12వేల మంది ఉద్యోగులపై గూగుల్ వేటు.. వారికి సారీ చెప్పిన సుందర్ పిచాయ్

author img

By

Published : Jan 20, 2023, 5:13 PM IST

Updated : Jan 20, 2023, 7:34 PM IST

google layoffs

ఆర్థిక మాంద్యం భయంతో ప్రముఖ సెర్చింజన్​ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ​ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ప్రకటించారు. స్విగ్గీ కూడా ఇదే బాటలో 380 మంది ఉద్యోగులకు గుడ్​బాయ్ చెప్పింది. దీంతో పాటుగా మాంసం విక్రయాల విభాగాన్ని కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ సెర్చింజిన్ సంస్థ గూగుల్. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఇలా చేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఉద్వాసనకు గురవుతున్న ఉద్యోగులందరికీ ఇప్పటికే మెయిల్స్​ చేసినట్లు.. గూగుల్​ సీఈఓ సుందర్ పిచాయ్​ కంపెనీ వెబ్​సైట్​ ద్వారా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారీగా నియామకాలు చేపట్టినా సరే.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్​, ఆల్ఫాబెట్​లోని పలు విభాగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

'ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపరుచుకోవడం, మూలధనం వృద్ధి వంటి విషయాలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది' అని సుందర్ పిచాయ్ అన్నారు. దీంతో పాటుగా తొలిగించిన ఉద్యోగులను క్షమాపణలు కోరారు. ఈ కఠిన నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

"గూగుల్​ కఠిన నిర్ణయం తీసుకుంది. మేము మా ఉద్యోగుల్లో సుమారుగా 12,000 మందిని తొలగించనున్నాము. రిక్రూటింగ్‌, కార్పొరేట్‌ ఫంక్షన్స్‌, కొన్ని ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్స్‌ బృందాల్లో ఈ ఉద్యోగ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం కంపెనీ పనితీరుపై పడుతుంది. మేము ఇప్పటికే అమెరికాలో తొలగిస్తున్న ఉద్యోగులకు వ్యక్తిగతంగా మెయిల్స్​ పంపించాము. ఇతర దేశాల్లో స్థానిక చట్టాల కారణంగా ఈ తొలగింపుల ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ కఠిన నిర్ణయానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఈ కోతలు ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్యోగులను నేను క్షమాపణలు కోరుతున్నాను" అని అన్నారు సుందర్.

స్విగ్గీలో 380 మంది..
ప్రముఖ పుడ్​ డెలివరీ యాప్ స్విగ్గీ 380 మంది ఉద్యోగులను తొలగించింది. వారికి ఇప్పటికే మొయిల్స్​ కూడా పంపించినట్లు స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి వెల్లడించారు. సంస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు. అలాగే మాంసం విక్రయాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్‌స్టామార్ట్‌ ద్వారా ఆ విక్రయాలు కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు.

కంపెనీ అంచనాలతో పోల్చితే ఫుడ్​ డెలివరీ వృద్ధి రేటు మందగించిందని శ్రీహర్ష తెలిపారు. పంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు అనుసరిస్తున్న విధానాలనే తమ కంపెనీ కూడా అనుసరిస్తుందని, అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. తమ సంస్థ అందుకు మినహాయింపు కాదని ఆయన స్పష్టంచేశారు. తొలగిస్తున్న ఉద్యోగులకు మూడు నెలల జీతంతో పాటు ఇన్సెంటివ్స్​ కూడా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే మైక్రోసాప్ట్ తమ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానమైన దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే అమోజాన్​ కూడా భారీ స్థాయిలో 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా కూడా 11,000 మందిని తొలగించింది.

Last Updated :Jan 20, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.