శారీరక సంబంధానికి నిరాకరించిందని యువతి హత్య.. ముగ్గురు చిన్నారులతో బావిలో దూకిన మహిళ

author img

By

Published : Nov 23, 2022, 10:00 AM IST

young man killed girl

చండీగఢ్​లో దారుణం జరిగింది. తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని ఓ యువకుడు.. యువతిని గొంతుకోసి హత్య చేశాడు. మరోవైపు, ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన హరియాణాలో వెలుగుచూసింది.

చండీగఢ్​లోని బుడేల్​లో​ ఘోరం జరిగింది. 18 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అందుకు బాధితురాలు నిరాకరించడం వల్ల.. ఆమె ఇంట్లోకి చొరబడి గొంతుకోసి చంపేశాడు. నిందితుడు బిహార్​కు చెందిన మహ్మద్ షరీక్​(25)గా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని సెక్టార్- 43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలు, నిందితుడు ఎదురెదురు ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మృతురాలి తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. యువతి తండ్రి.. ఉత్తర్​ప్రదేశ్​లో ఉంటున్నాడు. నవంబర్ 19న యువతి సోదరుడు ఇంటికి వచ్చే చూసేసరికి ఆమె మంచంపై అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాధితురాలు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. నిందితుడు ఓ హోటల్​లో పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా బాలికను తనతో శారీరక సంబంధం పెట్టుకోమని వేధించేవాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.

ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో..
హరియాణా నుహ్​లోని ఖేడాలో ఘోరం జరిగింది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మహిళ అరుపులు విన్న స్థానికులు.. ఆమెను బావిలో నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
దిల్లీలో దారుణం జరిగింది. పాలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి, అమ్మమ్మ ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

బ్లేడ్​తో కోసుకోమని..
ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ప్రేయసి పట్ల ఓ యువకుడు పాశవికంగా ప్రవర్తించాడు. ఓ నర్సింగ్ విద్యార్థి​.. 21 ఏళ్ల గర్ల్​ ఫ్రెండ్​ను వీడియో కాల్ సమయంలో బ్లేడ్​తో చేయి, ఛాతీపై కోసుకోమ్మన్నాడు. ఆ వీడియోను సేవ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితుడు అవేంద్ర సోన్వానీ(25)ను అరెస్ట్ చేశారు.

బాలిక హత్య..
ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​శహర్​లో దారుణం జరిగింది. గాజియాబాద్‌లో ఆదివారం కిడ్నాప్ అయిన 11 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. బులంద్​శహర్​లోని ఓ చెరుకు తోటలో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.