుతో కొంతకాలంగా వివాదం కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో మీసాల సైదులు తమపై దాడి చేసి భూమిని ఆక్రమించాడని చెప్పింది. ఇదే విషయంమై పోలీసులు తమను వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. సమస్యను పరిష్కరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Last Updated :Sep 20, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.