'బిహారీ కూలీలు మావాళ్లే.. ఇక్కడ సురక్షితంగా ఉంటారు'.. నీతీశ్​కు స్టాలిన్​ ఫోన్​​

author img

By

Published : Mar 4, 2023, 7:24 PM IST

Tamil Nadu CM assures Nitish Kumar

తమిళనాడులో పని చేసేందుకు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని వలస కార్మికులను ఉద్దేశించి అధికారిక ప్రకటన విడుదల చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. రాష్ట్రంలో హిందీ మాట్లాడే వారిపై కొన్నిరోజులుగా దాడులు జరుగుతున్నాయనే నేపథ్యంలో స్టాలిన్‌ వారికి భరోసా కల్పించారు. బిహార్‌ వలస కూలీలు తమిళనాడులో సురక్షితంగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

బిహార్‌ వలస కూలీలు తమిళనాడులో సురక్షితంగా ఉంటారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్ హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత విషయంలో పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కార్మికులకు ఎలాంటి హానీ జరగదని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు ఫోన్‌ ద్వారా భరోసా ఇచ్చినట్లు స్టాలిన్ వివరించారు. తమిళనాడులో పని చేసేందుకు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని వలస కార్మికులను ఉద్దేశించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో.. హిందీ మాట్లాడే వారిపై కొన్నిరోజులుగా దాడులు జరుగుతున్నాయనే వార్తలు.. సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్నాయి. సంజయ్‌ని చంపి రైలు పట్టాలపై పడేశారని వదంతులు వ్యాపించగా వలస కార్మికులంతా తిరుపూర్‌ రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ వారికి భరోసా కల్పించారు.

"బిహార్ ముఖ్యమంత్రి, నా సోదరుడు నీతీశ్​ కుమార్​తో ఫోన్​లో మాట్లాడాను. బిహార్​ కార్మికులందరూ మా కార్మికులే. వారంతా తమిళనాడు అభివృద్ధిలో సహాయం చేస్తున్నారు. వారికి ఎలాంటి ఆపద కలగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఈ వదంతులను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం."

--స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి

తమిళనాడుకు ఉన్నతాధికారుల బృందం
తమిళనాడులో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన బిహార్‌ వలస కూలీ ఘటనలో నీతీశ్‌ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. వలస కూలీలపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపనున్నట్లు నీతీశ్‌ సర్కార్ వెల్లడించింది.

ఇదీ జరిగింది
సంజీవ్​ కుమార్​ అనే కార్మికుడు తిరుపుర్​ జిల్లాలలోని ఓ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మార్చి 2న అర్ధరాత్రి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్​బాడీని ఆస్పత్రికి తరలించారు. అయితే, సంజీవ్​ను చంపేసి.. రైలు పట్టాలపై పడేశారని ఓ వార్త హచ్​చల్​ చేసింది. దీంతో వస్త్ర, దాని అనుబంధ పరిశ్రమల కార్మికులంతా కలిసి తిరుపుర్​ రైల్వే స్టేషన్​ను ముట్టడించారు. సంజీవ్​ కుమార్​ ఫోన్​, వాహనం కనిపించడం లేదని.. అతడిని కచ్చితంగా హత్య చేసి ఉంటారని వారు ఆరోపించారు. దీనికి స్పందించిన పోలీసులు.. పట్టాలు​ దాటుతున్న సమయంలో సంజీవ్​ను అకస్మాత్తుగా రైలు ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. దీంతో అసహనానికి గురైన కార్మికులు.. సంజీవ్ కుమార్ రైల్వే స్టేషన్‌కు వచ్చి వెళ్లినట్లు ఆధారాలు చూపించాలని డిమాండ్​ చేశారు.

పోలీసులు ఏమంటున్నారంటే..
"సంజీవ్​ కుమార్​ ట్రాక్​ దాటుతున్నప్పుడు చనిపోయాడని.. తిరువనంతపురం-చెన్నై రైలును నడుపుతున్న లోకోపైలట్ వాంగ్మూలం ఇచ్చాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకే మేము ఘటనా స్థలానికి చేరుకున్నాం. అప్పటికే సంజీవ్ చనిపోయాడు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.