D Srinivas: రాజకీయ ఉద్ధండుడు డీఎస్ దారెటు.. పెద్దాయనవైపా.. చిన్నాయనవైపా?

author img

By

Published : Nov 14, 2021, 9:31 AM IST

Updated : Nov 14, 2021, 9:58 AM IST

dharmapuri srinivas joining in which party is more interesting issue in telangana now

డీఎస్ దారెటు(dharmapuri srinivas latest news).. ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పార్టీలో రాష్ట్రం నుంచి అత్యంత సన్నిహితుడిగా పేరున్న డీఎస్.. ఏ పార్టీలో చేరుతారన్న చర్చ ఊపందుకుంది. ఇటీవల కాలంలోనే కాంగ్రెస్, భాజపా ముఖ్య నాయకులు డీఎస్​ను కలవడమే ఇందుకు కారణం. ప్రాభవం కోల్పోయిన పార్టీకి డీఎస్ రాజకీయ చతురత పనికొస్తుందని కాంగ్రెస్ నమ్మితే.. తెలంగాణలో పాగా వేసేందుకు డి.శ్రీనివాస్ వ్యూహాలు అవసరమని భాజపా భావిస్తోంది. డీఎస్ కుమారులిద్దరు చెరో పార్టీలో ఉండటంతో ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర రాజకీయ ఉద్దండుల్లో ధర్మపురి శ్రీనివాస్(DS) ఒకరు. కాంగ్రెస్​లో రాష్ట్రం నుంచి సోనియాగాంధీని నేరుగా కలిసే వ్యక్తుల్లో డీఎస్ ఒకరిగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు తారుమారు కావడం, కాంగ్రెస్ తీసికట్టుగా మారిపోవడంతో 2015లో డీఎస్ తెరాస గూటికి చేరారు. మొదట ప్రభుత్వ సలహాదారుగా.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవి వరించింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి జిల్లా తెరాస ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం, రానురానూ పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో డీఎస్ కుమారుడు అర్వింద్ భాజపాలో చేరి ఎంపీగా పోటీ చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత మీద అర్వింద్ గెలిచారు. ఆయన గెలుపు వెనక డీఎస్ ఉన్నారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్​కు జిల్లా నేతలు తీర్మానం పంపించారు. అప్పటి నుంచి మౌనం వహిస్తూ వచ్చారు. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనని డీఎస్ ఎదురు చూశారు. అలాంటిదేమీ జరకగపోవడంతో పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. తెరాస అధిష్ఠానం సైతం డీఎస్​ను పక్కన పెట్టేసింది.

నేతల వరుస భేటీలతో ఆసక్తి..

ఇక్కడి వరకు బాగానే ఉన్నా... ఇటీవల జరుగుతున్న పరిణామాలతో డీఎస్ దారెటు అన్న చర్చ ప్రారంభమైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. డి.శ్రీనివాస్​ను కలిశారు. ఇంట్లో ప్రమాదానికి గురైన డీఎస్​ను రేవంత్ పరామర్శించారు. ఇటీవల ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ సైతం డీఎస్​ను కలిశారు. సుదీర్ఘంగా వారితో చర్చించారు. ఆ సమయంలో డీఎస్ తోపాటు ఎంపీ అర్వింద్ సైతం ఉండటం గమనార్హం. రేవంత్ కలిసిన సమయంలో డీఎస్ కాంగ్రెస్​కు తిరిగి వస్తారని అంతా చర్చించుకున్నారు. ఇప్పుడు ఈటల కూడా కలవడంతో భాజపాలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీఎస్ తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా.. మరో ఎనిమిది నెలల్లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఇక తన పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్​లో ఉండగా.. చిన్న కుమారుడు అర్వింద్ భాజపా ఎంపీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో డీఎస్​ ఎటు మొగ్గు చూపుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది.

హస్తం పూర్వ వైభవానికి..

