బైక్​పై వచ్చి మహిళపై కాల్పులు.. మతాంతర వివాహమే కారణం!

author img

By

Published : Nov 23, 2022, 10:22 PM IST

miscreants-shot-a-married-woman

రాజస్థాన్​లో ఓ దారుణమైన ఘటన జరిగింది. ఓ వివాహితపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మతాంతర వివాహం చేసుకోవడమే ఈ దాడికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రాజస్థాన్​లో ఓ వివాహితపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆమెపై వెనుకనుంచి కాల్పులు జరిపారు. ఈ దారుణం వెనుక ఆమె అత్తమామలు, మరికొందరి కుట్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను మరో మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందునే ఈ దాడి జరిగిందని బాధితురాలు పోలీసులుకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్​ జైపుర్​లోని మురళీపుర్​ ప్రాంతంలో అంజలి అనే 26 ఏళ్ల వివాహితపై.. బుధవారం ఉదయం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అంజలి 2021లో వేరే మతానికి చెందిన అబ్దుల్​ లతీఫ్​ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. లతీఫ్​ కుటుంబ సభ్యులకు ఆ వివాహం ఇష్టం లేదు. దీంతో లతీఫ్​ భట్టబస్తీలోని తన కుటుంబాన్ని విడిచిపెట్టి.. అంజలితో పాటుగా మురళీపుర్ ప్రాంతంలో జీవిస్తున్నాడు. దీంతో అబ్దుల్ లతీఫ్ కుటుంబ సభ్యులు అంజలిపై కోపాన్ని పెంచుకున్నారు.

ఎప్పటిలానే బుధవారం ఉదయం కూడా.. అంజలి తాను పనిచేస్తున్న మందుల షాప్​కు కాలినడకన బయలుదేరింది. ఉదయం 10 గంటల సమయంలో అంజలి షాప్​కు వెళ్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుకనుంచి స్కూటీపై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. వెంటనే గాయపడిన అంజలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే బుల్లెట్ శరీర వెనక భాగంలో తగలడం వల్ల.. భవిష్యత్​లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు రావచ్చని వైద్యులు తెలిపారు.

ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనపై దాడి చేసింది రియాజ్ ఖాన్, మజీద్ ఖాన్ అనే ఇద్దరు యువకులు అని ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన అన్నయ్య అబ్దుల్​ అజీజ్​ దుకాణంలో రియాజ్​ ఖాన్ కొంతకాలం పనిచేసి.. 7 నెలల క్రితం అక్కడ నుంచి వేరే దుకాణానికి వెళ్లిపోయాడని లతీఫ్​ తెలిపాడు. అలాగే రియాజ్ ఖాన్ పలుమార్లు తన భార్యకి ఫోన్ చేసి వెన్నెముకను కాల్చివేస్తానని బెదిరించేవాడని ఆరోపించాడు. దీంతో ఈ కాల్పుల వెనుక అజీజ్​ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.