ఆ ఐపీఓలు మార్కెట్​లోకి ఎప్పుడో..?

author img

By

Published : Mar 14, 2022, 1:15 PM IST

Stock Market New IPO

Stock Market New IPOs: స్టాక్‌ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా తీవ్ర అస్థిరత నెలకొంది. దీంతో వరుస ఐపీఓల హవాకు బ్రేక్‌ పడింది. చాలా కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి మార్కెట్లు కుదురుకుంటే.. సెబీ నుంచి ఆమోదం పొందిన అనేక కంపెనీలు మార్కెట్‌లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లను అమితంగా ఆకట్టుకునే కొన్ని ఐపీఓలేంటో చూద్దాం..!

Stock Market New IPOs: స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా వరుస ఐపీఓలకు బ్రేక్ పడింది. అనేక కంపెనీలు ఇప్పటికే పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమలో మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే కొన్ని ఐపీఓలు ఏంటో చూడండి..

రూ.7,460 కోట్ల డెలివరీ ఐపీఓ

Stock Market New IPO
.

సరఫరా చైన్‌ కంపెనీ డెలివరీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.7,460 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐపీఓలో రూ.5,000 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.2,460 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో కంపెనీ పేర్కొంది. ఓఎఫ్‌ఎస్‌లో కార్లైల్‌ గ్రూప్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌, డెలివరీ సహ వ్యవస్థాపకులు కపిల్‌ భారతి, మోహిత్‌ టాండన్‌, సూరజ్‌ సహరన్‌ తమ వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 22.78 శాతం, కార్లైల్‌కు 7.42 శాతం, చైనా మూమెంటమ్‌ ఫండ్‌కు 1.11 శాతం, కపిల్‌ భారతికి 1.11 శాతం, టాండన్‌కు 1.88 శాతం, సూరజ్‌కు 1.79 శాతం వాటాలున్నాయి. ఈ ఇష్యూకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

ఏపీఐ హోల్డింగ్స్‌ @రూ.6,250 కోట్లు

Stock Market New IPO
.

ప్రముఖ ఆన్‌లైన్‌ ఔషధ డెలివరీ కంపెనీ ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ 'ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌' పబ్లిక్‌ ఇష్యూకి సెబీ గత నెలలోనే ఆమోదం తెలిపింది. దాదాపు రూ.6,250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. మార్చి 2022 నాటికి ఐపీఓకి రావాలని భావించినప్పటికీ.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రూపంలో బ్రేకులు పడ్డాయి. ఫార్మ్‌ఈజీ ఇప్పటి వరకు ఔషధాలు, డయాగ్నోస్టిక్‌ కిట్లు, ఇతర ఆరోగ్య సంరక్షణా కిట్లు కలుపుకొని మొత్తం 15 మిలియన్ల ఆర్డర్లను దాదాపు 5 మిలియన్ల కుటుంబాలకు అందజేసింది. మొత్తం 1000 పట్టణాలకు ఈ సంస్థ సేవలు విస్తరించాయి. థైరోకేర్‌ టెక్నాలజీస్‌లో 611 మిలియన్‌ డాలర్లతో మెజారిటీ వాటాను ఇటీవలే కొనుగోలు చేసింది. ఏపీఐ హోల్డింగ్స్‌ జూన్‌లో 420 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. దీంతో సంస్థ విలువ 4.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. నాస్పర్స్‌, టీపీజీ, టెమాసెక్‌ వంటి కంపెనీలు దీంట్లో పెట్టుబడులు పెట్టాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఈ కంపెనీ వినియోగించుకుంటోంది.

ఎంక్యూర్‌ @రూ.5,000 కోట్లు

Stock Market New IPO
.

ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐపీఓ దరఖాస్తును సెబీ డిసెంబరులోనే ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.4,500- 5,000 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ అనుకుంటోంది. ఇష్యూలో భాగంగా రూ.1,100 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) 1,81,68,356 షేర్లను విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు సతీశ్‌ మెహతా, సునీల్‌ మెహతాతో పాటు ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌ బెయిన్‌ కేపిటల్‌ తమ షేర్లను విక్రయించనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను అప్పుల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలకు ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉపయోగించే అవకాశం ఉంది. పుణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ... క్రిసిల్‌ నివేదిక ప్రకారం దేశంలోని 12వ పెద్ద ఫార్మా కంపెనీ. గైనకాలజీ, రక్త సంబంధిత ఉత్పత్తులు, హెచ్‌ఐవీ యాంటీవైరల్స్‌ విభాగాల్లో ఇది కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

అతిపే..ద్ద ఐపీఓ

Stock Market New IPO
.

దేశీయంగా అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూగా ఎల్‌ఐసీ ఐపీఓ నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో ఉండనుంది. సంస్థలో 100 శాతం వాటా కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో రూ.63,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు చేరతాయని అంచనా. గత ఏడాది వచ్చిన పేటీఎం (రూ.18,300 కోట్లు), 2010లో వచ్చిన కోల్‌ ఇండియా (రూ.15,500 కోట్లు), 2008లో వచ్చిన రిలయన్స్‌ పవర్‌ (రూ.11,700 కోట్లు) పబ్లిక్‌ ఇష్యూలే ఇప్పటి వరకు పెద్ద ఇష్యూలుగా ఉన్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓ తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో నమోదైతే, విలువ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ల సరసన చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఐసీ ఐపీఓ నిర్వహణకు మే 12 వరకు గడువు ఉన్నట్లు ఆదివారమే ఓ అధికారి తెలిపారు. ఒకవేళ ఆ గడువు దాటితే.. మరోసారి తాజాగా సెబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

(గమనిక: ఐపీఓల్లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. మదుపు చేయాలా? వద్దా? అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అంశం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.