Medicine from the Sky: ఆకాశమార్గాన ఔషధాల సరఫరా.. ఎక్కడో తెలుసా..?

author img

By

Published : Sep 9, 2021, 5:06 AM IST

Updated : Sep 9, 2021, 4:19 PM IST

Medicine from the Sky

దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్​ల సహాయంతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదిక కానుంది. ఈ నెల 11న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వికారాబాద్​లో లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి త్వరలో డ్రోన్లను వినియోగించనున్నారు. ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’(Medicine from the Sky) అనే ప్రాజెక్టును రాష్ట్రంలో అమలుచేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా ప్రయోగం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో అమలు కానుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈనెల 9 నుంచి అక్టోబరు 10 వరకు వికారాబాద్‌ జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో స్కై మెడిసిన్స్ కార్యక్రమ ఏర్పాట్లను వికారాబాద్‌లో మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. వికారాబాద్​ ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్‌ నిఖిల సమక్షంలో ప్రయోగాత్మక పరీక్షను నిర్వహించారు. రెండు రోజులపాటు ప్రక్రియ పరిశీలించిన అనంతరం.. శనివారంనాడు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్​ డ్రోన్‌ మెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

వికారాబాద్​లో ప్రయోగాత్మక పరిశీలన

మారుమూల పల్లెలకు

తొలిరోజు వికారాబాద్ జిల్లాలో 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్‌ల ద్వారా మందులు పంపిణీ చేయనున్నారు. రవాణా ఇబ్బందులు లేకుండా, అటవీ ప్రాంత ప్రజలకు ఔషధాలు అందించడానికి కార్యక్రమం దోహదపడుతుంది. మారుమూల పల్లెలకు, హెల్త్ సెంటర్లకు అత్యవసర సమయంలో వ్యాక్సినేషన్, ఇతర అత్యవసర ఔషధాలు అందించడం సులభతరం కానుందని జిల్లా కలెక్టర్‌ నిఖిల తెలిపారు. డ్రోన్‌ 140మీటర్ల ఎత్తు వరకు ఎగురవేసేందుకు అనుమతులు ఉన్నాయని వెల్లడించారు.

మారుమూల గ్రామాల్లోని రోగులకు తొందరగా అమలు చేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుంది. రోడ్డు మార్గం సరిగాలేని గ్రామాలకు డ్రోన్ల ద్వారా మందులు అందజేస్తాం. వికారాబాద్​లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. -నిఖిల వికారాబాద్​ కలెక్టర్​

స్కైలైన్‌ ఎయిర్‌ అనే అంకుర సంస్థ బ్లూ డార్ట్‌ ఎయిర్‌తో కలసి డ్రోన్లు సమకూర్చి ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఒక్కో డ్రోన్‌ సుమారు 40 కి.మీ. వరకూ ప్రయాణించగలదు. ఇందులో సుమారు 15 కిలోల ఔషధాలు, టీకాల సరఫరాకు వీలుంటుంది. నాణ్యత దెబ్బతినకుండా డ్రోన్‌లో నాలుగు వేర్వేరు బాక్సుల్లో మందులను సర్ది పంపిస్తారు. భూమికి సుమారు 500- 700 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్‌ ప్రయాణిస్తుంది. నెలరోజుల పరిశీలన అనంతరం తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తారని వైద్యవర్గాలు వివరించాయి.

ఇదీ చదవండి: HC ON GANESH IMMERSION: హుస్సేన్ సాగర్​లో గణేష్‌ నిమజ్జనంపై నేడు తొలగనున్న అనిశ్చితి

Last Updated :Sep 9, 2021, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.