తండ్రి స్మారకం వద్ద రాహుల్​ ఘన నివాళులు.. నేటి నుంచే జోడో యాత్ర

author img

By

Published : Sep 7, 2022, 7:39 AM IST

Updated : Sep 7, 2022, 8:27 AM IST

rahul jodo yatra

తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ సందర్శించారు. బుధవారం ఉదయం ప్రత్యేక నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన 'భారత్‌ జోడో యాత్ర' బుధవారం లాంఛనంగా ప్రారంభం కానుంది.

Rahul Gandhi Jodo Yatra: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన 'భారత్‌ జోడో యాత్ర' బుధవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యాత్ర కోసం రాహుల్‌గాంధీ మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు.

తండ్రి స్మారకం వద్ద అంజలి ఘటించిన రాహుల్..
బుధవారం ఉదయం శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని రాహుల్​ సందర్శించారు. తన తండ్రి రాజీవ్​ గాంధీకి ప్రత్యేక నివాళులు అర్పించారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్‌ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.
తండ్రికి అంజలి ఘటించిన రాహుల్​.. అక్కడి నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి చేరుకుంటారు. స్వామి వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాలు, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ స్మారకాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కి అందించి యాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. భారత్‌ జోడో యాత్రను బుధవారం లాంఛనంగా ప్రారంభిస్తారని, రాహుల్‌ నడక మాత్రం గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

తమిళనాడులో 4 రోజులు
రాహుల్‌ గాంధీ పాదయాత్రకు నిత్యం 3 షిఫ్టుల్లో పోలీసు బలగాలు భద్రత కల్పించనున్నాయి. తమిళనాడులో 2,500 మంది పోలీసుల్ని ఈ విధుల్లో నియమించారు. యాత్ర తొలి 4 రోజులు తమిళనాడులో కొనసాగనుంది. 11వ తేదీన కేరళలోకి ప్రవేశిస్తుంది.

నిరాడంబర ఏర్పాట్లు
పాదయాత్ర కొనసాగే ప్రాంతాల్లో హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి స్టార్‌ హోటళ్లు, ఏసీ బస్సుల్లో బస చేసేందుకు రాహుల్‌ నిరాకరించారని సమాచారం. ఆయన విశ్రాంతి తీసుకునేందుకు ప్రాథమిక వసతులతో కంటైనర్లను ఏర్పాటు చేసినట్లు నేతలు వివరించారు.

వెంట 117 మంది..
యాత్రలో రాహుల్‌గాంధీ వెంట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 117 మంది కాంగ్రెస్‌ నేతలు నడక సాగించనున్నారు. వీరిని భారత్‌ యాత్రీస్‌ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటుండగా.. తెలంగాణ నుంచి ఆరుగురు వచ్చారు. కేతూరి వెంకటేష్‌, సంతోష్‌.కె, వెంకటరెడ్డి, కత్తి కార్తీకగౌడ్‌, బెల్లయ్యనాయక్‌ తెలావ్‌, అనులేఖ బూస వీరిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది మహిళలకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం తర్వాత యాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాహుల్‌ వెళ్లని రాష్ట్రాల్లో ఈ యాత్రకు అనుబంధంగా ‘అతిథి యాత్రీస్‌’ పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు.

  • రోజుకు సగటున 25 కి.మీ.దూరం
  • భారత్‌ జోడో యాత్ర అయిదు నెలల పాటు 3,570 కి.మీ. కొనసాగనుంది.
  • 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా వెళ్తుంది.
  • ప్రతిరోజూ రెండు విడతల్లో... ఉదయం 7 గంటల నుంచి 10.30 గం.ల వరకు, మధ్యాహ్నం 3.30గం.ల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర ఉంటుంది.
  • రోజుకు సగటున 25 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.

ఇవీ చదవండి: నియంత్రణ రేఖ వద్ద 250 మంది ఉగ్రవాదులు.. భారత్​లో చొరబాటుకు యత్నం!

సినిమా రేంజ్​లో ప్రయాణికుడ్ని కాపాడిన రైల్వే పోలీస్​.. వీడియో వైరల్​

Last Updated :Sep 7, 2022, 8:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.