74 ఏళ్ల తరువాత దేశంలోకి చీతాలు.. మోదీ బర్త్​డే రోజున ఆ పార్క్​లోకి విడుదల

author img

By

Published : Sep 15, 2022, 7:14 AM IST

pm modi cheetahs

74 ఏళ్ల తరువాత భారత్​లోకి మళ్లీ చీతాలు రాబోతున్నాయి. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా నమీబియా నుంచి 8 చీతాలు ప్రత్యేక బోయింగ్‌ విమానంలో ఈ నెల 17న దేశంలోకి అడుగు పెట్టబోతున్నాయి. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను అదే రోజు ప్రధాని మోదీ మహారాష్ట్రలోని కునో పార్కులోకి విడిచిపెట్టనున్నారు.

modi cheetah : దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించబోతున్నాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి రాబోతున్నాయి. ప్రత్యేక బోయింగ్‌ విమానంలో 16 గంటలు ప్రయాణించి ఈ నెల 17న దేశంలోకి అడుగు పెట్టబోతున్నాయి. వీటి తరలింపు కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విమానం బి747 జంబోజెట్‌ అయిదు ఆడ, మూడు మగ చీతాలతో నమీబియాలోని విండ్‌హోక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి జైపుర్‌లో దిగనుంది.

అక్కడి నుంచి హెలీక్యాప్టర్లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలిస్తారు. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కునో పార్కులోకి విడిచిపెడతారు. అదే రోజు ప్రధాని పుట్టినరోజు కావడం విశేషం. ఈ చీతాల కోసం కునో నేషనల్‌ పార్కులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. వీటి ఆలనా పాలన చూసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. భారత్‌కు తరలించనున్న చీతాలకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. ఆరోగ్యం, క్రూరత్వం, వేటాడే నైపుణ్యాలు, భవిష్యత్తులో వాటి సంతతిని పెంచగల జన్యుసామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని 8 చీతాలను భారత్‌ కోసం ఎంపిక చేశారు. కునో నేషనల్‌ పార్కులో వీటిని తొలుత 30 రోజులపాటు క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,500 చీతాలు ఉన్నట్లు అంచనా.

అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని ప్రయోగాత్మకంగా భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ చీతాకు సుప్రీంకోర్టు 2020 జనవరిలో ఆమోదముద్ర వేసింది. భారతీయ వన్యప్రాణి సంరక్షకులు తొలిసారిగా 2009లో భారత్‌కు చీతాలను రప్పించే ప్రతిపాదనను చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌కు చెందిన ప్రతినిధుల ముందుంచారు. దరిమిలా భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు డాక్టర్‌ మార్కర్‌ గత 12 ఏళ్లలో పలుమార్లు భారత్‌ను సందర్శించి చీతాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ప్రాంతాన్ని, ముసాయిదా ప్రణాళికలను పరిశీలించారు. చీతాల సంరక్షణ అంశంపై ఈ ఏడాది జులై 20న నమీబియా, భారత్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ మేరకు 8 చీతాలను భారత్‌కు అందించడానికి ఆ ఒప్పందం ద్వారా మార్గం సుగమం అయింది.

ఇవీ చదవండి: విమానం ఎక్కాలంటే.. ఆ పరీక్ష తప్పనిసరి.. డీజీసీఏ కీలక నిర్ణయం

లాకర్లలో 91కిలోల బంగారం, 340 కిలోల వెండి.. ఈడీ రైడ్స్​తో గుట్టు రట్టు.. విలువ ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.