కేఎంపీఎల్​ తగ్గిందని.. జీతం నుంచి కట్టమని డ్రైవర్​కు డిపో మేనేజర్​ నోటీసు

author img

By

Published : May 10, 2022, 10:43 AM IST

Fuel Issue in TSRTC

Fuel Issue in TSRTC : ఆర్టీసీ బస్సు కేఎంపీఎల్ తగ్గితే.. అది డ్రైవర్ల జీతం నుంచి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఎక్కువ కలెక్షన్ తీసుకురాకపోతే కండక్టర్‌పై అధికారులు మండిపడుతున్నారు. మరోవైపు ఎక్కడపడితే అక్కడ ఆపుతూ పోతే డీజిల్ వ్యయం ఎక్కువవుతోందని.. డిపోలో చీవాట్లు తినాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. ట్రిప్పులు తగ్గినా.. సమయానికి బస్సులు రాకున్నా.. ఇంధనం ఎక్కువ వ్యయం అయినా.. డ్రైవర్‌పై డిపో మేనేజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Fuel Issue in TSRTC : టీఎస్‌ఆర్టీసీలో వింత పరిస్థితి నెలకొంది. ఎక్కువ కలెక్షన్‌(ఆదాయం) తీసుకురాకపోతే కండక్టర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా అని ప్రతి దగ్గర ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటే.. డ్రైవర్‌ కండక్టర్‌పై కస్సుమంటున్నాడు. ఇలా ఎక్కడపడితే అక్కడ ఆపుతూ పోతే డీజిల్‌ వ్యయం ఎక్కువవుతోందని.. దీంతో తాను డిపోలో చీవాట్లు తినాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.

Fuel Issue in TSRTC
కేఎంపీఎల్​ తగ్గిందని.. జీతం నుంచి కట్టమని డ్రైవర్​కు డిపో మేనేజర్​ నోటీసు

ట్రిప్పులు తగ్గినా.. సమయానికి బస్సులు రాకున్నా.. ఇంధనం ఎక్కువ వ్యయం అయినా.. డ్రైవర్‌పై డిపో మేనేజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరుకు లీటరు డీజిల్‌కు తిరగాల్సిన కిలోమీటర్లు(కేఎంపీఎల్‌) తగ్గాయని ఓ డ్రైవర్‌కు నెల మొత్తం లెక్కలు కట్టి.. రూ.10 వేలు నీ జీతంలో ఎందుకు కోత విధించరాదో వివరణ కోరుతూ డిపో మేనేజర్‌ ఏకంగా తాఖీదు ఇచ్చారు. ఈ పరిణామాలు ఆర్టీసీలో చర్చనీయాంశమయ్యాయి.

మీ వల్ల రూ.10వేల నష్టం అంటూ.. మిథాని డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సును డ్రైవర్‌ ఏప్రిల్‌లో 4400 కిలోమీటర్లు నడిపారు. 948 లీటర్ల డీజిల్‌ ఖర్చు చేశారు. ఒక లీటర్‌ డీజిల్‌కు 4.64 కిలోమీటర్లే మాత్రమే వచ్చింది. 5.20 కిలోమీటర్లు రావాల్సి ఉండగా.. మీరు ఎక్కువ ఇంధన వ్యయం జరిగేలా చేయడంతో 102 లీటర్లు అదనంగా కొనాల్సి వచ్చింది. దీంతో రూ.10,710ల నష్టం వచ్చింది. ఇప్పటికే రూ.3 కోట్ల నష్టంలో ఉన్న డిపో ఈ అదనపు భారం ఎలా మోయగలదు. ఈ నష్టాన్ని మీ జీతం నుంచి ఎందుకు వసూలు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ డిపో మేనేజర్‌ తాఖీదు జారీ చేశారు. దూర ప్రాంతాలకు నడిచే బస్సుల ఇంధన వ్యయంపైనే కాదు.. నగరంలో తిరుగుతున్న బస్సుల ఇంధనవ్యయాన్ని వారానికోసారి మదింపు చేసి.. ఎందుకు ఇంత ఖర్చు చేయాల్సి వస్తుందో వివరణ కోరడం పరిపాటిగా మారింది.

క్లాసుల నుంచి కాసుల కోత వరకూ.. ఆర్టీసీ డ్రైవర్లకు ఇప్పటి వరకూ క్లాసులు తీసుకుని.. ఇంధన పొదుపు పాటించేలా.. ఎక్కువ కేఎంపీఎల్‌ వచ్చేలా చూసే డిపో మేనేజర్లు చివరికి వారి జీతాల్లో కోతకు కూడా వెనుకాడడంలేదు. ఇదే ఇప్పుడు డ్రైవర్ల నిరసనకు కారణమవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజూ 1.43 లక్షల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసీ వినియోగిస్తోంది. ఇలా డీజిల్‌పైన రూ.1.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇంధన పొదుపుపై ఆర్టీసీ డ్రైవర్ల మీద ఒత్తిడి పెరిగింది. రోజూ డ్రైవర్లు లక్ష్యంగా మారుతున్నారు. వరుసగా వారం రోజులు చూసి.. వారికి విధులు అప్పగించకుండా డిపోలకు పిలిపించుకుని ఉదయం నుంచి అలా వేచి చూసేలా చేసి.. క్లాసులు తీసుకుంటున్నారని.. పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.

ఆర్డినరీ బస్సులు లీటరు డీజిల్‌కు 5.8 కిలోమీటర్లు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అయితే 4.50 కిలోమీటర్లు నడవాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు నిర్దేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకపోతే కొంతవరకూ డ్రైవర్లు లక్ష్యం మేరకు నడుపుతున్నారు. ట్రాఫిక్‌ జామ్‌లుంటే ఎలా అని డ్రైవర్లు వాపోతున్నారు. వీరి వాదనలు ఇలా ఉంటే.. ఇదే మార్గంలో వేరే కండక్టర్‌, డ్రైవరు వెళ్లినప్పుడు ఎందుకు సమస్యలు రావడంలేదంటూ అధికారులు సూటిగా అడుగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.