సీఎం సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు, నగదు కోసం వెళ్తే బయటపడ్డ ఏకే47 రైఫిళ్లు

author img

By

Published : Aug 24, 2022, 4:41 PM IST

jharkhand illegal mining

నగదు కోసం సోదాలు చేసిన ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ అల్మారాలో ఈ రైఫిళ్లు బయటపడ్డాయి.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెండు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. బుధవారం 17 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించింది. సొరెన్‌కు సహాయకుడైన ప్రేమ్‌ ప్రకాశ్‌ ఆస్తులపై సోదాలు జరిపింది. ఈ క్రమంలో అతడికి చెందిన ఒక ఇంటి అల్మారాలో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాలపై ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేయనున్నారు.

AK 47 RIFLES ED
ఏకే 47 ఆయుధాలు

హేమంత్‌ సొరెన్‌తో ప్రేమ్‌ ప్రకాశ్‌కు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. ఝార్ఖండ్‌, బిహార్‌, తమిళ్‌నాడు,దిల్లీ ఎన్‌సీఆర్‌ల్లోని ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. "ఇప్పటి వరకు మేము స్వాధీనం చేసుకొన్న నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ము సాహిబ్‌గంజ్‌, సమీప అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌ నుంచి సంపాదించిన రూ.100 కోట్ల జాడ కూడా తెలిసింది. దానిని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం" అని ఈడీ పేర్కొంది.

ఇప్పటికే సొరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్యే పంకజ్‌ మిశ్రాను కూడా ఈడీ ప్రశ్నించింది. జులై 19న ఆయన్ను ఆరెస్టు చేసి 37 బ్యాంకుల నుంచి సుమారు రూ.11.8 కోట్లను స్వాధీనం చేసుకొంది. దీంతోపాటు ఇన్‌ల్యాండ్‌ వెస్సల్‌ ఎం.వి.ఇన్ఫ్రాలింక్‌-3ను కూడా అధికారులు సీజ్‌చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు రూ.36 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.