త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణ స్వీకారం

author img

By

Published : May 15, 2022, 11:44 AM IST

Updated : May 16, 2022, 12:44 PM IST

Manik Saha takes oath as Tripura CM

త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మాణిక్​ సాహా. ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిప్లవ్​ కుమార్​ దేవ్​ శనివారం అనూహ్యంగా రాజీనామా చేసిన క్రమంలో మాణిక్​ సాహాను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు నేతలు.

త్రిపుర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్​ సాహా. అగర్తలలోని రాజ్​భవన్​లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్ర గవర్నర్​ సత్యదేవ్​ నరేన్​ ఆర్య ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా నిలిచారు సాహా.

రాజ్యసభ సభ్యుడైన మాణిక్​ సాహా.. ప్రస్తుతం భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిప్లవ్​ కుమార్​ దేవ్​ శనివారం రాజీనామా చేశారు. సీఎం అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సాహాను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వృత్తి రీత్యా దంత వైద్యుడైన 69 ఏళ్ల సాహా 2016లో కాంగ్రెస్​ను వదిలి భాజపాలో చేరారు. 2020 నుంచి భాజపా త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 మార్చిలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Manik Saha
మాణిక్​ సాహా ప్రమాణ స్వీకారం

మాణిక్‌ సాహా పశ్చిమ త్రిపురలో 1953, జనవరి 8లో జన్మించారు. ఆయనకు భార్య స్వప్న సాహా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పట్నాలోని ప్రభుత్వ వైద్య కశాశాలలో బీడీఎస్‌, లఖ్‌నవూలోని కింగ్ జార్జ్‌ వైద్య కళాశాలలో ఎండీఎస్‌ పూర్తి చేశారు. పలు పత్రికలు, జర్నల్స్‌కు వ్యాసాలు కూడా రాస్తుంటారు. క్రీడలంటే ఎంతో మక్కువ. స్వయంగా ఆయన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన మాణిక్‌ సాహా పలు పతకాలు, సర్టిఫికెట్లు సాధించారు. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, త్రిపుర స్పోర్ట్స్‌ కౌన్సిల్ కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఈజిప్టు, హాంకాంగ్‌, థాయిలాండ్‌, దుబాయి వంటి దేశాల్లో పర్యటించారు. ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా, ఇండియన్‌ డెంటల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు.

భాజపా ఉత్తరాఖండ్​ వ్యూహం: పదే పదే ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీదని గతంలో భాజపా ఆరోపణలు గుప్పించేది. ఆసక్తికరమేంటంటే.. ఇప్పుడు అదే వైఖరిని కాషాయ పార్టీ అనుసరిస్తోంది. గత శనివారం త్రిపురలో అనూహ్యంగా సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌తో రాజీనామా చేయించి, ఆ స్థానంలో మాణిక్‌ సాహాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది. దీని వెనుక ఉత్తరాఖండ్‌ వ్యూహం దాగుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఉత్తరాఖండ్‌లో సీఎంను మారుస్తూ తీసుకున్న నిర్ణయం.. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపాకు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 2023లో ఎన్నికలు జరుపుకోనున్న త్రిపురలోనూ ఇదే వ్యూహాన్ని కాషాయపార్టీ పునరావృతం చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

2019 నుంచి గుజరాత్‌, కర్ణాటక సహా ఐదుగురు సీఎంలను భాజపా మార్చడం గమనార్హం. 2021 మార్చిలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను మార్చడంతో మొదలైన ఈ సంప్రదాయం ఒక్కో భాజపా పాలిత రాష్ట్రానికి పాకుతూపోతోంది. 2017లో బాధ్యతలు చేపట్టిన రావత్‌ను ఎన్నికలకు పదినెలల ముందు సీఎం పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో లోక్‌సభ సభ్యుడైన తీర్థసింగ్‌ రావత్‌ను నియమించారు. పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావత్‌పై వచ్చాయి. దీనికి తోడు ఆరునెలల్లోపు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాలి. కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని ఎన్నికల సంఘం స్పష్టంచేయడంతో రావత్‌ 2021 జులైలో రాజీనామాచేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన స్థానంలో పుష్కర్‌సింగ్‌ ధామిని నియమించారు. ఉత్తరాఖండ్‌ తర్వాత కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి మార్పు జరిగింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప స్థానంలో 2021 జులై 28వ తేదీన బసవరాజ్‌ బొమ్మై నియమితులయ్యారు. ఇదే తరహాలో 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ స్థానంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర రజనీకాంత్‌ పటేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది. రూపాని మెతక వైఖరి కారణంగా రాష్ట్రంలో బ్యూరోక్రాట్లు పెత్తనం చెలాయిస్తున్నారని, దానివల్ల రాజకీయపరమైన పరిపాలన దెబ్బతిందని, వచ్చే ఎన్నికల నాటికి ఇది నష్టం చేకూరుస్తుందన్న కారణంతో భాజపా అధిష్ఠానం అప్రమత్తమై ఎన్నికలకు ఏడాదికి ముందు ముఖ్యమంత్రిని మార్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్‌తో రాజీనామా చేయించింది. ఇక్కడ కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలే ముఖ్యమంత్రి మార్పునకు దారితీసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?

కాంగ్రెస్​లో 'ఒకే కుటుంబం- ఒకే పదవి​' రూల్.. సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి?

ఇదీ చూడండి: త్రిపుర సీఎం బిప్లవ్​ కుమార్ రాజీనామా.. మానిక్ సాహాకు పగ్గాలు

Last Updated :May 16, 2022, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.