వైవిధ్యమే.. పెట్టుబడులకు శ్రీరామ రక్ష!

author img

By

Published : Aug 31, 2021, 9:00 AM IST

Diversification

ఏడాదిగా స్టాక్ మార్కెట్​లు మంచి లాభాలను అందిస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది మార్కెట్​లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే వారి దగ్గర ఉన్న మొత్తాన్ని ఈక్విటీ వైపు మళ్లించారు. ఇప్పుడు మార్కెట్లలో కరెక్షన్ నమోదవుతుండటం వల్ల.. వారి పోర్ట్​పోలియో తగ్గిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నష్టాన్ని తగ్గించుకోవాలంటే ఎలాంటి సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి? అనే అంశాలపై దృష్టి సారించాలి.

పోర్ట్​పోలియో డైవర్సిఫికేషన్ ద్వారా మార్కెట్​లో ఎదురయ్యే కుదుపులను భరించవచ్చు. దీని ద్వారా పెట్టుబడులతో రిస్కును తగ్గించుకోవచ్చు. ఎక్కువ, తక్కువ రిస్కు ఉన్న షేర్లను పోర్ట్​పోలియోలో ఉంచుకోవటం ద్వారా డైవర్సిఫై చేసుకోవచ్చు. మార్కెట్ హెచ్చు తగ్గులకు స్థిరత్వం ఉన్న పెట్టుబడులు తక్కువగా స్పందిస్తాయి. కొన్ని సార్లు ఎక్కువ రిస్కు ఉన్న వాటికి ప్రతికూలంగా పనిచేస్తాయి.

తరచుగా పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రమశిక్షణతో కూడిన ఫలితాలను గమనిస్తుంటారు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత సంపద సృష్టి భారీగా పెరగవచ్చు. పెట్టుబడులో నగదు, ఈక్విటీ, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు ఉండేలా చూసుకోవాలి. డైవర్సిఫికేషన్​కు సంబంధించిన అనుభవం సంపాదించాక.. అంతర్జాతీయ మార్కెట్లు, స్థిరాస్తి రంగంలోకి కూడా వెళ్లవచ్చు.

డైవర్సిఫికేషన్ ఎందుకు?

మొత్తంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చే కుదుపులు పోర్ట్​పోలియోపై పడకుండా ఉండేందుకు డైవర్సిఫికేషన్​ చేసుకోవాలి. పలు రంగాల్లో, వివిధ రకాల అసెట్​లలో పెట్టుబడులు పెట్టటం ద్వారా భద్రత ఎక్కువగా ఉంటుంది.

పెట్టుబడి మొత్తం ఒకే రంగంలోని షేర్లపై ఎప్పటికీ పెట్టకూడదు. ఉదాహారణకు ఐటీ, బ్యాంకులు ఇలా రెండు రంగాలు ఉంటే.. వాటిలో విడివిడిగా పెట్టాలి. ఏకకాలంలో ఒకే రంగంలో పెట్టుబడి పెట్టటం ద్వారా లాభాలు ఎక్కువగా రావొచ్చు. కానీ నష్టం కూడా అలానే వస్తుందనేది గమనించాలి.

డిస్ట్రిబ్యూషన్

స్టాక్స్, బాండ్లను రెండు రకాలైన ప్రాథమిక అసెట్ క్లాసులుగా పరిగణించవచ్చు. స్టాక్స్​లో రిస్కు శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ మార్కెట్​ను గమనిస్తూ... జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రాబడిని కూడా అందిస్తాయి. బాండ్లలో స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. రాబడి తక్కువగా ఉంటుంది. అందుకే రిస్కును తగ్గించుకునేందుకు రెండింటిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

మనం పెట్టుబడి పెట్టే వాటిని వయసు రిస్క్​తో అంచనా వేసి పెట్టాలి. యువతీయువకులకు ఎక్కువ రిస్కు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి వారు ఈక్విటీలను ఎంచుకోవచ్చు. వంద నుంచి వయస్సును తీసివేయటం ద్వారా వచ్చేది ఈక్విటీలో పెట్టుబడి పెట్టే శాతం. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు వారు 70 శాతం ఈక్విటీలో పెట్టుబడి చేయొచ్చు. మిగతా మొత్తాన్ని బాండ్లలో మదింపు చేయొచ్చు.

