భారత నేవీలోకి స్వదేశీ యుద్ధనౌక 'విక్రాంత్'.. జాతికి అంకితమిచ్చిన మోదీ

author img

By

Published : Sep 2, 2022, 10:52 AM IST

Updated : Sep 2, 2022, 12:35 PM IST

modi commissioned ins vikranth

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్​ను ప్రధాని మోదీ.. జాతికి అంకితమిచ్చారు. 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక.. మోదీ చేతులు మీదుగా భారత నేవీలో లాంఛనంగా చేరింది. భారత్‌ కృషి, పరిశ్రమ, ప్రతిభకు నిలువుటద్దం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ అని ప్రధాని అన్నారు. ఛత్రపతి శివాజీకి ఈ యుద్ధనౌకను అంకితమిస్తున్నట్లు తెలిపారు.

భారత నేవీలోకి స్వదేశీ యుద్ధనౌక 'విక్రాంత్'.. జాతికి అంకితమిచ్చిన మోదీ

INS Vikrant Modi : స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యాధునిక యుద్దనౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భారత అమ్ముల పొదిలోకి చేరింది. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన.. ఐఎన్​ఎస్​-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానుంది. కేరళలోని కొచ్చి​ షిప్​యార్డ్​లో ఈ యుద్దనౌకను మోదీ.. జాతికి అంకితమిచ్చారు.

modi commissioned ins vikrant
ఐఎన్​ఎస్​ విక్రాంత్​ వద్ద ప్రధాని మోదీ, నేవీ అధికారులు

ఐఎన్ఎస్‌ విక్రాంత్‌ను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలన్నారు ప్రధాని మోదీ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధ నౌక ద్వారా భారత్‌.. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచిందని ఆయన కొనియాడారు. భారత్‌ కృషి, పరిశ్రమ, ప్రతిభకు నిలువుటద్దం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ అని ప్రధాని అన్నారు.

"నౌక నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము స్వదేశంలోనే తయారైంది. ఎర్రకోట వేదికగా ఇచ్చిన పంచ ప్రాణాల నినాదం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో మిళితమై ఉంది. ఛత్రపతి శివాజీ.. నౌకాదళ ఏర్పాటుతో శత్రువులకు నిద్ర లేకుండా చేశారు. అందుకే ఐఎన్​ఎస్ విక్రాంత్​ను ఛత్రపతి శివాజీకి అంకితమిస్తున్నాను. ఐఎన్​ఎస్​ విక్రాంత్ ఒక తేలియాడే ఎయిర్‌ఫీల్డ్. దానిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 5,000 ఇళ్లలో వెలుగులు నింపగలదు."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

నేవీ కొత్త జెండా ఆవిష్కరించిన మోదీ..
ఐఎన్​ఎస్​ విక్రాంత్​ జాతికి అంకితమిచ్చే కార్యక్రమంలో ప్రధాని మోదీ.. భార‌త‌ నావికాదళ కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్త జెండాకు మోదీ అభివాదం చేశారు. సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి కొత్త జెండా తగినట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గుర్తుతో మన దేశం బానిసత్వ గతాన్ని చెరిపేసుకుంటుందని అన్నారు. ఇండియన్ నేవీ ఫ్లాగ్ మార్చడం ఇదే మొదటి సారి కాదు. 1950 నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు మార్చారు. ఇది నాలుగో సారి.

modi commissioned ins vikrant
నేవీ కొత్త గుర్తు
modi commissioned ins vikrant
నేవీ కొత్త జెండాకు అభివాదం చేస్తున్న మోదీ

ఐఎన్​ఎస్​ విక్రాంత్​ ప్రత్యేకతలు..

  • 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక, గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
  • విక్రాంత్‌ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు.
  • ఈ యుద్ధనౌకలో1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
  • గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు.
  • రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌మెషీన్ ఉన్నాయి.
  • ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు.
  • విక్రాంత్‌ లోపల దాదాపు 2,300 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు.
    modi commissioned ins vikrant
    ఐఎన్​ఎస్​ విక్రాంత్​
  • లోపల ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు.
  • వాతావరణ పరిస్థితులకు నౌకలోని సిబ్బంది గురికాకుండా ఉండేందుకు ఎయిర్‌కండీషనింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • విక్రాంత్​ తయారీ కోసం సెయిల్‌ ఉద్యోగులు 2వేల మంది పని చేయగా, మరో 13వేల మంది బయట శ్రమించారు.
  • హైదరాబాద్‌ సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి.
  • 76శాతం భారతీయ సాంకేతికతనే ఈ యుద్ధ నౌక తయారీకి వినియోగించారు.
  • విక్రాంత్‌ తయారీకి మొత్తం 20వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది.

ఇవీ చదవండి: టీ పొడికి 'గోల్డ్'​ టచ్.. కిలో ధర రూ.2.5 లక్షలు

భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!

Last Updated :Sep 2, 2022, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.