రద్దు దిశగా మహా అసెంబ్లీ? సంజయ్‌ రౌత్‌ సంచలన ట్వీట్‌

author img

By

Published : Jun 22, 2022, 12:58 PM IST

maharashtra news eknath shinde

Maharashtra news eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. 'అసెంబ్లీ రద్దు' గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. మరోవైపు ఉద్ధవ్​ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విటర్‌ బయో నుంచి 'రాష్ట్ర మంత్రి' అనే పదాన్ని తొలగించారు.

Maharashtra news eknath shinde: మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడీ కూటమికి కాలం చెల్లినట్లే కన్పిస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. 'అసెంబ్లీ రద్దు' గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన ట్వీట్‌ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై సంజయ్‌ రౌత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. "రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. విధాన సభ రద్దు దిశగా సాగుతోంది" అని రౌత్‌ రాసుకొచ్చారు. దీంతో అఘాడీ కూటమి ప్రభుత్వం నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు రౌత్‌ మాట్లాడుతూ.. "అధికారం తాత్కాలికమైనది. ఇప్పుడు మేం అధికారాన్ని కోల్పోయినా.. మళ్లీ తిరిగొస్తాం" అని వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర మంత్రి, ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తన ట్విటర్‌ బయో నుంచి 'రాష్ట్ర మంత్రి' అనే పదాన్ని తొలగించారు. ఇది కూడా అసెంబ్లీ రద్దు ఊహాగానాలను బలపరుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయడమే సరైన నిర్ణయమని శివసేన భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కేబినెట్‌ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

అది శివసేన అంతర్గత వ్యవహారం: శివసేనలో వెలుగుచూసిన లుకలుకలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పవార్ తన నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు సూచించారు. నిన్న కూడా అదే మాట చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ సమస్యను అధిగమించలగరని విశ్వాసం వ్యక్తం చేశారు.

సిద్ధమవుతోన్న భాజపా..: మరోవైపు, రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తోన్న తరుణంలో భాజపా కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముంబయి దాటి వెళ్లొద్దని సూచించింది. ఒకవేళ, అఘాడీ కూటమి దిగిపోతే.. ఏక్‌నాథ్‌ శిందే మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చదవండి: అసోంకు 'మహా' రాజకీయం.. శిందేతో 40 మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ పతనమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.