'కరోనా సంక్షోభంలోనూ రూ.కోట్ల సంపద.. యూనికార్న్​ స్టార్టప్​ల సెంచరీ'

author img

By

Published : May 30, 2022, 8:47 AM IST

PM Modi

PM Modi: దేశంలోని యూనికార్న్‌ స్టార్టప్‌ల సంఖ్య ఈ నెలతో వంద దాటిందని వెల్లడించారు ప్రధాని మోదీ. ఈ కంపెనీల మొత్తం విలువ రూ.25 లక్షల కోట్ల పైమాటే అని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మన్​కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు.

Mann Ki baat: కరోనా మహమ్మారి సమయంలోనూ భారతీయ స్టార్టప్‌ కంపెనీలు సంపద సృష్టించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతినెలా రేడియో ద్వారా ప్రసారమయ్యే ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆదివారం ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ కంపెనీల వ్యవస్థాపకులని ప్రశంసించారు. ‘క్రికెట్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేస్తే మీరెంతో ఉప్పొంగిపోతారు. దేశం మరో రంగంలో సెంచరీ సాధించింది. ఇది చాలా ప్రత్యేకం. దేశంలోని యూనికార్న్‌ స్టార్టప్‌ల సంఖ్య ఈ నెలతో వంద దాటింది. ఈ కంపెనీల మొత్తం విలువ రూ.25 లక్షల కోట్ల పైమాటే. ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణం’ అని ప్రధాని తెలిపారు. కనీసం రూ.7,500 కోట్ల టర్నోవర్‌ ఉన్న స్టార్టప్‌ను యూనికార్న్‌ కంపెనీ అంటారు.

75 నగరాల్లో యోగా ఉత్సవాలు: దేశ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల నేపథ్యంలో జూన్‌ 21న జరుపుకోనున్న 8వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు దేశంలోని 75 నగరాలు సిద్ధం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసుకోవాలని ప్రజలను కోరారు. పురాతన ఆలయాలు, పర్యటక ప్రదేశాలు, ప్రముఖ నదీతీరాలు, సరస్సులు లేదా చెరువుల పక్కనున్న ప్రాంతాలు పరిశీలించవచ్చన్నారు. ఈ ఏడాది యోగా డే ‘మానవాళి కోసం యోగా’ పేరిట నిర్వహించాలన్నారు. ‘విస్తృతంగా వ్యాక్సినేషన్‌ జరిగినందున ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇపుడు కొంత మెరుగుపడ్డాయి. కొవిడ్‌ తర్వాత మన జీవితాల్లో యోగా ప్రాధాన్యం మరింత పెరిగింది’ అని మోదీ తెలిపారు.

సూర్య గమనానికి అనుగుణంగా యోగా: ఈసారి యోగా డేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత నెట్‌వర్క్‌ సాయంతో ‘గార్డియన్‌ రింగ్‌’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ప్రధాని చెప్పారు. తొలుత సూర్యోదయం అయ్యేచోట మొదలుపెట్టి ఒక దేశం తర్వాత మరొక దేశం స్థానిక కాలమానానికి అనుగుణంగా తూర్పు నుంచి పడమరకు క్రమక్రమంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తాయన్నారు. వీటిని ఒకదానికొకటి అనుసంధానం చేస్తామని తెలిపారు.

జపాన్‌లో రామాయణ, మహాభారతాలు: ఇటీవలి జపాన్‌ పర్యటనలో కొందరు అద్భుత వ్యక్తులను తాను కలుసుకున్నానని, కళా దర్శకుడు హిరోషి కోయికె జి అందులో ఒకరని ప్రధాని తెలిపారు. కంబోడియాతో మొదలై గత తొమ్మిదేళ్లుగా ఆయన మహాభారత్‌ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఏటా ఓ ఆసియా దేశాన్ని సందర్శించి స్థానిక కళాకారుల సాయంతో మహాభారత అంకాలను ప్రదర్శిస్తారన్నారు. 30 ఏళ్ల కిందట రామాయణం ఆధారంగా జపాన్‌ దేశస్థులు రూపొందించిన యానిమేషన్‌ చిత్రం గురించి కూడా ప్రధాని వివరించారు.

భిన్నత్వమే మన బలం: భిన్న భాషలు, సంస్కృతులకు భారతదేశం నిలయమని, ఈ భిన్నత్వమే మనల్ని ఒకటిగా కలిపి ఉంచే బలమని మోదీ అన్నారు. జూన్‌ 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా పరిశుభ్రతకు అందరూ కంకణబద్ధులై ఇతరులకు స్ఫూర్తి కలిగించేలా మొక్కలు నాటాలని కోరారు.

ఇదీ చదవండి: ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13 కోట్లు.. మొత్తం 100 మందికి.. ఎలా జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.