ఏడాదిన్నర చిన్నారిని చంపి తిన్న తోడేలు.. ప్రియుడి కోసం కుమార్తెను హత్య చేసిన తల్లి

author img

By

Published : Jan 19, 2023, 10:00 PM IST

wolf-ate-baby-girl-in-uttarprasesh

ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లి తినేసింది తోడేలు. ఈ విషాదకర ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని.. మూడేళ్ల కూతురిని చంపేసింది ఓ తల్లి. కదులుతున్న రైలులో నుంచి చిన్నారిని బయటకు విసిరేసి హత్య చేసింది. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత విషాదకర ఘటన జరిగింది. ఏడాదిన్నర వయసు ఉన్న చిన్నారిని తోడేలు ఎత్తుకెళ్లింది. అనంతరం పాపను చంపేసి, ఆమె శరీర భాగాలను తినేసింది. దీంతో చిన్నారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ దారుణ ఘటన సుల్తాన్​పుర్​ జిల్లాలో బుధవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే..
బాధితురాలి పేరు ప్రీతి. ఆమె తండ్రి సందీప్​ కుమార్. వీరంతా మహర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులంతా ఆరుబయట పడుకున్నారు. అప్పుడే చిన్నారిని తోడేలు​ ఎత్తుకెళ్లింది. రాత్రి సందీప్​ లేచి చూసేసరికి కూతురు కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ సందీప్​ ఆమెను వెతకడం ప్రారంభించాడు. గ్రామస్థులు కూడా పాపను వెతికేందుకు వెళ్లారు. కొద్దిసేపటికి ఊరు బయట తోడేలు చిన్నారిని తినడాన్ని గమనించారు గ్రామస్థులు. అక్కడికి చేరుకుని తోడేలు​ తరిమేశారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వారు గుర్తించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.

ప్రియుడితో కలిసి మూడేళ్ల కూతురిని చంపిన తల్లి
వివాహేతర సంబంధానికి అడ్డుస్తోందని.. మూడేళ్ల కూతురిని చంపేసింది ఓ తల్లి. కదులుతున్న రైలులో నుంచి చిన్నారిని బయటకు విసిరేసి హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. రాజస్థాన్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీగంగానగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితులను సునీత, సన్నీగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు కలిసి చిన్నారి కిరణను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు. మొదటగా పాపను ఓ గుడ్డలో చుట్టారు. అనంతరం శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్​కు వెళ్లారు. ఉదయం 6.10 గంటలకు రైలు ఎక్కారు.​ చిన్నారి ట్రైన్ నుంచి ఓ కాలువలోకి విసిరేయాలని నిర్ణయించుకున్నారు. ఓ బ్రిడ్జ్ వద్ద పాపను బయటకు విసిరేశారు. కానీ పాప నీటి కాలువలో కాకుండా పట్టాలపై పడింది. అనంతరం పాప చనిపోయింది.

గురువారం ఉదయం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సునీతను ట్రేస్​ చేసి పట్టుకున్నారు. విచారణలో సునీత నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు సునీతకు మొత్తం ఐదుగురు సంతానం. అందులో ఇద్దరు కూతుళ్లు సునీతతో ఉంటున్నారు. ఆమె భర్త వద్ద మిగతా ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. సన్నీతో కలిసి సునీత శాస్త్రి నగర్​లో నివాసం ఉంటోంది.

టీచర్​ను కత్తితో పొడిచి..
దిల్లీలో దారుణ ఘటన జరిగింది. పరీక్ష రాస్తుండగా ఓ 12వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్‌ను కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో జరుగుతున్న 12వ తరగతి ప్రాక్టికల్‌ పరీక్షకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూదేవ్‌ ఇన్విజిలేటర్‌గా వచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి ఆయనతో వాగ్వాదానికి దిగి.. కత్తితో పలుమార్లు టీచర్‌ను పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భూదేవ్‌ను స్కూల్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు కారణమైన ఆ 12వ తరగతి విద్యార్థిని కస్టడీలోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులకు ఈ ఘటనతో సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.