కేరళలో నోరో వైరస్ కలకలం.. ఇద్దరికి పాజిటివ్.. స్కూల్ బంద్.. విద్యార్థుల పేరెంట్స్​కు టెస్టులు

author img

By

Published : Jan 23, 2023, 7:03 PM IST

Norovirus cases surface in Keralas Ernakulum

భారత్​లో నోరో వైరస్ మరోసారి కలకలం రేపింది. కేరళలోని ఇద్దరు విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. 62 రెండు మంది నమూనాలను ల్యాబ్​కు పంపించగా ఇద్దరి సాంపిళ్లలో వైరస్​ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులను పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.

భారత్​లో మరోసారి నోరో వైరస్ కలకలం సృష్టించింది. కేరళ ఎర్నాకులం జిల్లాలోని కక్కానాడ్​లో ఇద్దరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకింది. దీంతో వైరస్​ వ్యాపించకుండా మూడురోజుల పాటు పాఠశాలను మూసివేశారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా వైరస్​ సోకి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ పాఠశాలలో చదువుతున్న 62 మంది విద్యార్థులకు వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపించాయి. నోరో వైరస్​ అన్న అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్​కు పంపించంగా అందులో ఇద్దరికి పాజిటివ్​ నిర్ధరణ అయింది. వ్యాధి సోకిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని వైద్య వర్గాల సమాచారం. పాఠశాల విద్యార్థులందరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

అసలు ఈ నోరోవైరస్‌ ఏంటి..?:
నోరో వైరస్‌ను స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణముంది. ఇది అన్ని వయస్సుల వారికి సోకుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాల కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది.

లక్షణాలు:
నోరో వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మూడు రోజుల వరకు ఉంటాయి. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. వైరస్ బారినపడిన వ్యక్తుల మలం, వాంతిలో దీని ఆనవాలు కనిపిస్తుంది. కలుషిత ఆహారం, నీరు, ఉపరితలాల ద్వారా ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరో వైరస్ బారినపడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం కూడా దీని వ్యాప్తికి దోహదం చేస్తుంది. మలం నుంచి సేకరించిన నమూనాల పరీక్షించడం ద్వారా ఈ వైరస్‌ను నిర్ధరిస్తారు.

నోరో వైరస్ సోకితే ఏం చేయాలి..?
ఈ వైరస్​ సోకితే వైద్యుల సలహాతో పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. కాచివడపోసిన నీరు, ఓఆర్​ఎస్​ మిశ్రమాన్ని వీలైనంత ఎక్కువగా తాగాలి. అయినా తగ్గకపోతే ఆస్పత్రికి తరలించాలి. లక్షణాలు బయటపడిన తర్వాత ఈ వైరస్​ ఇంక్యుబేషన్​ పీరియడ్​ రెండు రోజులు. కావున లక్షణాలు ఉంటే మిగతా వారితో కాంటాక్ట్​ తగ్గించాలి.

నోరో వైరస్ బాధితులు చాలామంది ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ, మలంలో దాని ఆనవాళ్లు కొన్నివారాలు పాటు ఉంటాయన్నారు. ఇక, పలు రకాలైన నోరోవైరస్‌లు ఉండటంతో వాటి కారణంగా పలుమార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థ సిద్ధమవుతుంది. అయితే ఆ శక్తి ఎంతకాలం ఉంటుందో మాత్రం తెలియాల్సి ఉంది.

నివారణ ఇదే..

  • పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ పర్సనల్​ హైజీన్​ పాటించాలి.

• సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.

• కూరగాయలు, పండ్లను కడిగిన తర్వాతే వాడాలి. కేవలం కాచిన నీటినే తాగాలి.

• లక్షణాలు గుర్తించిన వెంటనే ఇంటికే పరిమితం కావాలి. అలాగే లక్షణాలు తగ్గిన మరో రెండు రోజుల వరకు ఇంట్లోనే ఉండాలి.

• ఆ కొద్ది రోజులు వంటకు దూరంగా ఉండాలి.

ఈ వైరస్‌ ఏడాదిలో ఎప్పుడైనా సోకే అవకాశం ఉన్నప్పటికీ.. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు రెండు మూడు రోజుల వరకు ఉంటుంది. ఈ వైరస్​ సోకివాళ్లకు శక్తి బాగా క్షీణిస్తుంది. దీని నుంచి బయట పడాలంటే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ వైరస్​ టీకాలు అందుబాటులో లేవు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.