చేలల్లో కన్నీటి ఊటలు.. వేల ఎకరాల్లో ఇసుక, బురద, రాళ్ల మేటలు..

author img

By

Published : Jul 20, 2022, 8:57 AM IST

FLOODS CAUSED HUGE LOSSES

గోదారమ్మ ఆగ్రహం రైతులకు శాపంగా మారింది. రాళ్లు, ఇసుకమేటలు, బురద పేరుకుపోయి... పంటపొలాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఆదిలాబాద్‌ మెుదలుకొని భద్రాద్రి జిల్లా వరకు ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. చేను బాగు చేసుకోలేక మళ్లీ పెట్టుబడులకు అప్పు తెచ్చుకోలేక... దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రభుత్వమే తమకు ఓ దారి చూపాలని వేడుకుంటున్నారు.

అధిక వర్షాలు, వరదలు రైతులను నిండా ముంచాయి. ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని అన్నదాతల దీనావస్థ వర్ణనాతీతంగా ఉంది. వరదలో మునిగి నాశనమైన పైర్లు, నార్లు ఒకవైపు.. ఇసుక, బురద, రాళ్ల మేటలతో నామరూపాల్లేకుండా పోయిన పొలాలు మరోవైపు.. వీటిని చూసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పంట దెబ్బతినడం కన్నా ఇసుక, బురద నిండి భూములు పాడైన నష్టం ఎక్కువగా ఉందని పలువురు చెబుతున్నారు. ఎగువన ఉన్న మంచిర్యాల మొదలుకుని, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల దాకా వేలమంది రైతుల పరిస్థితి ఇదే. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు వర్షాలు, వరదలకు మునిగిపోయి దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో ఇసుక, బురద మేటలు వేయడంతో సాగుకు తక్షణం పనికిరాని స్థితికి చేరాయి. వీటిని తిరిగి సాగుకు సిద్ధం చేయడానికి రైతులు పెట్టాల్సిన ఖర్చులు.. పంటలకు వాటిల్లిన నష్టం కంటే చాలా ఎక్కువగా ఉంది.

మా పొలానికొస్తే.. ఉచితంగా ఇసుక!

మా పొలానికొస్తే.. ఉచితంగా ఇసుక.. భారీవర్షాలు, వరదల కారణంగా వాగులు, వంకల్లోని ఇసుక పంటపొలాలను ముంచెత్తింది.. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోనే సుమారు 150 ఎకరాల్లో ఇలా ఇసుక మేటలు వేసింది. దాన్ని తొలగించడానికి డబ్బు లేక అనేకమంది రైతులు ఉచితంగా ఇసుక తీసుకెళ్లమని అవసరార్థులకు చెబుతున్నారు. తంతోలి గ్రామానికి చెందిన స్వామి అనే రైతు నాలుగెకరాల్లో పత్తి వేయగా వాగు ఉద్ధృతికి ఇసుకంతా వచ్చి చేరింది. దాన్ని ఉచితంగా తీసుకెళ్లమని చెప్పగా కొందరు ట్రాక్టర్లలో తరలిస్తున్నారిలా..

పంటా పోయె.. పొలమూ మాయమాయె!

పంటా పోయె.. పొలమూ మాయమాయె.. అప్పులు తెచ్చి వేసిన పత్తి పంట మొలకలొచ్చాయి. సంబరపడిన రైతుల ఆశలన్నీ భారీవర్షాలతో నీటిపాలయ్యాయి. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం లింగుగూడకు చెందిన రైతు మెస్రం ఇంద్రు, పక్కనే మరో రైతు శ్యాంరావు ఆరేసి ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వాగుకు గండి పడటంతో ఆ నీరంతా మొత్తం చేనులోంచే ప్రవహిస్తోంది. రాళ్లురప్పలు మేటవేసి పంటతో పాటు పొలాన్నీ నామరూపాలు లేకుండా చేసేయడంతో రైతులు గొల్లుమంటున్నారు. సాగు కోసం చెరో రూ.2 లక్షల చొప్పున అప్పు చేసినట్లు చెబుతూ ఆవేదన చెందుతున్నారు.

మాడిపోయిన వరినారు

మాడిపోయిన వరినారు.. ఇది ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గోదావరి వరదలో మునిగి పాడైన వరినారు. కొప్పుల నాగరాజు అనే రైతు మూడెకరాల్లో వరి సాగు కోసం నారు పోయగా వరదలో మూడు రోజులు మునిగి పాడైంది. నాటు వేయడానికి పనికిరాకుండా నారు మాడిపోయిందని, మొత్తం రూ.10 వేల వరకూ పెట్టుబడి నష్టపోయినట్లు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఇలా పలుచోట్ల రైతులు పంటలు నష్టపోయారు.

ఆదిలక్ష్మి

ఇసుక, రాళ్లు తొలగించేదెలా.. ‘‘పంట పోతే మళ్లీ అప్పో, సప్పో చేసి మరోసారి విత్తనాలు వేస్తాం. అప్పులు దొరక్కపోతే భూమిని పడావుగా పెట్టి పంట విరామం పాటిస్తాం. కానీ, చేలలో పేరుకుపోయిన ఇసుక, బురద, రాళ్లను తొలగించి మళ్లీ సాగుకు సిద్ధం చేయడం ఎలాగో తెలియడం లేదు’’ అని ములుగు జిల్లా మారుమూల అటవీ ప్రాంతం దేవాదుల గ్రామానికి చెందిన మహిళా రైతు చిడుముల ఆదిలక్ష్మి వాపోయారు. ఎకరంన్నర పొలంలో వరి సాగుకు రూ.5 వేలు పెట్టుబడి పెట్టి నారు పోస్తే అది కాస్తా నాశనమైందన్నారు.

ఐతరాజు సీతారామరాజు

ప్రభుత్వం ఆదుకోవాలి.. గోదావరి వరద బాగా దెబ్బతీసింది. వరద నీరు వెళ్లిపోయినా ఇసుక, బురద మేట వేయడంతో ఈ సీజన్‌లో పంట సాగు సాధ్యమయ్యేలా లేదు. ఇసుక మేట వేసిన భూములను బాగు చేసుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి.. వరద ముంపు గ్రామాల రైతులను ఆదుకోవాలి. - ఐతరాజు సీతారామరాజు, మోతె పట్టినగర్‌, భద్రాద్రి జిల్లా

ఎనగందుల రమేశ్‌

పత్తి మొక్కలు నామరూపాల్లేకుండా పోయాయి.. మూడెకరాల్లో పత్తి సాగు చేశాను. రూ.60 వేల దాకా పెట్టుబడి పెట్టాను. గోదావరి వరద వచ్చి చేలో ఇసుక మేటలు వేసింది. పత్తి మొక్కలు నామరూపాల్లేకుండా పోయాయి. పెట్టుబడి మొత్తం పోయింది. భూమి చదునుకే చాలా ఖర్చవుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. - ఎనగందుల రమేశ్‌, గుడిరేవు గ్రామం, మంచిర్యాల జిల్లా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.