నాణ్యత

నాణ్యమైన స్టాక్స్​ను ఎంచుకోవటం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను గడించవచ్చు. సాంకేతిక అంశాల జోలికి పోకుండా నాణ్యత గురించిన కొన్ని అంశాలు తెలుసుకోవచ్చు. స్టాక్ రాబడి చరిత్ర, కార్పొరేట్ గవర్నెన్స్, సీఎస్ఆర్ యాక్టివిటీలు, బ్రాండ్ వ్యాల్యూ తదితరాలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని ఆర్థిక అంశాలు కూడా తెలుసుకోవటం ఉత్తమం.

మనీ మార్కెట్

మనీ మార్కెట్ పెట్టుబడి సాధనాల్లో రిస్కు చాలా తక్కువగా ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, ట్రెజరీ బిల్లులు(టీ-బిల్స్), కమర్షియల్ పేపర్లు.. మనీ మార్కెట్ పెట్టుబడి సాధనాల కిందకు వస్తాయి. ఇందులో టీ-బిల్స్​కు రిస్కు ఉండదు. వీటిని రిజర్వు బ్యాంకు అందిస్తుంది. ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఇవి సురక్షితం. అయితే, ప్రభుత్వ సెక్యూరిటీల్లో రాబడి తక్కువగా ఉంటుంది.

క్యాష్​ ఫ్లో

మ్యూచువల్ ఫండ్లు అత్యంత పాపులర్ పెట్టుబడి సాధనాలు. పెట్టుబడి, ఉపసంహరణ, రాబడి పరంగా మ్యూచువల్ ఫండ్లలో కూడా పలు ఆప్షన్లు ఉన్నాయి. సేవింగ్స్ ప్లాన్​లో పెట్టుబడి చేయటం వల్ల కొన్ని సంవత్సరాల వరకు వాటి ఉపసంహరణకు వీలుండదు. తరచుగా ఆదాయం ఇచ్చే విధంగా ఎస్​డబ్ల్యూపీ(సిస్టమెటిక్ విత్​డ్రా ప్లాన్)ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా నెలవారీగా, త్రైమాసికం వారీగా ఆదాయం పొందవచ్చు. ఎస్​టీపీ(సిస్టమెటిక్ ట్రాన్స్​ఫర్ ప్లాన్) ద్వారా పలు మ్యూచువల్ ఫండ్ల మధ్య పెట్టుబడిని మార్చుకోవచ్చు.

పెట్టుబడి, మార్కెట్​ను ప్రభావితం చేసే అంశాలు

ట్రేడింగ్ బదులు పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించటం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు. దీని ద్వారా ఎక్కువ సంపదను కూడా సృష్టించుకోవచ్చు. నష్టాలను కూడా తగ్గించుకోవచ్చు. తక్కువలో కొనటం ద్వారా సరాసరిని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్​ను ప్రభావితం చేసే ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్బీఐ నిర్ణయాలు, ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి.

సిప్​ను ఎంచుకోండి

ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి చేయటం కంటే అందులో కొంత కొంత తరచుగా పెట్టుబడి పెట్టటం ఉత్తమమని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం సిప్​ అప్షన్​ను ఎంచుకోవచ్చు. ఇది చిన్న తరహా పెట్టుబడిదారులకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కువ, తక్కువలు ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టటం వల్ల సరాసరి తక్కువ అవుతుంది. దీర్ఘకాలంలో ఈ ఆప్షన్ ద్వారా మంచి లాభాలను గడించవచ్చు.

ఇదీ చూడండి: సెప్టెంబర్​ నుంచి మారుతీ కార్లు మరింత ప్రియం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.