డీఎస్ రాజకీయ వ్యూహాల గురించి కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు. అలాగే ఎన్నికల సమయంలో తండ్రి వెంటే ఉండి రాజకీయాలను పరిశీలించిన కుమారులిద్దరికీ తెలుసు. అందుకే రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారి డీఎస్ పరామర్శించేందుకు వచ్చినప్పుడే ఇద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, తిరిగి పూర్వ వైభవం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చర్చించినట్లు సమాచారం. ఆ సమయంలో తిరిగి కాంగ్రెస్​కు రావాలని రేవంత్ ఆహ్వానించినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం డీఎస్​ను కలిశారు. ఆ సమయంలోనే పార్టీకి తిరిగి రావడంపై చర్చ వచ్చినట్లుగా తెలిసింది. ఆ సమయంలో డీఎస్ కాంగ్రెస్​లో చేరొచ్చన్న వార్తలు వినిపించినా.. డీఎస్ మాత్రం మౌనం వీడలేదు.

కమలం మరింత బలపడుతుందని..

ఇక డీఎస్​ను చిన్న కుమారుడైన అర్వింద్ భాజపాలోకి తెచ్చేందుకు మొదట్నుంచి ఆసక్తితోనే ఉన్నారు. భాజపాలోకి డీఎస్ వస్తే రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని పార్టీ పెద్దల వద్ద అర్వింద్​ ప్రస్తావించారు. ఇందులో భాగంగానే ఇటీవల హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈటల రాజేందర్.. డీఎస్​ను కలిశారు. తెలంగాణలో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పాగా వేయొచ్చన్నది భాజపా అధిష్ఠానం ఆలోచన. అందుకే డీఎస్​ను పార్టీలో చేర్చుకునేందుకు మొదట్నుంచి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ విజయం ఇచ్చిన ఊపులో డీఎస్ పార్టీలో చేరితే మరింత బలం వస్తుందని పార్టీ భావిస్తోంది. తెరాస తీరుతో విసిగిపోయిన డీఎస్​ను.. తెరాస నుంచి బయటకు వచ్చి భాజపా నుంచి గెలిచిన ఈటల రాజేందర్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుదీర్ఘ మంతనాలు జరిపారు. చర్చల సమయంలో డీఎస్ కుమారుడు అర్వింద్ సైతం ఉండటంతో చర్చకు తెరలేసింది. భాజపాలోకి రావాలని.. 2023 లక్ష్యంగా పని చేద్దామని డీఎస్​ను ఈటల ఆహ్వానించినట్లు సమాచారం. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని బయటకు చెబుతున్నా.. డీఎస్ వంటి సీనియర్ల అవసరం పార్టీకి ఉందని పెద్దల ఆలోచన. పార్టీ సీనియర్ల సూచన మేరకే ఈ భేటీ జరిగిందనే ప్రచారం సైతం సాగుతోంది.

ఇప్పటికీ మౌనం వీడని మునిగానే..

డి.శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైఎస్సార్ హయాంలో పీసీసీ చీఫ్​గా ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మంత్రిగానూ పని చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్, భాజపాల్లో ఏ పార్టీలో చేరుతారన్న చర్చ జరుగుతున్నా.. డీఎస్ నుంచి ఎటువంటి నిర్ణయం రావడం లేదు. గతంలో ఏ విధంగా మౌనంగా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే కొనసాగుతున్నారు. డీఎస్ కుమారుడు అర్వింద్ ఇప్పుడు తెలంగాణ భాజపాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. ఇద్దరు కుమారులు రెండు పార్టీల్లో ఉండటంతో.. ఏ నిర్ణయమూ తీసుకోలేక పోతున్నట్లుగా తన అనుయాయులు అనుకుంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా నేతల వరుస భేటీలు సాధారణం కాదని మాత్రం కార్యకర్తలు అనుకుంటున్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అంతా భావిస్తున్నారు. అదే జరిగితే తాను సుదీర్ఘ కాలం పని చేసిన కాంగ్రెస్​లోకి వెళ్తారా..? లేదంటే కాషాయం కండువా కప్పుకుంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు డీఎస్ విషయంలో తెరాస వేచిచూసే ధోరణితోనే కనిపిస్తోంది.

ఇదీ చూడండి:

Last Updated :Nov 14, 2021, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.