19ఏళ్ల మోడల్​పై దారుణం.. కారులో నగరమంతా తిప్పుతూ గ్యాంగ్​రేప్

author img

By

Published : Nov 19, 2022, 12:33 PM IST

Model gang raped

కేరళలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మోడల్​పై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. అనంతరం ఆమెను ఇంటిదగ్గర దింపేసి వెళ్లిపోయారు. మరోవైపు, భూతవైద్యం చేస్తానని నమ్మించి.. ఆరు నెలలుగా మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఓ వ్యక్తి. తన తల్లిపై జరుగుతున్న దారుణాన్ని ప్రశ్నించిన బాధితురాలి కుమారుడిని ఫ్యాన్​కు ఉరివేసి హతమార్చాడు.

కేరళ కొచ్చిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న 19 ఏళ్ల మోడల్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. అనంతరం బాధితురాలిని కారులో తీసుకెళ్లి కక్కనాడ్​లోని ఆమె ఇంటివద్ద విడిచిపెట్టేశారు. ఈ ఘటనపై బాధితురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ఓ మహిళ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం రాత్రి బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి కొచ్చిలోని ఓ బార్‌కి వెళ్లింది. మద్యం తాగిన ఆమె.. స్పృహ తప్పిపడిపోయింది. యువతిని ఆమె ఇంట్లో దింపుతామని చెప్పి.. ముగ్గురు యువకులు కారులో తీసుకెళ్లారు. అనంతరం ఆమెను నగరంలో తిప్పుతూ కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు.. బాధితురాలి స్నేహితురాలిని ప్రశ్నించారు. ముగ్గురు నిందితులు కొడంగలూరుకు చెందినవారని ఆమె చెప్పింది. దీంతో వారిని అరెస్టు చేశారు.

భూతవైద్యం చేస్తానని నమ్మించి..
ఉత్తర్​ప్రదేశ్​ గోండాలో దారుణం జరిగింది. భూతవైద్యం చేస్తానని నమ్మించి ఓ వ్యక్తి మహిళపై ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమె కుమార్తెను సైతం లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం బాధితురాలి 16 ఏళ్ల కుమారుడికి తెలిసింది. దీంతో నిందితుడు మౌలానా జైనుల్​ అబ్దిన్​తో బాలుడు గొడవపడ్డాడు. ఈ క్రమంలో నిందితుడు.. బాలుడిని ఇంట్లోకి లాక్కెళ్లి సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

ప్రియుడితో కలిసి దారుణం..
మహారాష్ట్ర చంద్రపుర్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. 50 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి 65 ఏళ్ల భర్తను హత్య చేసింది. బాధితుడిది సహజ మరణమని అందరూ భావించారు. అయితే నిందితురాలి కాల్ రికార్డింగ్​ వల్ల అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల కిందట జరిగిన ఈ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు.

సూట్​కేసులో యువతి మృతదేహం..
ఉత్తర్​ప్రదేశ్​ మథురలో ఘోరం జరిగింది. రాయ పోలీస్ స్టేషన్​ పరిధిలో సూట్‌కేస్‌లో 22 ఏళ్ల యువతి మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని.. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. బాలిక మృతదేహంపై బుల్లెట్ తగిలిన​ గాయాలు ఉండడం వల్ల.. తుపాకీతో కాల్చి యువతిని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

అబార్షన్ వికటించి..
గుజరాత్ సూరత్​లో 17 ఏళ్ల మైనర్​కు అబార్షన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్ధాని శ్రీజీ ఆసుపత్రిలో ఈ అబార్షన్ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం మైనర్​ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే కాసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన బాధితురాలు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు.. ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యులు, బాధితురాలికి గర్భం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.