ఎంఎస్​పీ చట్టం కోసం పార్లమెంటుకు రైతుల ట్రాక్టర్ ర్యాలీ

author img

By

Published : Nov 24, 2021, 2:46 PM IST

Rakesh Tikait

పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నవంబర్ 29న 'ట్రాక్టర్ మార్చ్‌' నిర్వహించనున్నట్లు ఎస్​కేఎం నేత రాకేశ్ టికాయిత్ ప్రకటించారు. పార్లమెంట్‌కు 60 ట్రాక్టర్లతో వెళ్తామని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టం చేయాలనే తమ డిమాండ్‌ను అంగీకరించిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని ఉద్ఘాటించారు.

ఈ నెల 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తమ నిరసనలను(farmers protest delhi) మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్​తో సుమారు 500 మంది రైతులు 60 ట్రాక్టర్లపై దిల్లీకి చేరుకుంటారని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయిత్ ప్రకటించారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు దిల్లీతో పాటు.. వివిధ రాష్ట్రాల్లోని రాజధాని నగరాల్లో ట్రాక్టర్ ర్యాలీలు(tractor march delhi) సహా.. ఇతర నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

"కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధమైన హామీపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిరసన చేపడుతున్నాం. 12 నెలల సుదీర్ఘ పోరాట విజయాన్ని పాక్షికంగానే జరుపుకుంటాం. నవంబర్ 29న 60 ట్రాక్టర్లతో పార్లమెంట్‌కు ట్రాక్టర్ల మార్చ్‌ చేపడతాం. ఇటీవలే రాకపోకలు ప్రారంభించిన దిల్లీ సరిహద్దు రోడ్ల మీదగానే మా ట్రాక్టర్లు వెళ్తాయి. గతంలో అన్నదాతలు రహదారులను దిగ్బంధించారన్న ఆరోపణలొచ్చాయి. అయితే మేం ఏ రోడ్లనూ దిగ్బంధించలేదు. మా ఉద్యమ ఉద్దేశం కూడా అదికాదు. ప్రభుత్వంతో చర్చించడమే మా ఉద్యమం. మేము నేరుగా పార్లమెంట్‌కే వెళ్తాం. అలాగే రైతు నిరసనల్లో మరణించిన 750 మంది కర్షక కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి."

--రాకేశ్ టికాయిత్

ఈ నిరసనలకు(farmers protest latest news) వేల మంది రైతులు తరలి వస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. మిగతా డిమాండ్ల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ప్రవాస భారతీయులు సైతం సంఘీభావ కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు.

ఇదీ చదవండి: Farmers Movement: రైతుల ఉద్యమంలో కీలక నాయకులు వీరే..

"నవంబర్ 26న లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద నిరసన ఉంటుంది. అదే రోజు కెనడాలోని సర్రేలో, నవంబర్ 30న ప్యారిస్‌లో, డిసెంబర్ 4న కాలిఫోర్నియాలో కారు ర్యాలీ, న్యూయార్క్‌లో సిటీ మార్చ్ నిర్వహించనున్నారు. అదేరోజు శాన్ జోస్ గురుద్వారాలో కొవ్వొత్తుల ప్రదర్శన. డిసెంబర్ 5న నెదర్లాండ్స్‌లో, డిసెంబర్ 8న వియన్నాలో పలు కార్యక్రమాలు నిర్వహణ ఉంటుంది."

--రాకేశ్ టికాయిత్

మరోవైపు బుధవారం(నవంబర్ 24) 'సర్ ఛోటూ రామ్ జయంతి'ని(sir chhotu ram jayanti) కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్‌గా గుర్తించినట్లు ఎస్​కేఎం పేర్కొంది. నవంబర్ 25న హైదరాబాద్‌లోనూ "మహా ధర్నా" నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

రానున్న ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? అంటూ ప్రశ్నించగా.. 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయిస్తాం. ప్రస్తుతానికి ప్రభుత్వం పని చేస్తోంది. దానిని చేయనివ్వండి' అని అన్నారు రాకేశ్.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.