'ద్రవ్యోల్బణం కట్టడి చేస్తున్నాం.. ఆర్థిక సంక్షోభం మాటే లేదు'

author img

By

Published : Aug 1, 2022, 8:03 PM IST

Updated : Aug 1, 2022, 9:57 PM IST

parliament price rise

దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రశ్నే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ధరల పెరుగుదలపై మాట్లాడిన మంత్రి... ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలోనే ఉన్నామని చెప్పారు.

భారత్.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై లోక్​సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశమే లేదన్నారు. వృద్ధి నెమ్మదించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 7శాతం కన్నా తక్కువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు నిర్మల. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.

"ప్రపంచ సంస్థల నివేదికల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ఒకటి. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశ జీడీపీ-అప్పుల నిష్పత్తి సైతం చాలా దేశాలకంటే తక్కువగా ఉంది. జులైలో 1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇది రెండో అత్యధికం. మహమ్మారి, రెండోవేవ్, ఒమిక్రాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో లాక్​డౌన్.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణాన్ని ఏడు శాతానికి దిగువనే ఉంచగలిగాం. దీన్ని గుర్తించాలి. కరోనా లాంటి మహమ్మారిని ఇదివరకు ఎన్నడూ మనం చూసింది లేదు. కరోనా సమయంలో ప్రజల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ఎంపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాయి. లేదంటే, ప్రపంచదేశాలతో పోలిస్తే మనం మెరుగైన స్థితిలో ఉండేవాళ్లం కాదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలవగలిగాం. ఈ ఘనత దేశప్రజలదే."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

కాగా, నిర్మల ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ ఎంపీలు లోక్​సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు.. ద్రవ్యోల్బణంపై లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ధరల పెరుగుదలపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దేశంలోని 25 కోట్ల కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని... ధనవంతులు, పేదల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. గత 14 నెలలుగా ద్రవ్యోల్బణం రెండంకెలుగా నమోదవుతోందని తివారీ పేర్కొన్నారు. 30ఏళ్లలో ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయికి చేరిందని విమర్శించారు. నిత్యావసరాలైన బియ్యం, పెరుగు, పన్నీర్‌లపై కేంద్రం జీఎస్‌టీని పెంచిందని విమర్శించారు.భాజపా నేతృత్వంలోని కేంద్రం చిన్నారులను సైతం వదిలిపెట్టడం లేదన్న మనీశ్ తివారీ... వారు ఉపయోగించే పెన్సిల్‌, షార్ప్‌నర్లపై సైతం వస్తుసేవల పన్ను పెంచారని ధ్వజమెత్తారు.

అయితే, విపక్షాల విమర్శలను భాజపా తోసిపుచ్చింది. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, సింగపూర్ లలో ఎక్కడ చూసినా ద్రవ్యోల్బణం పెరిగిందని భాజపా ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఆయా దేశాలలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు సైతం కోల్పోతున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు రెండుపూటల ఉచితంగా భోజనం అందిస్తున్న ప్రధానికి కనీసం కృతజ్ఞతలు తెలపాలి కదా అని భాజపా ఎంపీ దూబే ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

Last Updated :Aug 1, 2022, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.