కన్న కొడుకు మంచి మనసు.. తల్లికి రెండో పెళ్లి చేసి.. ఆమె ఒంటరితనాన్ని పోగొట్టి..

author img

By

Published : Jan 24, 2023, 11:20 AM IST

widow remarriage done by son in kolhapur maharastra

తన తల్లి ఒంటరి తనాన్ని చూసి తట్టుకోలేకపోయాడు ఆ వ్యక్తి. కన్న తల్లికి కానుకగా తనకో తోడును ఇవ్వాలనుకున్నాడు. సమాజం అంతా తల్లికి రెండో పెళ్లి చేస్తున్నాడని దూషించినా పట్టించుకోలేదు. తల్లి ఒంటరితనాన్ని తొలగించాలనే ఆలోచనతో ఆమెకు మళ్లీ పెళ్లి చేశాడు. 40 ఏళ్ల తల్లికి రెండో పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నాడు ఓ తనయుడు.

తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయడం చూస్తుంటాం. కానీ కొడుకే తన తల్లికి పెళ్లి చేయడం ఎక్కడా చూసుండం కదా. కానీ మహరాష్ట్రలో ఓ యువకుడు.. కన్నతల్లికి రెండో పెళ్లి చేసి గొప్ప మనసును చాటుకున్నాడు. సమాజంలో భర్తను కోల్పోయిన మహిళ అంటేనే వేరే భావనతో ఉంటారు. పెళ్లిలు, పేరంటాలలో పాలుపంచుకోడానికే ఉండదు. కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్తను పోగొట్టుకుని తల్లి అనుభవించే బాధను అర్థం చేసుకున్నాడు. తనకో తోడునివ్వాలి అనుకున్నాడు ఆ యువకుడు. దాంతో కన్న తల్లికి రెండో పెళ్లి చేశాడు. మరి వారి కథేంటో తెలుసుకుందాం.

అసలు కథ ఏంటంటే
మహారాష్ట్ర కొల్హాపుర్​కు చెందిన యువరాజ్​ షేలే(23) చిన్న వయస్సులోనే తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి ఒంటరిగానే జీవిస్తోంది. నాటి నుంచి షీలేనే కుటుంబ బాధ్యతలు అన్నీ చూస్తున్నాడు. కానీ తన తల్లికి ఒక తోడు అవసరమని గ్రహించాడు. తన తండ్రి మరణంచిన నాటి నుంచి ఆమె ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవిస్తోంది. పొరుగువారితో కూడా ఎలాంటి సంబంధాలు లేకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండటం ఆ యువకుడి మనసును కలిచి వేసింది. ఆమె బాధను తొలగించాలనే ఉద్దేశంతో రెండో పెళ్లి చేయాలనుకున్నాడు.

"మా అమ్మనాన్నలు పెళ్లి చేసుకుని దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. ఒక మగాడు భార్యను కోల్పోతే.. అతడు రెండో పెళ్లి చేసుకోవడం సహజం అని సమాజం ఆలోచిస్తుంది. దానిని సాధారణ విషయంగా జనాలు అనుకుంటారు. అదే మహిళల విషయానికొస్తే ఎందుకని సమాజం అలా ఆలోచించదో అర్థం కాదు. కానీ కన్న తల్లి బాధను ఒక మనిషిగా ఆలోచించగలిగాను. తన జీవితం ఇలా ఒంటరితనంతో ఇంట్లోనే మగ్గిపోవాలి అనుకోలేదు. మళ్లీ పెళ్లి చేసుకోమని అమ్మను ఒప్పించాలని నిర్ణయించుకున్నాను."

--యువరాజ్​ షేలే, కుమారుడు

స్నేహితులు, బంధువుల సహాయంతో తన తల్లికి పెళ్లికొడుకు కోసం వెతకడం ప్రారంభించాడు షీలే. ఈ ప్రయత్నంలోనే అదృష్టవశాత్తు మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైనవాడు అని నిర్ణయించాడు. సమీప బంధువులు, స్నేహితుల ద్వారా అతని వివరాలు అన్నీ తెలుసుకున్నాడు. తల్లితో చర్చించిన అనంతరం పెళ్లికి నిర్ణయించాడు షీలే. 'ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. నా తల్లికి ఒక తోడును చూసే బాధ్యత నేను తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంపై ఎన్నో సంప్రదాయక భావాలున్న మా స్థానిక కొల్హాపుర్ వాసులను, బంధువులను ఒప్పించడం.. అంత సులభమైన పని కాదు' అని షీలే అన్నాడు.

"మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైనది. నా భర్తను నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను మొదట్లో వ్యతిరేకించాను. నేను నా భర్తను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవడానికి అసలు సిద్దంగా లేను. కానీ కొన్ని చర్చల తర్వాత నా గురించి నేను ఒకసారి ఆలోచించుకున్నాను. నా జీవితాంతం ఇలానే ఒంటరిగా మిగిలి పోవాలా అని ఆలోచించి పెళ్లికి ఒప్పుకున్నాను."

--రత్న, షీలే తల్లి

గత సంవత్సరం కొల్హాపుర్​లోని హెర్వాద్ గ్రామంలో భర్తలు చనిపోయిన మహిళలను సామాజిక, సంప్రదాయ కార్యక్రమాల్లోకి అనుమతించకుండా బహిష్కరించడం వంటివి చేశారు. ఈ అంశంపై ఆగ్రహించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.