CM KCR Delhi Tour: హస్తినలో సీఎం కేసీఆర్​.. వీటిపై స్పష్టత వచ్చాకే తిరుగుముఖం..!

author img

By

Published : Nov 22, 2021, 4:59 AM IST

cm kcr will meet central minister and discuss on several issues in Delhi tour

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు, విభజన చట్టంలో హామీలు, నీటి వాటా కేటాయింపుల్లో స్పష్టత తదితర విషయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారుల బృందాలు హస్తినకు వెళ్లాయి. నాలుగురోజుల పాటు అక్కడే ఉండి ప్రధాని సహా కేంద్రమంత్రులతో సీఎం సమావేశం కానున్నారు.

యాసంగి ధాన్యం కొనుగోళ్ల(paddy procurement in telangana)పై కేంద్రం నుంచి స్పష్టత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ దిల్లీ(CM KCR Delhi Tour) వేదికగా కార్యచరణ ముమ్మరం చేశారు. యాసంగిలో ఎంత మేర వడ్లు కొంటారో తేల్చడంతో పాటు.. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, కృష్ణా, గోదావరి జలాల్లో(krishna godavari water dispute) రాష్ట్ర వాటాను పక్కాగా కేటాయించాలన్న అంశాన్ని దిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్​ హస్తినకు వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ, పౌరసరపరాల శాఖ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు బయలుదేరి వెళ్లారు.

హస్తినలోనే శుక్రవారం దాకా..

3 నుంచి 4 రోజులు హస్తినలోనే ఉండి.. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌లను కేసీఆర్​ కలవనున్నారు. రాష్ట్ర మంత్రులు తొలుత పీయూష్‌ గోయల్‌ను కలిసి చర్చిస్తారు. అనంతరం ప్రధానితో సీఎం భేటీ అవుతారు. ప్రధాని మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే అనుమతి కోరింది. భేటీల నేపథ్యంలో శుక్రవారం వరకూ ముఖ్యమంత్రి దిల్లీలోనే ఉంటారని తెలిసింది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేపట్టాలంటూ... ఇందిరాపార్కు వద్ద స్వయంగా కేసీఆర్‌ ధర్నా చేపట్టారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం నుంచి వెలువడ్డ ప్రకటనపైనా మరింత స్పష్టత కోరనున్నారు. ఆ మేరకు యాసంగిలో ఏ పంట వేయాలో రైతులకు సీఎం సూచించే అవకాశం ఉంది.

మిగతా అంశాల ప్రస్తావన..

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేయనున్నారు. గిరిజన రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ.. కేంద్రం తేల్చడం లేదని ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. కేంద్రం తేల్చకపోతే గిరిజన పోరాటాలు చేస్తామని కేసీఆర్​ ఇప్పటికే ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చాలా కాలంగా ఉందని.. దానిపై కేంద్రం ఏదో ఒకటి తేలిస్తే.. ఏం చేయాలో నిర్ణయించుకుంటామన్న ముఖ్యమంత్రి.. దానిపై కూడా స్పష్టత కోరనున్నారు.

సతీమణి యోగక్షేమాల సమాచారం..

సీఎం కేసీఆర్​ సతీమణి శోభకు ఎయిమ్స్‌లో ఆరోగ్య పరీక్షల నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి కేటీఆర్​ హస్తినలోనే ఉన్నారు. దిల్లీ చేరుకున్న వెంటనే తన భార్య ఆరోగ్య పరీక్షల సమాచారాన్ని సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.