'నేతన్నలకు నోటి మాటలు కాదు.. నిధుల మూటలు ఇచ్చి చేయూతనివ్వండి'

author img

By

Published : Aug 6, 2022, 3:33 PM IST

Minister KTR Letter to central minister Piyush Goyal about Handloom Sector

KTR Letter to Piyush Goyal: రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత రంగానికి కేంద్రం చేయాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపైన కేంద్ర చేనేత, ఔళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగంపై మోదీ సర్కారుకు చిన్నచూపు, నిరాసక్తత ఉందని.. లేఖలో కేటీఆర్ ఎండగట్టారు. చేనేత రంగానికి సాయం చేశామంటూ ప్రధాని సహా కేంద్ర మంత్రులు వల్లె వేసే అసత్యాలు మాని నేతన్నకు చేయూతనిస్తే.. మంచిదని హితవు పలికారు.

KTR Letter to Piyush Goyal: దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగం ప్రస్తుత దుస్థితికి కేంద్ర ప్రభుత్వ మతిలేని విధానాలే కారణమని ఎండగడుతూ.. కేంద్ర చేనేత, ఔళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్​ లేఖ రాశారు. రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారానికి సంబంధించిన వివరాలను తన లేఖలో పొందుపరిచారు. నిధులు, నియామకాలు, నీళ్లతో పాటు నేతన్నల బాగు కోసం ఉద్యమించిన తాము... అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్ల నుంచి చేనేత రంగాన్ని ఆదుకోవాలని వివిధ రూపాల్లో కేంద్రాన్ని కోరామన్నారు. భారతీయ ఆత్మకు ప్రతీకైన ఎన్నో రంగాలను నిర్వీర్యం చేసినట్టుగానే మోదీ సర్కారు.. టెక్స్‌టైల్‌ - చేనేత రంగంపై కూడా కక్ష కట్టిందని ఆరోపించారు. అందుకే ఆ రంగం బాగు కోసం ఏ మాత్రం ఆలోచింకుండా చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ నేతన్నల పొట్టగొడుతుందని విమర్శించారు.

దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం సహాయం ఎక్కడ...? అని కేటీఆర్​ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన మోదీ.. తన ప్రసంగంలో పేర్కొన్న మెగా టెక్స్‌టైల్ పార్క్ ఎక్కడ ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సూమారు 1552 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొదలుపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే... ఇప్పటి వరకు స్పందించని కేంద్రం.. మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు.

బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అనేక చిన్న దేశాలు చేనేత రంగంలో మనకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తున్నాయన్న కేటీఆర్... ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాల లేమినే కారణమని విమర్శించారు. అయితే... సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంతో పోటీ పడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైబర్ టూ ఫ్యాషన్ మోడల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ప్రపంచ టెక్స్‌టైల్ దిగ్గజాల్లో ఒకటైన యంగ్ వన్ కంపెనీ పెట్టుబడులు పెట్టిన సంగతి గుర్తు చేశారు. ఇంతటి జాతీయ ప్రాధాన్యత కలిగిన మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కీలక పవర్లూమ్ మగ్గాల అప్‌గ్రేడేషన్ కోసం ప్రభుత్వం 50 శాతం నిధులు భరించేందుకు సిద్ధంగా ఉన్నా... అందుకు సంబంధించి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా కూడా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.

కాంప్రహెన్సివ్ పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్‌ స్కీం కింద సిరిసిల్లలో మెగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తే ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన దృష్ట్యా... సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం స్పందిచలేదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే కూడా స్పందన లేదన్నారు కేటీఆర్. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తిని మోదీ సర్కారు బుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు.

జీఎస్టీ ఎత్తివేయాలి: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాదీ వస్త్రాలపై కూడా పన్ను విధించిన దుర్మార్గపు ప్రభుత్వం భాజపానే అని ధ్వజమెత్తారు. జీఎస్టీతో పన్ను పోటుతో నేతన్నల నడ్డి విరుస్తున్న కేంద్రం అరాచక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతున్న నిరసన కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకోనైనా టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపై పన్ను తగ్గించడంతో పాటు ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. దేశంలో చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ అగస్టు 7వ తేదీన జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి జీఎస్టీ పన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర చేనేత, జౌళి శాఖకు మంత్రులు మారుతున్నారే తప్ప... విజ్ఞప్తులకు మాత్రం సానుకూల స్పందన రావడం లేదని కేటీఆర్​ వాపోయారు. ప్రభుత్వం, నేతన్నల తరఫున తాను లేవనెత్తిన ఈ అంశాలన్నింటిపై తెరాస ఎంపీలు కేంద్రాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తారని కేటీఆర్‌ చెప్పారు. నేతన్నలకు నోటి మాటలు కాదు.. నిధుల మూటలు ఇచ్చి.. చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని పీయూష్​గోయల్​కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత రంగానికి చేస్తున్న సహాయం ఏమైనా ఉంటే... అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాటికి ప్రకటించాలని... లేకుంటే భాజపా నేతలను నేతన్నలు నిలదీసే పరిస్థితి వస్తుందని కేటీఆర్​ హెచ్చరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.