KCR Speech on TS Liberation Day : 'మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం'

author img

By

Published : Sep 17, 2022, 11:34 AM IST

Updated : Sep 17, 2022, 11:50 AM IST

KCR Speech on TS Liberation Day

KCR Speech on TS Liberation Day : ఎనిమిదేళ్ల తెరాస పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ తరుణంలో దేశం, రాష్ట్రంలో పేట్రోగిపోతున్న మతోన్మాదశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు విద్వేషపు మంటలు రగిలిస్తూ, విషవ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు

'మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం'

KCR Speech on TS Liberation Day : జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలను తిప్పికొట్టాలని ముఖ్యంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

KCR Speech on Telangana Liberation Day : "ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతదినోత్సవం శుభాకాంక్షలు. 1948 సెప్టెంబర్‌ 17న సువిశాల భారత్‌లో హైదరాబాద్‌ రాష్ట్రం విలీనమైంది. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలోని అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవి. ఆనాడు స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్‌లో విలీనం అయ్యాయి. ఆనాడు ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరినీ స్మరించుకుందాం. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కృషి జరిగింది. స్వాంతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉండేది. రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ పేరిట హైదరాబాద్‌ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీతో కలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనంపై హైదరాబాద్‌ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది." అని కేసీఆర్ ఉద్ఘాటించారు.

KCR Speech at Nampally Public Gardens : కొన్ని మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆనాడు చిన్న ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు ఎంతో నష్టపోయామని గుర్తుచేశారు. ఇప్పుడు అది పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్తపడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించి తెలంగాణను మలినం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా.. విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. తెలంగాణ నేలపై నెలకొన్న ప్రశాంత వాతావరణానికి విఘాతం కలగనీయొద్దని సూచించారు. మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

KCR Speech on TS National Unity Day : ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు అనేక రంగాల్లో ముందుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయికంటే ముందుంది. ప్రభుత్వ కృషి వల్ల జలవనరులు, పంటల దిగుబడి పెరిగింది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగింది. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో ప్రశాంతమైన పారిశ్రామిక వాతావరణం ఉంది. ప్రశాంతమైన వాతావరణం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ రంగ వృద్ధిరేటులో జాతీయ స్థాయికంటే ముందున్నాం. ఐటీ రంగం ఉత్పత్తిలో ఇటీవలే బెంగళూరును అధిగమించాం. అని కేసీఆర్ అన్నారు.

Last Updated :Sep 17, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.