రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్, భాజపా నినాదాలు

రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్, భాజపా నినాదాలు
Railway station opening at medak:అక్కన్నపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పర నినాదాలు చేసుకున్నారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అటు తెరాస కార్యకర్తలు, ఇటు భాజపా కార్యకర్తలు ఎవరికి వారు పోటీగా నినాదాలు చేయడంతో స్టేషన్లో కాసేపు గందరగోళం ఏర్పడింది.
Railway station opening at medak: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన మెదక్ జిల్లా అక్కనపేట రైల్వే స్టేషన్ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ రైల్వేస్టేషన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాస్ట్ షేరింగ్ పద్ధతిలో అభివృద్ధి చేశాయి. ప్రారంభోత్సవ సందర్భంగా తెరాస, భాజపాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
కేంద్రమంత్రి స్టేషన్లోకి అడుగుపెట్టగానే అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి పోలీసులు ఎంత చెప్పినాసరే పట్టించుకోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు సైతం జై భారత్ మాత, జైజై భారత్మాత, వందేమాతరం, జై నరేంద్రమోదీ అంటూ నినదించారు. రెండు పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది.
ఒక దశలో కార్యకర్తలు సభా వేదిక వైపు దూసుకొస్తారేమో అనిపించింది. ఈ అనూహ్య పరిణామాలు పోలీసులకు ఆందోళనను గురి చేసింది. వేదిక మీద మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించేటప్పుడు కూడా ఇరు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ప్రశాంతంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిపోయింది.
ఇవీ చదవండి:
