Chandrababu crying: అసెంబ్లీలో అడుగుపెట్టను.. నాడు ఎన్టీఆర్... నేడు చంద్రబాబు..!

author img

By

Published : Nov 19, 2021, 7:30 PM IST

Updated : Nov 19, 2021, 8:00 PM IST

Chandrababu Naidu

ముఖ్యమంత్రి అయ్యాకే.. అసెంబ్లీలో అడుగుపెడతానని ఆనాడు ఎన్టీఆర్​ శపథం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును ఖండిస్తూ ప్రతిజ్ఞబూనిన ఎన్టీఆర్ అన్నట్లుగానే విజయం సాధించారు. తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu crying) ఈ తరహాలోనే వ్యాఖ్యలు చేయటం.. రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

'వైకాపా అరాచకపాలనపై నేను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలి. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తాను.. అంతవరకూ వెళ్లను. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా' అంటూ తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu crying) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​ మారాయి. నాడు ఎన్టీఆర్ ఈ తరహాలోనే వ్యాఖ్యలు చేయటం.. తిరిగి తెదేపా అధికారంలోకి రావటం వంటి పరిణామాలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. అసలు నాడు ఎన్టీఆర్.. సభను ఎందుకు వాకౌట్ చేశారు..? ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. చేసిన శపథం ఏంటో చూస్తే...!

ఎమ్మెల్యే శివారెడ్డి హత్య..

1993 ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్​లో జరిగిన ఓ వివాహా కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే శివారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే శివారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్టీఆర్​ను తీవ్రంగా కలిచివేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శివారెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు యత్నించారు. అడ్డుకున్న ఎన్టీఆర్.. రాజ్​భవన్​ వరకూ శవయాత్ర జరపాలన్నారు. పోలీసులు తొలుత ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించినా.. తరువాత అనుమతించారు. ఫలితంగా శవయాత్ర రాజ్ భవన్ వరకు సాగింది. హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని నాటి గవర్నర్​ కష్ణకాంత్​ను ఎన్టీఆర్​ కోరారు. గవర్నర్​ సూచనతో ఎన్టీఆర్ ఆందోళన విరమించారు.

అసెంబ్లీలో ప్రకంపనలు.. సభ నుంచి వాకౌట్

శివారెడ్డి హత్య అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఎన్టీఆర్​ పట్టుబట్టారు. నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్పందిస్తూ.. హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని పేర్కొంటూ.. న్యాయవిచారణ డిమాండ్​ను తిరస్కరించారు. సీఎం నిర్ణయంపై తెదేపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు సస్పెన్షన్​కు గురయ్యారు. మార్షల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ తన సీటు నుంచి కదల్లేదు. అయినా సస్పెన్షన్ వేటు పడింది. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఏ కారణంగా తనను సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ఈ సభలో నాయకులకు గౌరవం లేదని.. సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పటం లేదన్నారు. అకారణంగా సస్పెండ్ చేశారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సర్కార్​ తీరును నిరసిస్తూ.. సభను బహిష్కరించారు. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం సభలో అడుగుపెట్టనని శపథం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటంతో అసెంబ్లీలో అడుగుపెట్టి.. తన శపథాన్ని నేరవెర్చుకున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలు.. ఎందుకంటే..

అసెంబ్లీలో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో (Chandrababu crying) స్పందించారు. అసెంబ్లీని వాకౌట్ చేసిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. తన జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని.. రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు (Chandrababu crying).. "బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు కౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ. గతంలో వైఎస్‌ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్‌ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు. జగన్‌ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి.. నాకు పదవులు అవసరం లేదు. నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించారు" అని చంద్రబాబు చెప్పారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ చేశారని... గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో అడుగుపెట్టను.. నాడు ఎన్టీఆర్... నేడు చంద్రబాబు..!

తేల్చుకున్నాకే అసెంబ్లీకి..

"నా భార్యను కించపరిచేలా నిండు సభలో వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారు. ఆమె త్యాగం, నా పోరాటం ప్రజలకు తెలుసు. మీ ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడితే..ఎంత బాధపడతారో గుర్తుంచుకోండి. అదే నా ఆవేదన. రెండున్నరేళ్లుగా మమ్మల్ని బండ బూతులు తిడుతున్నారు. మా పార్టీ నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. గత ఎన్నికల్లో మాకు 23, వైకాపాకు 151 స్థానాల్లో ప్రజలు విజయాన్ని కట్టబెట్టారు. నేనేం తప్పు చేశానో ప్రజలకే తెలియాలి. శాసనసభలో మైక్ ఇవ్వకుండా అవమానించారు. వాజ్​పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీ సీఎం వ్యక్తిగతంగా ఏం ఆశించరు..కేవలం ప్రజల కోసమే పనిచేస్తారనే కితాబిచ్చారు. అప్పట్లోనే నన్ను కేంద్రంలోకి ఆహ్వానించారు. కొత్తగా నాకు పదవులు, రికార్డులు అక్కర్లేదు. రామాయణంలో రాక్షసులు ఏం చేశారో చూశాం. దేవతల దగ్గర వరం తీసుకున్న భస్మాసురుడు ఏం చేశారో చూశాం. గతంలో తరిమెల నాగిరెడ్డి, ఎన్టీ రామారావు తాము చెప్పదలచినది చెప్పి సభ నుంచి బయటకు వచ్చారు. నేను కూడా క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతా. ఈ ధర్మపోరాటంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా." - చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత

ఇదీ చదవండి:

Chandra Babu Naidu: 'తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా..'

CHANDRABABU:'ఇది గౌర‌వ స‌భా..కౌరవ స‌భా'..: చంద్రబాబు

Last Updated :Nov 19, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.