Stock market: కొత్త వేరియంట్​ భయాలు- కుప్పకూలిన మార్కెట్లు

author img

By

Published : Nov 26, 2021, 9:19 AM IST

Updated : Nov 26, 2021, 3:40 PM IST

stock market live updates

15:36 November 26

stock market crash today india: దేశీయ స్టాక్​మార్కెట్​లపై బేర్​ పంజా విసిరింది. కరోనా కొత్త వేరియంట్​ దెబ్బకు బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ శుక్రవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1688​ పాయింట్లు కోల్పోయి.. 57,107 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 510పాయింట్లు నష్టపోయి 17,026 వద్ద స్థిరపడింది.

ప్రధాన కారణాలు..

  • మార్కెట్లు ఈ స్థాయిలో పతనవ్వడానికి ముఖ్య కారణం కరోనా కొత్త వేరియంట్​. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్​.. అత్యంత ప్రమాదకరమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకం వైరస్​పై టీకా ప్రభావం కూడా తక్కువేనని తెలుస్తోంది. దీంతో ఆఫ్రికా దేశాలు ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి.
  • ఐరోపా దేశాల్లో ఇప్పటికే వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలతో లాక్​డౌన్​ భయాలు మరింత పెరిగాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు అమ్మకాలవైపే భారీగా మెగ్గుచూపారు.
  • దేశీయంగా లోహ, రియల్టీ, ఆటో, బ్యాంకు రంగ షేర్లు దారుణంగా పతనమయ్యాయి.
  • ఓవైపు డాలర్​ బలపడుతుండటం, మరోవైపు వైరస్​ భయాలు పెరుగుతుండటం వల్ల విదేశీ మదుపరులు భారత స్టాక్​మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా ఓ కారణం. గురువారం రూ. 2,300కోట్ల అమ్మకాలు జరిపారు. మొత్తం మీద గత నాలుగు ట్రేడింగ్​ సెషన్స్​లో రూ. 15,000 కోట్ల షేర్లను అమ్మేశారు.

ఇంట్రాడే సాగిందిలా...

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో.. దేశీయ సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు.

ఉదయం 58,255 వద్ద ప్రారంభమైన బీఎస్​ఈ సెన్సెక్స్(bse sensex today live)​.. ఒక్క పాయింటు కూడా పెరగకుండా కిందకి పడింది. 56,994 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసి చివరికి 57,107 వద్ద స్థిరపడింది.

ఉదయం 17,339 వద్ద ప్రారంభమైన ఎన్​ఎస్​ఈ నిఫ్టీ(nse nifty live today).. 17,355 వద్ద గరిష్ఠాన్ని తాకి, అక్కడి నుంచి క్రమంగా కిందపడింది. 16,985 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి వద్ద 17,026 ముగిసింది.

లాభనష్టాలు..

డా. రెడ్డీస్​, నెస్లే, సిప్లా, దివీస్​ ల్యాబ్​లు లాభాలు గడించాయి.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, మారుతి, టాటాస్టీల్​, టైటాన్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హిందాల్కో, టాటా మోటార్స్​ నష్టాలు చవిచూశాయి.

11:36 November 26

మార్కెట్లు ఢమాల్​..

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఓ దశలో దాదాపు 1500 పాయింట్ల మేర కోల్పోయింది. నిఫ్టీ 400 పాయింట్లు కోల్పోయింది.

ప్రస్తుతం సెన్సెక్స్​ 1100 పాయింట్ల నష్టంతో.. 57 వేల 680 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 335 పాయింట్లు క్షీణించి.. 17 వేల 200 వద్ద ఉంది.

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్​ బయటపడిన నేపథ్యంలో.. స్టాక్​ మార్కెట్లు సూచీలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. 

యూరోపియన్​ యూనియన్​లోని పలు దేశాలు కూడా లాక్​డౌన్​పై దృష్టి పెడుతున్నాయి. ఆ దేశాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటమే కారణం.

ఈ ప్రభావం దేశీయ సూచీలపై కనిపిస్తోంది.

లాభనష్టాల్లో..

మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా ఫార్మా రంగం షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి.

సిప్లా అత్యధికంగా 6 శాతానికిపైగా లాభపడింది. 60 పాయింట్లు పెరిగి 960 ఎగువకు చేరింది.

డా. రెడ్డీస్​ ల్యాబ్స్​, దివీస్​ ల్యాబ్స్​ కూడా లాభాల్లోనే ఉన్నాయి.

టాటా మోటార్స్​, ఓఎన్​జీసీ, హిందాల్కో, బీపీసీఎల్​, మారుతీ సుజుకీ నష్టపోయాయి.

09:06 November 26

stock market live updates

వారాంతపు సెషన్​ను స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ బలహీనతలు, ఆసియా మార్కెట్​లో ప్రతికూల పవనాల నడుమ సెన్సెక్స్​ 843 పాయింట్లు నష్టపోయి 57,951కి పడిపోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 241 కోల్పోయి 17,294 వద్ద ట్రేడ్​ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి(stock market live updates).

Last Updated :Nov 26, 2021, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.