'దీర్ఘకాలం కలిసుంటే పెళ్లి జరిగినట్లే... వారికీ ఆ హక్కులు ఉంటాయ్'

author img

By

Published : Jun 14, 2022, 7:00 AM IST

Supreme Court on live in ralationship

దీర్ఘకాల సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ కాలం ఓ మహిళ, పురుషుడు కలిసి జీవిస్తే.. వారి మధ్య బంధాన్ని అక్రమ సంబంధంగా చట్టం భావించదని పేర్కొంది.

ఒక మహిళ, పురుషుడు దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందని, దాన్ని అక్రమ సంబంధంగా భావించదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టంచేసింది. అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

ఈ కేసులో ఒక జంట దీర్ఘకాలంగా సహజీవనం చేసింది. వారికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేకపోవడం వల్ల.. వారికి పుట్టిన 'అక్రమ' సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదని కేరళ హైకోర్టు 2009లో తీర్పునిచ్చింది. జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది. "ఒక జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సాగారంటే వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 114 ఈ మేరకు సూచిస్తోంది. వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్పించే వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలి" అని పేర్కొంది. దీనిని ఎవరైనా సవాల్‌ చేయవచ్చని తెలిపింది. అయితే వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత.. ఇలా సవాల్‌ చేసినవారిపైనే ఉంటుందని స్పష్టంచేసింది. ఈ కేసులో తుది డిక్రీ జారీ ప్రక్రియను ట్రయల్‌ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలని దేశంలోని అన్ని కోర్టులను ఆదేశించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.