చిన్నారిపై ఆరేళ్లుగా తండ్రి, బాబాయి రేప్.. భవనం పైనుంచి దూకేసిన బాలిక!

author img

By

Published : Jul 19, 2022, 6:50 PM IST

girl-raped by-father-and-uncle

Father rape daughter: బంగాల్​లో దారుణం జరిగింది. బాలికపై తండ్రి, బాబాయి కలిసి ఆరేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా బయటపడింది. మరోవైపు, అత్యాచారాన్ని తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకేసింది ఓ బాలిక.

Father rape daughter: ఏడున్నర సంవత్సరాల వయసున్న బాలికపై ఆరేళ్లుగా తండ్రి, బాబాయి అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన బంగాల్​లో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టి.. నిందితులను అరెస్ట్ చేశారు. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని డైమండ్ హార్బర్​లో ఈ ఘటన జరిగింది. చిన్నారికి ఒకటిన్నర ఏళ్లు ఉన్నప్పటి నుంచే నిందితులు ఆమెపై అత్యాచారం చేస్తున్నారని బాలిక తల్లి మీడియాకు వెల్లడించారు.

'నేను ఆపేందుకు ప్రయత్నించినప్పుడల్లా నన్ను తీవ్రంగా హింసించారు. నా ముందే పసిబిడ్డపై అత్యాచారం చేశారు. ఈ దుర్మార్గానికి నా మరిది సైతం సహకరించాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఒకరోజు డైమండ్ హార్బర్ మహిళా పోలీస్ స్టేషన్​కు వెళ్లా. కానీ ఫిర్యాదు తీసుకునేందుకు వారు నిరాకరించారు. నాకు ఏం చేయాలో తోచలేదు. పోలీసుల వద్దకు నేను వెళ్లానని నా భర్తకు తెలిస్తే బతకనిచ్చేవాడు కాదు. అందుకే తర్వాత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల దగ్గరకు వెళ్లా. మహిళా సంఘాలను కలిశా. వారి సాయంతో పోలీసులను సంప్రదించా. అప్పుడు అధికారికంగా ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా' అని బాలిక తల్లి చెప్పారు.

పోర్న్ చూడాలని బలవంతం..
బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. తండ్రి, బాబాయి కలిసి చిన్నారిపై దారుణానికి తెగబడ్డారని తెలిపాయి. అశ్లీల దృశ్యాలు చూడాలని చిన్నారిపై ఒత్తిడి చేశారని పేర్కొన్నాయి. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్నట్లు డైమండ్ హార్బర్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు.

గ్యాంగ్​రేప్..
మరోవైపు, ఛత్తీస్​గఢ్ కోర్బా జిల్లాలో 15ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. జులై 4న బాలిక తనకు సోదరుడి వరసయ్యే వ్యక్తితో కలిసి రతఖార్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న సమయంలో నిందితులు ఆమెను అపహరించారు. అనంతరం ఓ అడవిలోకి తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై జులై 12న బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బిలాస్​పుర్​లో తలదాచుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వీరిని గుర్తించి సోమవారం అరెస్ట్ చేశారు.

భవనం పైనుంచి దూకి..
ఒడిశా జాజ్​పుర్​లో ఓ బాలిక అత్యాచారాన్ని తప్పించుకునే క్రమంలో పాఠశాల భవనంపై నుంచి దూకేసింది. ఐదుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపింది. ఆదివారం రాత్రి బాలిక తన సోదరుడితో కలిసి బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇద్దరూ కలిసి కియోంఝర్ నుంచి సుకింద క్రోమైట్ వ్యాలీకి బస్సులో చేరుకున్నారు. క్రోమైట్ వ్యాలీలో దిగిన తర్వాత ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అక్కడే ఉన్న ఐదుగురు వ్యక్తులు.. స్కూల్​లో విశ్రాంతి తీసుకోవచ్చని వారిని మభ్యపెట్టారు. వర్షం ఆగిన తర్వాత ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు.

వారి మాటలు నమ్మి స్కూల్​కు వెళ్లారు. ఐదుగురు దుండగులు ఆదివారం అర్ధరాత్రి తమ దుర్బుద్ధిని బయటపెట్టారు. బాలిక సోదరుడిని తీవ్రంగా కొట్టారు. అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. అనంతరం బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాలిక స్కూల్ భవనం పైకి పారిపోయింది. అక్కడి నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడింది. బాలిక సోదరుడి అరుపులు విన్న స్థానికులు సాయం కోసం వచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.