షేరు.. షేరు.. మాకెందుకు రాలేదు?

author img

By

Published : Jul 18, 2021, 1:07 PM IST

IPO Shares allotment process

ఐపీఓ.. ఇటీవల అంకుర సంస్థలు ఇందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. జొమాటో ఐపీఓ ఇటీవలే ముగిసింది. పేటీఎం కూడా త్వరలో ఐపీఓకు రానుంది. అనేక చిన్న చిన్న సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరి షేర్ల కొనుగోలుగు బిడ్లు దాఖలు చేసిన అందరికీ.. షేర్లు కేటాయిస్తారా? షేర్లు రాని వాళ్ల డబ్బులు ఏమవుతాయి? ఐపీఓలో వచ్చిన షేర్లను ఎప్పుడు విక్రయించుకోవచ్చు? వంటి అనేక సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేశీయంగా స్టాక్ మార్కెట్లోకి వస్తున్న కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇటీవల పెరిగిన ఐపీఓల సంఖ్యే ఇందుకు ఉదాహరణ.. ఇటీవలే జొమాటో ఐపీఓ ముగిసింది. ఈ ఇష్యూకు 38 రెట్ల అధిక స్పందన లభించింది. ఇటీవల పలు కంపెనీల ఇష్యూల్లో జారీ చేస్తున్న షేర్లకు కొన్ని రెట్లు అధికంగా బిడ్​లు వస్తున్నాయి. అలాంటప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నో కొన్ని షేర్లను ఆయా కంపెనీలు కేటాయిస్తాయా? ఏ ప్రాతిపదికన షేర్లు కేటాయిస్తారు? షేర్లు రాని వాళ్లు ఏం చేయాలి? షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు కట్టిన డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయి? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. వీటి సంగతి ఇప్పుడు చూద్దాం..

స్పందన ఆధారంగానే కేటాయింపు..

ఐపీఓలో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు ఆ ఇష్యూకి వచ్చిన స్పందన ఆధారంగా, సెబీ నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఒక ఇష్యూలో విక్రయానికి పెట్టిన షేర్లకు సమాన స్థాయిలో బిడ్లు లభించాయనుకుందాం. అప్పుడు మదుపర్లు ఎన్ని షేర్లకు బిడ్​లు దాఖలు చేస్తే అన్నింటినీ సదరు కంపెనీ కేటాయిస్తుంది. ఒకవేళ జారీ చేస్తున్న షేర్ల కంటే.. ఎక్కువ మొత్తానికి బిడ్​లు దాఖలైతే కేటాయింపు ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరికి పూర్తిగా షేర్ల కేటాయింపు జరిగితే.. ఇంకొందరికి ఒక్క షేరు కూడా లభించకపోవచ్చు.

నిర్ణయం ఎలా?

పబ్లిష్​ ఇష్యూల్లో జారీ షేర్లను చిన్న చిన్న లాట్​లుగా విభజిస్తారు. షేర్ల సంఖ్యలో కాకుండా లాట్​లలోనే మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లాట్​లో ఎన్ని షేర్లుండాలి? అనే విషయాన్ని కంపెనీ నిర్ణయిస్తుంది. లాట్​లోని షేర్ల కంటే తక్కువ షేర్లకు బిడ్​లు వేయడం కుదరదు. షేర్లను కేటాయించేటప్పుడు కూడా లాట్​లోని షేర్ల కంటే తక్కువగా కంపెనీ కేటాయించకూడదు. షేర్ల కేటాయింపు విషయంలో 'నైష్పత్తిక ప్రాతిపదిక' అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది.

షేర్ల కేటాయింపు ఇలా..

ఉదాహరణకు.. కంప్యూటర్ ఏజ్​ మేనేజ్​మెంట్ సర్వీసెస్​ (క్యామ్స్) ఐపీఓనే చూద్దాం. ఈ ఐపీఓకు 46.99 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా1,28,27,370 షేర్లను జారీ చేయగా.. ఇందులో 63,22,435 షేర్లను చిన్న మదుపర్ల కోసం అట్టే పెట్టారు. అయితే చిన్న మదుపర్లు 3,50,98,056 షేర్లకు బిడ్​లు దాఖలు చేశారు. అంటే వాళ్ల కోసం అట్టే పెట్టిన షేర్ల కంటే 5.55 రెట్లు అధికమన్నమాట. క్యామ్స్ ఐపీఓలో లాట్​కు 12 షేర్లుగా నిర్ణయించారు.

