దేశ రాజకీయాల్లో 'టెక్​ ఫాగ్'​ కలకలం- భాజపాపై విపక్షాల నిప్పులు

author img

By

Published : Jan 11, 2022, 7:46 AM IST

tek-fog-app

Tek Fog app: భాజపాకు చెందిన టెక్​ ఫాగ్​ యాప్​పై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. దీని ద్వారా కమలం పార్టీ సామాజిక మాధ్యమాలను హైజాక్​ చేస్తోందని ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఉటంకిస్తూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దేశ భద్రతకు ఈ యాప్ పెను ముప్పు అని ఆరోపిస్తున్నాయి.

Tek Fog app: దేశ రాజకీయాల్లో మళ్లీ గూఢచర్యం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 'టెక్‌ ఫాగ్‌' అనే యాప్‌ సాయంతో భాజపా ఐటీ విభాగం సామాజిక మాధ్యమాలను హైజాక్‌ చేస్తోందని.. సొంత ఎజెండాను విస్తృతంగా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్‌ సహా కొన్ని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. పౌరుల గోప్యతకు ఈ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ది వైర్‌' వార్తాసంస్థ అసలేంటీ యాప్‌? దాని ఉపయోగించుకొని ఏం చేయొచ్చు? అనే వివరాలతో ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..

ఎలా ప్రవేశిస్తుంది?

‘టెక్‌ ఫాగ్‌’ ఓ ప్రైవేటు యాప్‌. అత్యాధునిక సాంకేతికతల సాయంతో దాన్ని రూపొందించారు. భాజపా ఐటీ విభాగానికి చెందిన అసంతృప్త ఉద్యోగిగా తనను తాను పేర్కొన్న ఓ వ్యక్తి.. 2020 ఏప్రిల్‌లోనే ఈ రహస్య యాప్‌ ఉనికిని ట్విటర్‌ వేదికగా బయటపెట్టారు. తొలుత మీడియా ఫైల్‌ రూపంలో ఓ స్పైవేర్‌ను యాప్‌ నిర్వాహకులు గుట్టుగా పంపిస్తారు. దానిద్వారా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటారు.

దీని చేతుల్లోనే ‘ట్రెండింగ్‌’

ట్విటర్‌లో ‘ట్రెండింగ్‌’ సెక్షన్‌ను, ఫేస్‌బుక్‌లో ‘ట్రెండ్‌’ విభాగాన్ని ఈ యాప్‌ ప్రభావితం చేస్తుంది. ఆయా వ్యక్తులు/బృందాలు చేసే ట్వీట్లను ‘ఆటో రీట్వీట్‌’, ‘ఆటో షేర్‌’ ఐచ్ఛికాల ద్వారా ఈ యాప్‌ నిర్వాహకులు వేగంగా రీట్వీట్‌ చేయొచ్చు. షేర్‌ చేయొచ్చు. తమ భావజాలాన్ని వాస్తవ తీరు కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందించొచ్చు. ఫలితంగా ఏది నిజమో, ఏది కల్పితమో తెలుసుకోవడం ప్రజలకు కష్టమవుతుంది.

క్రియారహిత వాట్సప్‌ ఖాతాలతో..

ఒక ఫోన్‌ ‘టెక్‌ ఫాగ్‌’ బారిన పడితే.. అందులోని వ్యక్తిగత సమాచారం, ఫోన్‌ నంబర్లు యాప్‌ నిర్వాహకుల చేతికి చిక్కినట్లే. ఆ ఫోన్‌ కాంటాక్ట్స్‌ జాబితాలోని నంబర్లలో ప్రధానంగా.. క్రియారహితంగా ఉన్న వాట్సప్‌ ఖాతాలను వారు హైజాక్‌ చేస్తారు. ఆ ఖాతాల నుంచి సందేశాలను వ్యాప్తి చెందిస్తారు.

శరీర కొలతలూ..!

ఈ యాప్‌కు విస్తృత క్లౌడ్‌ డేటాబేస్‌ ఉంది. అనేక మంది ప్రైవేటు వ్యక్తుల ఉద్యోగం/వృత్తి, మతం, మాతృభాష, వయసు, లింగం, రాజకీయ అభిప్రాయాల వంటి సమాచారమంతా విభాగాల వారీగా అందులో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వ్యక్తుల రంగు, శరీర కొలతల వివరాలూ ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఆయా గ్రూపులను నిర్వాహకులు లక్ష్యంగా చేసుకుంటారు. వేధింపులకు గురిచేస్తారు. కొంతమంది మహిళా విలేకరులను ఇలానే వేధించినట్లు తెలుస్తోంది.

దేశ భద్రతకు ముప్పు: ఓబ్రియెన్‌

'టెక్‌ ఫాగ్‌'తో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ పేర్కొన్నారు. వ్యక్తుల గోప్యత హక్కును అది హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాప్‌ విషయంపై చర్చించేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం (హోం వ్యవహారాలు) వెంటనే భేటీ కావాలంటూ దాని ఛైర్మన్‌ ఆనంద్‌ శర్మ (కాంగ్రెస్‌)కు ఓబ్రియెన్‌ తాజాగా రెండోసారి లేఖ రాశారు.

ఇదీ చదవండి: విదేశీ పర్యటన ముగించుకున్న రాహుల్​- ఎన్నికల వ్యూహంపై కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.