Archana stalin : నష్టాల నుంచి పాఠాలు.. గెలుపు దిశగా అడుగులు

author img

By

Published : Jul 29, 2021, 10:10 AM IST

నష్టాల నుంచి పాఠాలు.. గెలుపు దిశగా అడుగులు

కోటి ఆశలతో మొదలుపెట్టిన వ్యాపారం నష్టాలు మిగిల్చింది... ప్రేమపెళ్లి చేసుకుందని అమ్మానాన్నల ప్రోత్సాహమూ లేదు... ఉన్నదల్లా గుండెలనిండా ఆత్మవిశ్వాసమే! ఆ ధైర్యమే చిన్నవయసులోనే అర్చనని వ్యాపారవేత్తని చేసింది. మహిళలకు మిద్దెతోటల్ని పరిచయం చేస్తూ, సేంద్రియ ఉత్పత్తుల్ని అందిస్తూ... మరోపక్క వందలాది రైతన్నలకు అండగా నిలుస్తున్న అర్చన స్టాలిన్‌(Archana stalin) గెలుపు కథ ఇది...

కష్టానికీ... నష్టానికీ దూరంగా ఉండటానికే మనమంతా ఇష్టపడతాం. కానీ అర్చన(Archana stalin) అలా కాదు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కాలేజీలో జియో ఇన్ఫర్మేటిక్స్‌ చదివింది తను. సహాధ్యాయి స్టాలిన్‌ కాళిదాసును ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దూరం పెట్టారు. అప్పుడే తనేంటో నిరూపించుకోవాలనుకుంది అర్చన. 2012లో ‘జియోవెర్జ్‌’ అనే పరికరాల సంస్థని భర్తతో కలిసి ప్రారంభించింది. తన నగలు అమ్మి, స్నేహితుల చేబదుళ్లతో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టింది. రెండేళ్లలోనే ఆ వ్యాపారం నష్టాల్లోకి జారుకొంది. అప్పటికి తన వయసు 22. మరొకరయితే మళ్లీ వ్యాపారం మాటెత్తే వారు కాదేమో. కానీ అర్చన నష్టాల నుంచి గెలుపు పాఠాల్ని నేర్చుకుంది.

రెండెకరాలతో మొదలు

రెండెకరాలతో మొదలు...

అప్పులు తీర్చడానికి ఉద్యోగంలో చేరింది అర్చన. మరోపక్క మార్కెటింగ్‌లో అనుభవాన్నీ సంపాదించింది. ఈసారి తన దృష్టి సేంద్రియ, పట్టణ వ్యవసాయంపై పడింది. కానీ లోతు తెలియకుండా అడుగుపెట్టకూడదనేది అనుభవం నేర్పిన పాఠం. అందుకే ఆ రంగంలో అనుభవజ్ఞులనీ, రైతులను కలుసుకుంది. ఏ సీజన్లలో, ఏయే పంటలను పండించొచ్చు, సాగులో సాధక బాధకాలు వంటి వాటిని అధ్యయనం చేసింది. ఆ తర్వాతే 2016లో ‘మై హార్వెస్ట్‌’ సంస్థను ప్రారంభించింది.

‘ఇది వ్యాపారం అనుకోలేదు. అందరికీ ఉపయోగపడే ఓ మంచి పని అనుకున్నా. బాల్కనీల్లో, మిద్దెపైన కాయగూరలు, ఆకుకూరలను పండించుకోవడంలో శిక్షణనిస్తాం. కావాల్సినవీ సమకూరుస్తాం. సొంతంగా పండించి, వండుకోవడంలోని సంతోషమే వేరు. ఇదే చాలామంది మహిళలను ఈ బాల్కనీ వ్యవసాయంవైపు ముందుకొచ్చేలా చేసింది. మొదట నా మెట్టినిల్లైన విరుదునగర్‌లో ప్రారంభించా. తర్వాత 10 పాఠశాలల్లో సేంద్రియ పద్ధతుల్లో కాయగూరలు పండించడం నేర్పించే దాన్ని. తిరువళ్లూరులో రెండు ఎకరాలను ఏడాదికి రూ.25 వేలకు అద్దెకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించా. ఏడాది అయ్యేసరికి మా కాయగూరలని చెన్నైలోని ప్రముఖ సేంద్రియ ఉత్పత్తుల దుకాణాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టా. ఆసక్తి ఉన్న వారికి మా పొలంలో కూరగాయలను పండించి ఇస్తామని చెప్పాం. నెలకు రూ.3 వేలు కడితే ప్రతి వారం వారి స్థలంలో కూరగాయలను వారే తీసుకెళ్లొచ్చు. 18 కుటుంబాలతో మొదలై ఇప్పుడు 10 వేల కుటుంబాలకు మా ఉత్పత్తులు అందిస్తున్నాం. మీకు కాయగూరలు పండించి ఇస్తాం అని చెప్పినప్పుడు చాలామంది నన్ను వింతగా, అపనమ్మకంగా చూశారు. తర్వాత వారే ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అందుకే వెంబు ఫార్మ్స్‌ పేరుతో చుట్టుపక్కల రైతులను కూడా కలుపుకొన్నా. మొదటి ఏడాదిలో రూ.8 లక్షల వ్యాపారాన్ని చేశాం. రెండో ఏడాదికి రూ.44 లక్షలకు చేరింది. గతేడాది కోటి రూపాయల వ్యాపారం చేశా. ప్రస్తుతం 500 మందికిపైగా రైతులతో కలిసి పనిచేస్తున్నా’ అని వివరించింది అర్చన.

సవాళ్లను దాటుకుని..

గతేడాది లాక్‌డౌన్‌లో అధికారుల అనుమతి తీసుకుని మరీ వినియోగదారులకు కూరగాయలను అందించింది. వాటి నాణ్యత బాగుండటంతో బియ్యం, పప్పు, నూనె వంటివీ కావాలనే వారు. చిరుధాన్యాల స్నాక్స్‌నూ అడిగే వారు కొందరు. అవన్నీ అర్చన వ్యాపారం విస్తరించడానికి సహకరించాయి. ఇప్పుడు కూరగాయలతోపాటు... నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేస్తున్న అర్చన పలువురు ప్రముఖుల ప్రశంసలనూ అందుకుంటోంది. టెడెక్స్‌ వంటి వేదికలపైనా అనుభవాలను పంచుకుని యువత మనసు దోచుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.