ఒక పబ్లిక్ ఇష్యూలో జారీ చేసిన షేర్ల కంటే ఎక్కువ షేర్లకు బిడ్​లు వస్తే.. చిన్న మదుపర్ల కోసం అట్టే పెట్టిన షేర్లను, కనీస లాట్​ పరిమాణంతో భాగించి ఎన్ని షేర్లను కేటాయించాలో నిర్ణయిస్తారు. ధరల శ్రేణిలోని గరిష్ఠ ధర లేదంటే అంతకుమించిన ధరను దాఖలు చేసిన బిడ్​లను మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారంగా.. క్యామ్స్​లో 63,22,435 షేర్లను (అట్టేపెట్టిన షేర్లు) కనీస లాట్ పరిమాణలోని 12 షేర్లతో భాగిస్తే వచ్చిన 5,26,869 దరఖాస్తులను మాత్రమే షేర్ల కేటాయింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మొత్తం దరఖాస్తులు 21,08,682 వచ్చాయి. దీంతో 4.1 (21,08,682:5,26,869) నిష్పత్తిలో షేర్లను కేటాయిస్తారు. మిగిలిన దరఖాస్తులన్నింటిని తిరస్కరిస్తారు. అంటే లాటరీ ప్రకారంగా.. ఈ ప్రక్రియ జరుగుతుందని అనుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మందికి ఒక్క షేరు కూడా కేటాయింపు జరగదు.

ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా ఐపీఓ ముగిసిన రోజు నుంచి వారం రోజుల్లోగా షేర్ల కేటాయింపు విధానం ఖరారు అవుతుంది. షేర్ల కేటాయింపు అనంతరం ఆ వివరాలు బీఎస్​ఈ లేదా రిజిస్ట్రార్​ వెబ్​సైట్లలో అందుబాటులో ఉంటాయి.

ఎలా తెలుస్తుంది?

కంపెనీ పేరు, పాన్​ లేదా దరఖాస్తు సంఖ్య లేదా డీజీ ఐటీ/క్లయింట్​ ఐటీ వివరాలు పొందుపర్చి సూచిక (క్యాప్చ)లోని అక్షరాలను టైప్ చేసి సబ్మిట్​ చేస్తే మనకు షేర్లు కేటాయించారా లేదా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ షేర్లు కేటాయిస్తే.. దరఖాస్తుదారు పేరు, ఎన్ని షేర్లకు దరఖాస్తు చేశారు. ఎన్ని కేటాయించారు, ధర ఎంత, చెల్లించిన డబ్బులో ఎంత సర్దుబాటు చేశారు అనే వివరాలను చూడవచ్చు. ఒకవేళ షేర్లను కేటాయించకుంటే పై వివరాలు ఖాళీగా కనిపిస్తాయి.

షేర్లను కేటాయించకుంటే..

మదుపర్లకు షేర్లను కేటాయిస్తే.. అప్పుడు దరఖాస్తు సమయంలో చెల్లించిన డబ్బులోంచి ఆ షేర్ల కోసం మినహాయించుకుంటారు. ఒకవేళ షేర్లను కేటాయించకుంటే.. ఆ డబ్బును రిఫండ్​గా ఇస్తారు. ఇప్పుడు దరఖాస్తుదార్ల డబ్బు బ్యాంక్ ఖాతాలో నుంచి తీయడం లేదు. అయితే షేర్ల కేటాయింపు జరిగే వరకు అందుకు కేటాయించిన డబ్బు లాక్​ అయి ఉంటుంది. షేర్లు కేటాయిస్తే.. అందుకు కావాల్సిన మొత్తాన్ని సదరు కంపెనీ ఖాతాకు వెళ్తుంది. లేకపోతే మన ఖాతాలోనే ఉంటుంది కనుక వాడుకోవచ్చు.

ట్రేడింగ్​ ఎప్పుడు చేయాలి?

ఐపీఓ ముగిసిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు డీమ్యాట్​ ఖాతాలోకి షేర్లు జమ అవుతాయి. ఎక్స్ఛేంజీల్లో నమోదైన రోజు నుంచే షేర్లను ట్రేడ్​ చేయొచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.