మరోమారు చర్చనీయాంశంగా గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం

author img

By

Published : Sep 18, 2022, 6:40 AM IST

st

గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం మరోమారు చర్చనీయాంశమైంది. ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది. బిల్లుతో సంబంధం లేకుండా గిరిజన రిజర్వేషన్లను పెంచాలని గతంలో భావించిన ప్రభుత్వం.... తాజాగా అమలు దిశగా ముందుకెళ్తోంది.

ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్... గిరిజన రిజర్వేషన్లపై కీలకమైన ప్రకటన చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది.

గతంలోనే ఉభయసభల్లో ఆమోదం: ముస్లిం మైనార్టీలకు 12శాతం, గిరిజనులను పది శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ ఈ బిల్లు రూపొందించారు. బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లిం మైనార్టీలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లను 12శాతానికి, గిరిజనులకు అమలు అవుతున్న 6శాతం రిజర్వేషన్లను 10శాతానికి పెంచారు. ఆ బిల్లు ప్రకారం రాష్ట్రంలో బలహీన వర్గాలకు 37శాతం రిజర్వేషన్లు ఉంటాయి. A గ్రూప్ వారికి 7శాతం, Bగ్రూప్‌లో 10శాతం, Cగ్రూప్ కింద 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. D గ్రూప్‌లో 7శాతం, E గ్రూప్‌లో 12శాతం రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు ఉన్న 15శాతం రిజర్వేషన్లు ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంటాయి. మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని 50నుంచి 62కు పెంచుతూ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం కూడా పొందింది. 2017 ఏప్రిల్ 16వ తేదీన రిజర్వేషన్ల పెంపు బిల్లు శాసనసభ, మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు.

నాలుగేళ్లుగా పెండింగ్: రిజర్వేషన్ల శాతం 50 శాతాన్ని దాటుతుండడంతో తమిళనాడు తరహాలో బిల్లును తొమ్మిదో షెడ్యూళ్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ రిజర్వేషన్ల పెంపు విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఆటంకాలు లేవని... రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఉండబోవని వివరించారు. గడచిన నాలుగేళ్లుగా ఆ బిల్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది.

గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కేంద్రం నిర్ణయం ఆలస్యం చేయడంతో... బిల్లుతో సంబంధం లేకుండా కోటా పెంపు విషయమై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయమై ఆలోచన చేసింది. గిరిజన ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న గిరిజన రిజర్వేషన్ల విధానాలను కూడా అధ్యయనం చేశారు.

వారంలోగా ఉత్తర్వులు: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచిన తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలన్న అంశంపై కసరత్తు చేశారు. అందుకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయా... ఎదురైతే ఏం చేయాలన్న విషయమై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే వివిధ కారణాల రీత్యా అప్పట్లో అది ముందుకు సాగలేదు. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. కేంద్రం వద్ద ఉన్న బిల్లుతో సంబంధం లేకుండా ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచాలని నిర్ణయించిన సీఎం... వారం రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు.

64శాతానికి రిజర్వేషన్లు..!: ఈడబ్లుఎస్​తో కలుపుకొని రాష్ట్రంలో ప్రస్తుతం 60శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పదిశాతానికి పెంచితే రిజర్వేషన్ల మొత్తం 64 శాతానికి చేరుతుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏం చేస్తుందన్నది చూడాలి. అందుకే జీఓను అమలు చేస్తారా... ఉరితాడు చేసుకుంటారో... అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.