'మహారాజా'కు పునర్​వైభవం వచ్చేనా?

author img

By

Published : Oct 20, 2021, 8:59 AM IST

air india tata

ఎయిర్​ ఇండియా.. ప్రభుత్వ గుప్పెట నుంచి మళ్లీ టాటాల గూటికి చేరుతోంది. పుట్టెడు కష్టాలతో పుట్టింటి గడప తొక్కనున్న ఈ సంస్థ ప్రయాణం ఇకపై ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎయిర్​ ఇండియాను సంక్షోభంలో నుంచి సంపన్నస్థితికి టాటాలు తీసుకు రాగలరా.. 'మహారాజా'కు పునర్‌వైభవాన్ని తేగలరా అన్నవే చర్చనీయాంశాలు. ఇప్పటికే రెండు విమానయాన సంస్థల్లో వాటా ఉన్న టాటా గ్రూప్‌నకు ఎయిర్​ ఇండియాను విజయతీరానికి చేర్చడంలో సవాళ్లు ఎదురైనా, సంస్థ వల్ల ప్రయోజనాలూ తథ్యం. 3 విమానయాన సంస్థల యాజమాన్యం కలిగిన టాటా గ్రూప్‌నకు, ఈ రంగ సంస్థలతో బేరమాడే శక్తి కలిసి రానుంది.

హమ్మయ్య!!.. ఎయిర్​ ఇండియా విక్రయ ప్రక్రియ కొలిక్కి వచ్చాక ప్రభుత్వం లోలోన అనుకున్న మాట ఇదేనేమో. రూ.60,000 కోట్లకు పైగా రుణభారం ఉన్న సంస్థను అమ్మేందుకు ప్రభుత్వం 2017 నుంచి పలుమార్లు ప్రయత్నించి, ఇప్పటికి సఫలమైంది. రూ.18,000 కోట్లతో ఎయిర్​ ఇండియాను మళ్లీ టాటా గ్రూపు సొంతం చేసుకుంది. ఈ ఏడాది చివరికల్లా టాటాలకు యాజమాన్య బదిలీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. తదుపరి ఎయిర్​ ఇండియా ప్రయాణం టాటాల నేతృత్వంలో మొదలుకానుంది. ఆ లోగా ఎయిర్​ ఇండియాను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళిక, సమర్థ వ్యూహాలతో టాటా గ్రూపు సిద్ధమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కొవిడ్‌-19 పరిణామాలే తొలి సవాలు

కొవిడ్‌-19 మొదటి, రెండో దశ పరిణామాల ప్రభావం నుంచి విమానయాన రంగం ఇప్పటికీ పూర్తిగా తేరుకోలేదు. కొవిడ్‌ మూడో విడతకు అవకాశాలున్నాయనే హెచ్చరికలు వస్తున్నాయి. బ్రిటన్‌, రష్యా వంటి దేశాల్లో కొవిడ్‌-19 కొత్త కేసులు, మరణ వార్తలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల కొవిడ్‌ పరిణామాల ప్రభావం నుంచి ఎయిర్​ ఇండియాను ఒడ్డుకు చేర్చేందుకే టాటాలకు సమయం పట్టొచ్చని, ఆ తర్వాతే సంస్థలో ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఎయిర్​ ఇండియాకు మేలు జరుగుతుంది కానీ, స్వల్పకాలిక ఉపశమన చర్యలు, ప్రణాళికల అమలుతో ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.

కొత్త విమానాలకు రూ.7500 కోట్లు!

ఒకప్పుడు ఎయిర్​ ఇండియా విమానాలు మహారాజా మస్కట్‌తో ఎంతో సౌకర్యవంతంగా సేవలందించేవి. 2000 మధ్య నుంచి క్రమంగా ఎయిర్​ ఇండియా వైభవం తగ్గుతూ వచ్చింది. అప్పులు, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. సమయపాలన సరిగా లేక ప్రయాణికులకు, జీతాల ఆలస్యంతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరమ్మతుల కోసమే ఆకస్మికంగా విమానాలను నిలిపేసిన రోజులూ ఉన్నాయి. రాకపోకలు సజావుగా సాగేందుకు ఎయిర్​ ఇండియా ప్రస్తుతమున్న విమానాలను నవీకరించాలని, ఇందుకు రూ.7500 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సిబ్బందికి అదనపు శిక్షణతోనే కార్యకలాపాలు-సేవలపరంగా ప్రైవేట్‌ విమానయాన సంస్థలతో ఎయిర్​ ఇండియా పోటీపడగలిగి, విపణిలో మెరుగైన వాటా సాధించే అవకాశం ఉంటుంది.

అనుకూలాంశాలున్నాయ్‌

  • కొవిడ్‌-19 పరిణామాల తర్వాత నాన్‌ స్టాప్‌ సర్వీసులకు డిమాండు పెరగడం ఎయిర్​ ఇండియాకు సానుకూలాంశం. ప్రస్తుతం భారత్‌ నుంచి విదేశీ గమ్యస్థానాలకు నాన్‌స్టాప్‌ సర్వీసుల విషయంలో విదేశీ విమానయాన సంస్థలకు అధిక వాటా ఉంది. ఎయిర్​ ఇండియా వాటా 19.3 శాతమే. తనకున్న స్లాట్లతో సర్వీసులు పెంచుకుని, సేవలను మెరుగుపర్చుకుంటే మార్కెట్‌ వాటా పెంచుకోవచ్చని, లాభార్జనకు దోహదం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.
  • టాటా బ్రాండుపై ఉన్న విశ్వసనీయత, అనుభవజ్ఞులైన నిపుణుల అండదండలతో ఎయిర్​ ఇండియా తిరిగి గాడిలో పడటం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడుతున్నారు.
  • ఆతిథ్య రంగంలో టాటా గ్రూపునకు విశేష అనుభవం ఉంది. తాజ్‌ హోటల్స్‌ బ్రాండుతో టాటాలు రాణిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. ఈ పేరు- ప్రతిష్ఠలు, సిబ్బంది, సేవల నాణ్యత లాంటివి ఎయిర్​ ఇండియాకు అనుకూలించే అంశాలు.
  • విస్తారా, ఎయిరేషియా ఇండియాల్లోనూ టాటా గ్రూపునకు వాటాలున్నందున.. ఆ సంస్థల్లోని భాగస్వాముల అనుభవం కూడా ఎయిర్​ ఇండియాను తిరిగి గాడిలో పెట్టేందుకు టాటాలు వాడుకోవచ్చు.
  • 3 విమానయాన సంస్థలు టాటాల ఆధీనంలో ఉండటం వల్ల.. విమాన తయారీ సంస్థలు, ఇంజిన్ల తయారీదార్లు, విమానాల లీజుదార్లు, విమానాశ్రయాల నిర్వాహకులు, ఇంధన కంపెనీలతో 'బేరమాడే' శక్తి లభించవచ్చు.
  • ఎయిర్​ ఇండియా కోసం నిధులను సమకూర్చుకోవడం, ప్రణాళికలు, వ్యూహాల రూపకల్పన-కార్యాచరణను సమర్థంగా పూర్తి చేయడంలో టాటా గ్రూపు చూపే సమర్థతే కీలకం కానుంది. ఉక్కు దగ్గర నుంచి ఐటీ సేవల వరకు ఎన్నో వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్న టాటా గ్రూప్‌, ఎయిర్​ ఇండియా విషయంలో ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి : పెట్రోల్ ధరలు తగ్గేలా అంతర్జాతీయంగా మోదీ ప్రయత్నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.