కలుషిత నీటి కాటు.. వాంతులు, విరేచనాలతో జనం బెంబేలు..

author img

By

Published : Aug 3, 2022, 11:42 AM IST

Contaminated water

Diarrhea and Gastroenteritis Cases: రాష్ట్రంలో డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌ విజృంభిస్తున్నాయి. కలుషిత నీరు, ఆహారాన్ని తినడంతో వాంతులు, విరేచనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. గత 7 నెలల్లో 1.43 లక్షల కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 20,629 కేసులు గుర్తించారు. ప్రభుత్వ గురుకులాల్లోని విద్యార్థులు పెద్దసంఖ్యలో అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Diarrhea and Gastroenteritis Cases: తెలంగాణలో డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌ విజృంభిస్తున్నాయి. కలుషితమైన నీరు తాగడం, విషతుల్యమైన ఆహారాన్ని తినడంతో.. వాంతులు, విరేచనాలతో ప్రజలు బెంబేలెత్తి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ ఏడాది గత 7 నెలల్లో 1,43,504 డయేరియా, అక్యూట్‌ గ్యాస్ట్రోఎంటరైటిస్‌ కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి జులై వరకూ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడం, తాగునీరు కలుషితం కావడం తదితర కారణాలతో.. జనవరితో పోల్చితే జులైలో ఏకంగా 11 వేల కేసులు అధికంగా నమోదవడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ఏడాది హైదరాబాద్‌(20,629)లో అత్యధికంగా వాంతులు, నీళ్ల విరేచనాల కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల గణాంకాలు కాగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన వాటినీ లెక్కిస్తే బాధితుల సంఖ్య దాదాపు పదింతలు ఉండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ.. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో ఇటీవల వైద్యశాఖ జరిపిన పరిశీలనలోనూ అక్యూట్‌ గ్యాస్ట్రోఎంటరైటిస్‌ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 2017లో 244 వాంతులు, విరేచనాల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జులై 21 నాటికే 615 మంది విద్యార్థులు వ్యాధి బారినపడ్డారు. ఇందులో సిద్దిపేటలో 132, ఆదిలాబాద్‌లో 117, నిర్మల్‌ జిల్లాలో 106, జోగులాంబ గద్వాలలో 65, నల్గొండలో 60, మహబూబాబాద్‌లో 56, జగిత్యాలలో 25, హనుమకొండలో 22, పెద్దపల్లిలో 20, మెదక్‌లో 12 మంది బాధితులున్నారు.

ప్రమాదకరంగా లీకేజీలు.. వాంతులు, విరేచనాలకు ప్రధాన కారణాలు అపరిశుభ్రమైన నీరు తాగడం, కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడమే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణాలు, పల్లెల్లోని తాగునీటి పైపులైన్లలోకి మురుగునీరు వచ్చి చేరుతోంది. లీకేజీలను ఎప్పటికప్పుడూ అరికట్టడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలున్నాయి. లీకేజీలు పెరిగిపోవడంతో ప్రజలు వాంతులు, విరేచనాల బారినపడుతున్నారు.

దేశంలో ఏటా 2 లక్షల మంది పిల్లల మృతి.. అయిదేళ్లలోపు పిల్లల మరణాలకు 13 శాతం డయేరియానే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని బారినపడి దేశంలో ఏటా రెండు లక్షల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. పోషకాహార లోపమున్న పిల్లల్లో వాంతులు, విరేచనాలు ఎక్కువైనప్పుడు.. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. శరీరం నుంచి జింక్‌ ఎక్కువగా నష్టపోతుండడంతో మరణాల సంఖ్య పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. డయేరియాతో ఏటా మరణాలు సంభవిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వం ఏటా జులై 27 నుంచి ఆగస్టు 8 వరకూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. అయినా పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాధిపై అవగాహన పెంచుకుంటే.. అత్యధిక శాతం మరణాలను నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఆహారాలను తినొద్దని.. ఇంట్లో కూడా తాజా, వేడిగా ఉన్న ఆహారాలనే తీసుకోవాలని, తినుబండారాలపై మూతలు పెట్టడం, ఈగలు వాలకుండా జాగ్రత్తపడడం, నీటిని కాచి, చల్లార్చి తాగడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

డయేరియా లక్షణాలు..

* అత్యవసరంగా మల విసర్జనకు వెళ్లడం

* రోజుకు అయిదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు

* వాంతులు, వికారం

* కడుపునొప్పి

గ్యాస్ట్రోఎంటరైటిస్‌ లక్షణాలు..

* వాంతులు

* ఆకలి తగ్గిపోవడం

* వికారం

* కడుపునొప్పి

* రక్త విరేచనాలు

ఎప్పుడు ప్రమాదమంటే..

* జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా వస్తున్నప్పుడు

* మూత్రవిసర్జన నిలిచిపోయినప్పుడు

* చర్మం పొడిబారి, లాగితే సాగిపోతున్నప్పుడు

* కళ్లు కుంచించుకుపోయినప్పుడు

* బాగా నీరసించిపోయినప్పుడు

* నాలుక తడారిపోతున్నప్పుడు

* ఏడ్చినా కన్నీరు రానప్పుడు..

ఏం చేయాలి?

* ఉప్పు, చక్కెరతో కలిపిన నీరు, మజ్జిగ తాగాలి.

* కొబ్బరినీళ్లు, సాబుదానా(సగ్గుబియ్యం) నీరు కూడా తాగొచ్చు.

* ఓఆర్‌ఎస్‌ పొట్లాలను నీటిలో కలిపి తాగాలి.

* వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు ఐవీ ద్వారా ద్రావణాలు ఎక్కించాలి.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.