జీఎస్టీ బాదుడుపై విపక్షాల నిరసన.. ఉభయ సభలు వాయిదా

author img

By

Published : Jul 20, 2022, 11:13 AM IST

Updated : Jul 20, 2022, 4:15 PM IST

PARLIAMENT MONSOON SESSION LIVE UPDATES

16:12 July 20

గురువారానికి వాయిదా
లోక్​సభ గురువారానికి వాయిదా పడింది. ధరల పెరుగుదల, రోజువారీ వస్తువులపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తుండటం వల్ల సభాకార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఉదయం భేటీ అయిన నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడగా.. ఆ తర్వాత సమావేశమైనప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కార్యకలాపాలు సజావుగా జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల.. సభను గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

14:40 July 20

లోక్​సభ వాయిదా

ధరల పెరుగుదల, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఫలితంగా లోక్​సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది.

14:11 July 20

రాజ్యసభ గురువారానికి వాయిదా

మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైనా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ధరల మోతపై విపక్షాలు నిరసనలు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఎగువసభ గురువారానికి వాయిదా పడింది.

11:11 July 20

ద్రవ్యోల్బణంపై విపక్షాల నిరసన.. ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్​లో విపక్షాల నిరసనలు కొనసాగాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్ బయట సైతం నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రాజ్యసభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. లోక్​సభలోనూ నిరసనలు హోరెత్తడం వల్ల.. సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

సభను వాయిదా వేసే ముందు.. ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహించేది చర్చల కోసమేకానీ, నినాదాల కోసం కాదని హితవు పలికారు. 'ప్రజలు సభల నుంచి చర్చలు ఆశిస్తున్నారన్నారు. సభ్యులు గొడవ చేస్తూ సభ పరువు తీస్తున్నారు. రచ్చ చేస్తున్న సభ్యుల తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు భంగం కలిగిస్తోంది. అంశాల వారీ చర్చల కోసం నిబంధనల ప్రకారం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. జీరో అవర్‌లో ఏదైనా అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సభలో ఆందోళన చేయడానికి, అలజడి సృష్టించడాన్ని అనుమతించను. సభ్యులు సీటులోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఇస్తా' అని స్పీకర్ పేర్కొన్నారు. అయితే, సభ్యులు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభ వాయిదా వేయక తప్పలేదు.

మరోవైపు, పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ముందు బ్యానర్లు ప్రదర్శిస్తూ బైఠాయించారు.

Last Updated :Jul 20, 2022, 4:15 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.