New Vedic center in America: అమెరికాలోని పిట్స్బర్గ్లో చిన్మయ అమరనాథ్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 17న ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా.. ఇవాళ శివాలయ ప్రతిష్ఠాపన వైభవంగా జరగనుంది. అమరేశ్వర రూప శివలింగవతారంలో పరమేశ్వరుడు, లతితా త్రిపుర సుందరీగా పార్వతీదేవి, క్షిప్రప్రసాద గణపతిగా విఘ్నేశ్వరుని విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠాపన చేయనున్నారు. వీటితోపాటు నవగ్రహ విగ్రహాలను సైతం ఆలయంలో నెలకొల్పనున్నారు. పిట్స్బర్గ్లో నెలకొల్పిన మొట్టమొదటి శివాలయంగా... ఈ చిన్మయ అమర్నాథ్ వెలుగొందనుంది. జగదీశ్వర రూపునిగా ధ్యానమందిరంలో పరమేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. ప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా.... పిట్స్ బర్గ్ చిన్మయ మిషన్ అధ్యక్షుడు డాక్టర్ సతీశ్ నేతృత్వంలో ఈనెల 17 నుంచి నిరంతర పూజలు, హోమాలు జరుగుతున్నాయి.
2016లో చిన్మయ అమర్నాథ్ కోసం పిట్స్ బర్గ్కు 25 మైళ్ల దూరంలో 9ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 2021 మేలో అమర్నాథ్ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.... 20న ప్రారంభోత్సవం జరిగింది. చిన్మయ అమర్నాధ్..... కేవలం శివాలయంగా మాత్రమే కాకుండా వైదిక కేంద్రంగా వర్థిల్లనుంది. అమెరికాలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలతోపాటు వేదాల్లోని జ్ఞానాన్ని, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ సంపదను ఈ కేంద్రం ద్వారా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందించనున్నారు. బాలవిహార్ పేరిట నిర్వహించే తరగతుల కోసం ఈ కేంద్రంలో ప్రత్యేకంగా 11 గదులు నిర్మించారు. సదస్సులు, సమావేశాల కోసం 21వేల చదరపు అడుగుల్లో సకల వసతులతో ఆడిటోరియం, భోజనశాల ఏర్పాటు చేస్తున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు, పుట్టిన రోజులు, వివాహశుభాకార్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సేవా కార్యక్రమాలను... భారతీయ సమాజం ఈ కేంద్రం ద్వారా జరుపుకోవచ్చు. భారతీయులను, ప్రత్యేకంగా తెలుగువారిని ఏకం చేయడంలో చిన్మయ అమరనాథ్ కీలక భూమిక పోషించనుంది. 4 రోజులుగా సాగుతున్న ఈ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు పిట్స్బర్గ్లోని భారతీయులు, తెలుగువారు పెద్దఎత్తున హాజరవుతున్నారు.