మామిడి రైతులకు తప్పని నిరాశ.. ఫలరాజుకు మళ్లీ దక్కని గిట్టుబాటు ధర..

author img

By

Published : May 1, 2022, 5:15 AM IST

Mango Farmers Problems repeating in hyderabad

Mango Farmers Problems: మామిడి రైతులకు ఏటా కష్టాల తప్పడం లేదు. వాతావరణ ప్రతికూలతలు, తెగుళ్లు , చీడపీడల వల్ల దిగుబడులు తగ్గిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడి చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మామిడి రైతులకు తప్పని నిరాశ.. మళ్లీ దక్కని గిట్టుబాటు ధర..

Mango Farmers Problems: తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు కాలం కలిసి రావడం లేదు. హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్‌కు మామిడి తరలివస్తోంది. బంగినపల్లి, దశేరి, హిమాయత్, కేసర్, తోతాపురి వంటి రకాలు వస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే మార్కెట్‌కు మామిడి కాయల రాక చాలా వరకు తగ్గిపోయింది. నాణ్యత ఆధారంగా ధరలు చెల్లిస్తున్నారు. శనివారం బాటసింగారం పండ్ల మార్కెట్‌లో టన్ను మామిడి కనిష్ఠ ధర 20 వేల రూపాయలు.. గరిష్ఠ ధర 55 వేల రూపాయలుపైగా పలికింది. ఎన్నో వ్యయ, ప్రయాసల కోర్చి సరకు తీసుకొస్తే.... నాణ్యత పేరిట కొర్రీలు పెడుతూ కమీషన్ ఏజెంట్లు సరైన ధర చెల్లించడంలేదని రైతులు వాపోతున్నారు.

వడగండ్ల వానలు, గాలిదుమారం భయంతో చాలా మంది రైతులు కాయ పక్వానికి రాక ముందే తెంపుకుని మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్ ప్రభావం, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా సరఫరా చాలా వరకు దెబ్బతింది. ఆ ప్రభావం హైదరాబాద్ మార్కెట్‌పై పడింది. రెండ్రోజుల కిందటి వరకు మామిడి ధరలు బాగా ఉన్నప్పటికీ.... తాజాగా కాస్త ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లా కోహెడలో పండ్ల మార్కెట్ సిద్ధమయ్యే వరకు బాటసింగారంలో తాత్కాలిక మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతున్న దృష్ట్యా.. నిల్వ, ప్రొసెసింగ్, శీతల గిడ్డంగులు, ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి లేకపోవడంతో వ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌కు వచ్చిన మామిడి సరకు ఎప్పటికప్పుడు వేలంపాటలో కొనుగోలు చేసిన వెంటనే... ప్యాకింగ్ చేసి దిల్లీ, ముంబయి, బెంగళూరు మార్కెట్లకు తరలించేస్తున్నారు.


ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.