'కోర్టుల్లో వ్యాజ్యాలను ఏపీ వెనక్కి తీసుకుంటేనే.. అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి..'

author img

By

Published : Jan 12, 2022, 8:42 PM IST

Central Home Department Video conference with Telugu States CSs on State division issues

విభజన వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసహంరిచుకోవాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. కోర్టుల్లో వ్యాజ్యాలు వెనక్కి తీసుకుంటేనే తొమ్మిది, పదో షెడ్యూలులోని ఆస్తులు, విద్యుత్ బకాయిల వివాదం తేలుతుందని పేర్కొంది. దిల్లీలోని ఏపీ భవన్ విభజనకు ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. కేంద్రం సూచన మేరకు నగదు నిల్వల పంపిణీ కోసం ఇరు రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించాయి. రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది.

విభజన సమస్యలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్​లు వివిధ విభజన అంశాలను ప్రస్తావించారు. విభజన వివాదాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పలు కోర్టు కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. కేసులు ఉపసంహరించుకుంటేనే తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని తెలిపింది.

కోర్టుల్లో స్టేలు..

తొమ్మిదో షెడ్యూలులోని డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్​కు కేటాయించిన 5 వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సీఎస్ తెలిపారు. ఏపీ ఆర్థిక సంఘం.. ఏపీఎస్ఎఫ్​కి చెందిన 200 కోట్ల రూపాయల వివాదంపై కూడా కోర్టుకెళ్లి స్టే తెచ్చారని ఫిర్యాదు చేశారు. పదో షెడ్యూలులోని విద్యా సంస్థల విభజనలోనూ కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లిందన్నారు. డిస్కంల నుంచి 3,442 కోట్లు రావల్సి ఉందని ఏపీ చెబుతోందని.. అయితే ఆ రాష్ట్రం 12,111 రూపాయలు చెల్లించాల్సి ఉందని సీఎస్ సోమేష్ కుమార్ వివరించారు. విద్యుత్ వివాదాల పరిష్కారానికి నీరజా మాథూర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటై ఏడున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ... నివేదిక సమర్పించలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపించింది.

ఏపీహెచ్ఎంఈఎల్ పూర్తిగా తెలంగాణదే..

సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ పూర్తిగా తెలంగాణదేనని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. సింగరేణి విషయంలో ఏపీ అభ్యంతరాలపై కేంద్రం జోక్యం చేసుకోవద్దని కోరింది. తెలంగాణకు 51శాతం, కేంద్రానికి 49శాతం వాటా కొనసాగుతుందని సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఏకీభవించినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. దిల్లీలోని ఏపీ భవన్ విభజనపై ఇరు రాష్ట్రాలు కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇరు రాష్ట్రాల ఆర్థిక, ఆర్అండ్ బీ ముఖ్యకార్యదర్శులు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లు ఉండాలన్న తెలంగాణ సూచనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఏకీభవించారు. ఏపీ భవన్ విభజనకు సంబంధించిన అన్ని అంశాలను ఆ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని అజయ్ కుమార్ భల్లా తెలిపారు.

బకాయిలు వెంటనే చెల్లించాలి..

విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన, బకాయిలపై చర్చ జరిగింది. విభజన చట్టాన్ని సవరించవద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు చట్ట సవరణ చేస్తే గందరగోళానికి దారి తీస్తుందని తెలిపింది. ఒకవేళ చట్ట సవరణ అవసరం లేదనకుంటే.. తాము నష్టపోయిన సొమ్ము కేంద్రమే చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. తమకు రావల్సిన బకాయిలను ఏపీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. హైకోర్టు, రాజ్​భవన్ వంటి ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం, కేంద్ర పథకాలు, నిర్మాణాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సుమారు 1500 రావల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. నగదు నిల్వల పంపిణీ కోసం ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులను నోడల్ అధికారులుగా నియమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించారు. సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్​తో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.