BJP MP Arvind: రాష్ట్రంలో భారీ కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు.. త్వరలో వేములవాడకు ఉపఎన్నిక!

author img

By

Published : Nov 16, 2021, 5:37 PM IST

BJP MP Arvind

తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయిందని భాజపా ఎంపీ అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా భారీ కుంభకోణాలు వెలుగులోకి రావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వేములవాడ ఉపఎన్నిక రావొచ్చని జోష్యం చెప్పారు. వేములవాడ ఉపఎన్నిక రావాలని కోరుకుంటున్నట్లు అర్వింద్‌ అన్నారు.

తెలంగాణలో ఏ క్షణంలో అయినా భారీ కుంభకోణాలు వెలుగులోకి రావచ్చని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వేములవాడలో ఉప ఎన్నిక రావచ్చని జోస్యం చెప్పారు. రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వేములవాడ ఉప ఎన్నికలో విజయ దుందుభి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ సంస్థను కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. మొక్కజొన్న పంటను మార్క్ ఫెడ్ సంస్థ కాకుండా దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులను కల్పించారని మండిపడ్డారు. తెలంగాణలో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతోందని వివరించారు. కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారని ఆరోపించారు.

మిల్లర్లు రూ.370 సంపాదిస్తున్నారు

'సిండికేట్​ల వల్ల రైతులు తక్కువ ధరకు మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఎఫ్​సీఐ కొనుగోలు చేయడం వల్ల తెలంగాణలో కేవలం వరి పంట సాగు చేయాలని కేసీఆర్ కోరారు. ఎటువంటి కష్టం లేకుండా రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు రూ.370 సంపాదిస్తున్నారు. ఎఫ్​సీఐ ఇచ్చే డబ్బులతో కేసీఆర్ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను నడుపుతున్నారు. రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యానికి కేంద్రం ఎఫ్​సీఐ నుంచి సకాలంలో డబ్బులు చెల్లిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం, రైతుల నుంచి వరి ధాన్యం సేకరించిన దానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు.'

- అర్వింద్​, భాజపా ఎంపీ

రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది

రైతుల అయోమయ పరిస్థతికి సీఎం కేసీఆర్ కారణమని ఎంపీ అర్వింద్ (BJP MP Arvind) ఆరోపించారు. ఎటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లోకి రైతులను నెట్టి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వరిధాన్యం సేకరణ సకాలంలో జరగడం లేదని విమర్శించారు. డబ్బులు చెల్లింపులు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. ప్రజలు, రైతులు తిరగబడే రోజు తెలంగాణలో దగ్గరలోనే ఉందన్నారు.

తెలంగాణకు శాపం

దేశానికి ప్రధాని మోదీ వరం అయితే, కేసీఆర్​ తెలంగాణకు శాపమని అర్వింద్ (BJP MP Arvind) చెప్పారు. భాజపా, తెరాస రాజకీయంగా కొట్టుకుంటుంటే… కాంగ్రెస్ నేతలు గాంధీభవన్​లో, దిల్లీ వార్ రూంలో తమలో తాము కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యను తీర్చాల్చిన కేసీఆర్ ధర్నా చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ దిల్లీ సాక్షిగా ధర్నా చేస్తే దేశ ప్రజల ముందు దోషిగా నిలబడతారని చెప్పారు.

డిజిటలైజ్​ చేయడంతో...

ఖర్చులన్ని ఎఫ్​సీఐ ద్వారా కేంద్రప్రభుత్వం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వానికి సేకరణ బాధ్యత అప్పగిస్తే దాన్ని కూడా సరిగా నిర్వహించడం లేదు. బాయిల్ రైస్ తప్ప మిగిలిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తుంది. వరిధాన్యం సేకరణను ఇప్పుడు డిజిటలైజ్​ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గతంలో తక్కువ ధాన్యం సేకరించి రిజిష్టర్లలో ఎక్కువ సేకరించినట్లు నమోదు చేసేవారు. ఈ కుంభకోణానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సేకరణ ప్రక్రియను డిజిటలైజ్​ చేసింది. కేసీఆర్ కుటుంబ ఆధ్వర్యంలో జరిగే దళారుల కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ఎఫ్​సీఐ నిర్ణయం తీసుకుంటుంది.

- అర్వింద్​, భాజపా ఎంపీ

ఇదీ చదవండి : TRSLP Meeting : తెరాస శాసనసభాపక్షం భేటీ.. కేంద్రంపై పోరుకు కార్యచరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.